#పూరి మహా ప్రసాదం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #పూరీ జగన్నాథ్ ఆలయ ప్రసాదం
*భగవత్ ప్రసాదం*
*పూరీ జగన్నాథ భగవత్ ప్రసాదం*
శ్రీ జగన్నాథపురిలో సాత్విక్ అనే రాజు ఉండేవాడు. ఆయన పరమ భక్తుడు. అతనికి శ్రీజగన్నాథుడంటే ఎంతో భక్తి, ప్రతి రోజూ ఆలయం నుంచి అర్చకుడు తీసుకుని వచ్చిన ప్రసాదం భక్తిపూర్వకంగా స్వీకరించేవాడు. ఒకనాడు రాజు పాచికలాట ఆడుతూండగా శ్రీజగన్నాథుని ఆలయం నుంచి అర్చకుడు ప్రసాదం తీసుకుని వచ్చాడు. రాజు కుడిచేతిలో పాచికలున్నాయి. పాచికలాటలో నిమగ్నమైవున్న రాజు అన్యమనస్కుడై పొరపాటున నైవేద్య పాత్రను ఎడమ చేతితో తాకాడు. భగవత్ప్రసాదాన్ని ఎడమ చేతితో తాకడం అపరాధంగా భావించిన అర్చకుడు ఆ పాత్రను తీసుకుని కోపంగా వెళ్ళిపోయాడు. పాచికలాట పూర్తి అయ్యాక రాజు తన పొరపాటును గ్రహించాడు. అన్న పానీయాలు త్యజించాడు. జూదానికి బానిసై తన కుడి చెయ్యి భగవంతుడి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు దాన్ని శిక్షించాలని తలచాడు.
రాజు ఈ విషయంలో పండితుల అభిప్రాయం తెలుసుకోదలచి పండితుల సభను ఏర్పాటు చేశాడు. 'భగవంతుడి ప్రసాదాన్ని అవమానించిన వారికి ఏ విధమైన శిక్ష విధించాలి?' అని అడిగాడు. 'అపరాధిని సర్వదా త్యజించడమే తగిన దండన' అని చెప్పారు. రాజు తన కుడి చేతిని ఖండించడమే. తగిన శిక్ష అని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ అపరాధిని తానే అని తెలిస్తే ఎవరూ ఈ శిక్ష అమలుపరచడానికి ముందుకురారు. అందువల్ల తనను తాను ఎలా శిక్షించుకోవాలో ఆలోచిస్తూ చింతామగ్నుడై ఉన్నాడు. విషణ్ణవదనుడైన రాజును చూసిన మంత్రి కారణం అడిగాడు. "ప్రతి రాత్రి ఒక దయ్యం వచ్చి నా గది గవాక్షం దగ్గర చేతులు ఊపుతూ భయపెడుతోంది. ఆ కారణంగా నాకు నిద్ర పట్టడం లేదు" అన్నాడు రాజు. అందుకు మంత్రి "ఈ రాత్రి నేను మీ గదిలో పడుకుంటాను. మీరు వేరే గదిలో పడుకోండి. ఆ దయ్యం వచ్చి చేతులూపుతూ ఉంటే నేను దాని చెయ్యి నరికివేస్తాను. అలా దాని పీడ విరగడ అవుతుంది" అన్నాడు. "అవును. మీరు చెప్పిన ఉపాయం బాగానే ఉంది" అని మంత్రితో అన్నాడు రాజు.
అర్ధరాత్రి అయ్యాక రాజు తన గది కిటికీ దగ్గరకు వెళ్ళి కుడిచేయిని ఊపుతూ కేకలు వేశాడు. మంత్రి అది ఆ దయ్యం చేస్తున్న అల్లరే అనుకుని చేతిని నరికేసాడు. అప్పుడు రాజు వెలుగులోకి వచ్చాడు. ఎదురుగా రాజునూ, తెగి కింద పడిన రాజు చేతిని చూసి మంత్రి దుఃఖించాడు. అనాలోచితంగా ఇలాంటి పని చేసానేమిటని చాలా బాధ పడ్డాడు. అందుకు రాజు, "మంత్రీ! మీరు నిర్దోషులు. తప్పు చేసినవాణ్ణి నేను. అందుకు శిక్ష అనుభవించాల్సిందే" అని అన్నాడు.
రాజుకు గల దైవ భక్తి, తన ప్రసాదం పట్ల నిష్ఠ చూసి జగన్నాథస్వామి ఆ అర్చకుడికి స్వప్నంలో కనిపించి, "వెంటనే ప్రసాదం తీసుకుని వెళ్ళి రాజుకివ్వండి. తెగిపోయిన రాజు చేతిని తెచ్చి మన తోటలో పాతి పెట్టండి" అని అజ్ఞాపించాడు.
భగవంతుడి ఆజ్ఞ ప్రకారం అర్చకుడు ప్రసాదం తీసుకొచ్చి రాజుకిచ్చాడు. రాజు ప్రసాదం తీసుకునేందుకు చేతిని. చాపినప్పుడు కుడి చెయ్యి తిరిగి వచ్చింది. జగన్నాథస్వామి తనపై చూపిన కరుణకు రాజు కన్నీటిపర్యంతమై ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో కళ్ళకద్దుకొని స్వీకరించాడు. ఖండించిన రాజు కుడి చేతిని పాతిపెట్టిన స్థానంలో దవనం మొక్కలు మొలిచాయి. ఆ దవనం పత్రి, పువ్వులు జగన్నాథునికి అత్యంత ప్రీతికరమైనవి. అందుకే, ఇప్పటికీ పూరీలో జగన్నాథస్వామి అర్చనకు ప్రతి నిత్యం దవనం తప్పకుండా వాడడం సంప్రదాయంగా వస్తోంది.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
_ఆధ్యాత్మికం ఆనందం