పురాణాలు

12 Posts • 280K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
845 views 28 days ago
చండీ హోమము ఎందుకు చేయాలి.......!! అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. 1. చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు : చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి. 2. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు: ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు. ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం
13 likes
13 shares
Anjaiah Soma
1K views 21 days ago
*శివార్పణం ………!!* ఇది నిజంగా జరిగిన కథ అని చెబుతారు…. ఇప్పటికీ ఆ ప్రదేశంలో జరిగే ఉత్సవాలు, వేడుకలు ఇందుకు నిదర్శనం….. పరమ శివునికి మహాభక్తుడైన ఓ జాలరి కథను తెలుసుకుందాం….. *“జాలరి కథ”……!!* తమిళనాడు దగ్గర సముద్రతీర ప్రాంతంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహా శివభక్తుడు…… ఈ జాలరివాడి దినచర్య అందరిలా కాకుండా కొంత ప్రత్యేకంగా ఉండేది….. ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు…. ఈ జాలరి అందరితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు…. అయితే ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని “శివార్పణం”అని సముద్రంలో వేసేవాడు….. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు….. ఈ విధంగా అతను భగవద్భక్తిని పాటిస్తూ కుటుంబ పోషణ చేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవాడు….. ఇతని బ్రతుకులో తెలిసినదంతా తనకు దొరికిన దానిలో మొదటిది “శివార్పణం” చేయడమే…… *“శివార్పణం”అంటే….!!* నిజానికి భక్తి అంటేనే “శివార్పణం”…..ఏ పని చేసినా భక్తితో మనసారా “శివార్పణం” అంటే చాలు ఎక్కడలేని ప్రశాంతత కలుగుతుంది….. అలా అనగలిగిన వారు నిజంగా ధన్యులు… నిజానికి శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది…. శివభక్తి….శివ ప్రేమ…”శివార్పణం” ఇలాంటి మాటలు. ఈ జాలరికి తెలిసిన ఒకే పదం “శివార్పణం”…. *ఒకే మాటగా ఒకే బాటగా….!!* ఈ జాలరి నాయకత్వంతో అందరూ సుఖంగా ఉండేవాళ్లు…. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్లు అదే పాటించేవారు….. ఒకే మాటగా ఒకే బాటగా వారంతా ఆనందంగా జీవనం సాగిస్తుండేవాడు…. జాలరి నాయకత్వంలో మత్స్యసంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు…. *ముంచుకొచ్చిన ఆపద…!!* ఇలా కాలం ఆనందంగా సాగుతుండగా ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్లకి చేపలు పడలేదు….. ఎన్నాళ్లు సముద్రంలోకి ఎంత దూరం వెళ్లి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకీ, కుటుంబ పోషణకీ అయిపోయాయి….. చివరికి తిండికి కూడా కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఎవరి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు…… *వలలో బంగారు చేప…..!!* ఒకసారి అందరూ గుంపుగా వెళ్లి చేపల కోసం వల వేశారు….. జాలరి నాయకుడు వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది….. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కనీవినీ ఎరుగని ఒక చేప వచ్చింది…. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు పొదిగిన చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది…. దానిని వీళ్లందరూ కష్టపడి పడవ మీదకి తీసుకువచ్చారు….. ఈ చేపని కానీ తీసుకువెళ్లి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్లకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్మినా మరెన్నడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది….. *మరి శివార్పణం ఎలా…..!!* జాలరి నాయకునికి మొదట పడ్డ చేప శివార్పణంగా సముద్రంలోకి విసిరేయడం అలవాటు కదా…… పోనీ దీనితోపాటు ఒక రెండు, మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు. కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప…. ఆందోళనలో జాలరులు అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న మిగిలిన వాళ్లందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్లందరికీ తెలుసు. మొదటి చేపను “శివార్పణం” అని వేయడం ఈయనకు అలవాటు… నాయకుడు కాబట్టి వద్దు అనలేరు…. తిండికి కూడా గడవని ఈ గడ్డు పరిస్థితిలో ఈయన ఇప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది….. మిగిలిన జాలరులు ప్రతిరోజూ తిండికి లేదని బాధ పడుతుంటే ఈ పెద్దమనిషి మాత్రం రోజూ “శివార్పణం” చేయడానికి చేప లేదు అని ఏడ్చేవాడు. ఇక ఇప్పుడు ఈ బంగారు చేపను “శివార్పణం” చేస్తే ఇక మన గతి ఏంటి అని అందరూ ఆందోళన చెందసాగారు….. *అదీ భక్తి అంటే…..!!* ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది….. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను. శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్లంతా పులకించిపోయింది….. కళ్లవెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. ఆ చేపని పైకి తీశాడు. మిగిలిన జాలరులు ఆ చేపను “శివార్పణం” చేయవద్దని ఆయన కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు…… “శివార్పణం” అయిన బంగారు చేప జాలరుల ప్రార్థనలు కానీ…. ఏడుపు కానీ ఆ నాయకునికేమి పట్టలేదు…… శివుడికి ఇవ్వడానికి బంగారు చేప దొరికిందన్న ఆనందంతో మైమరచిపోయి ఆ చేపను పైకెత్తి “శివార్పణం” అని సముద్రంలో వేశాడు….. *ప్రత్యక్షమైన పరమశివుడు…..!!* వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో…… మహా కాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యలో……”వృషభ వాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు”…. దర్శనమిచ్చి 'సంతోషించాను' అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్లకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు….. భక్తుని ఆశ్రయంతో భగవత్ దర్శనం ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుని పూజించకపోయినా భగవంతుని భక్తుడిని అంటిపెట్టుకున్న చాలు తరించిపోతాం అని చెప్పడం. ఆ జాలరి నాయకుడు తన అచంచలమైన భక్తి విశ్వాసాలతో తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు…… *ఇది నిజం…..!!* నాగపట్నంలో ఇప్పటికీ ఆ భక్తుడి పేరున ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న శివుడు ఉత్సవమూర్తిని తీసుకువచ్చి ఆ జాలరి వాళ్ల ఇంట్లో ఘనంగా ఉత్సవం చేస్తారు. *జీవిత సత్యం……!!* అర్పణకు సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి….. కనుక అర్పించేదే నీది…. దాచుకున్నది నీది కాదు….. తరువాత ఎవడిదో అవుతుంది….. ఇలాంటి కథలు వింటే స్వార్థ రాహిత్యము, త్యాగనిరతి, ఏర్పడి నీతి, నిజాయితీ అభివృద్ధి చెందుతాయి….. ఇలాంటి నిజ జీవిత గాథలు మన పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేసి వారిలో భగవత్ భక్తిని పెంచి, అర్పించడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేయాలి….. ఇలాంటి భగవత్ కథ వింటూ ఉంటే మనలో రజోగుణం తమోగుణం పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి….. *ఓం నమ:శివాయ….!!* ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి…….!! *అరుణాచల శివ*🙏 #పురాణ కథలు #పురాణ గాథలు/కథలు #📙🙏శివుని పురాణ కథలు #హిందూ పురాణ కథలు #పురాణ కథ
15 likes
12 shares