#తెలుగుదేశం
*44 ఏళ్లలో టీడీపీ ఎదిగిందా? దిగజారిందా❓*
MARCH 29, 2026🚲
ఇవాళ టీడీపీ ఆవిర్భావించిన రోజు. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లు పూర్తి చేసుకుని, 45వ వసంతంలో అడుగు పెట్టింది. అధికారంలో ఉండడంతో టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటారు. ఒక రాజకీయ పార్టీ 44 ఏళ్లు మనుగడ సాగించడం చిన్న విషయం కాదు. నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ ప్రస్థానంలో టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. అయినప్పటికీ తట్టుకుని నిలబడింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో టీడీపీది ఘనమైన చరిత్రే. 60 ఏళ్లకు పైబడిన వయసులో సినీ దిగ్గజం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. నాడు కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఎన్టీఆర్కు కలిసొచ్చింది. టీడీపీ సునామీలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అయితే పరిపాలనతో పాటు రాజకీయాల్లో అనుభవరాహిత్యంతో ఎన్టీఆర్కు కష్టాలొచ్చాయి. నాదెండ్ల భాస్కర్రావు రూపంలో టీడీపీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాన్ని అధిగమించి తిరిగి ఎన్టీఆర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
అయితే 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత 94లో మళ్లీ ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చింది. ఈ దఫా అల్లుడు చంద్రబాబు రూపంలో సంక్షోభం తలెత్తింది. కుట్రదారులంతా అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలే కావడంతో ఎన్టీఆర్ ఏమీ చేసుకోలేకపోయారని ఆయన్ను అభిమానించేవారు తరచూ అంటుంటారు. అయితే లక్ష్మీపార్వతి నుంచి టీడీపీని కాపాడుకోడానికి ఎన్టీఆర్ను గద్దె దింపడం మినహా, మరో మార్గం కనిపించలేదని చంద్రబాబు సహా బంధువులు చెప్పే మాట.
ఇదిలా వుండగా ఎన్టీఆర్ హయాంలో సామాన్యులకు పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయకత్వంలో మాత్రం కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైందనే విమర్శను కొట్టిపారేయంలేం. సుజనాచౌదరి, సీఎం రమేశ్ తదితర వ్యాపారులకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ ఒంటరిగానే అధికారాన్ని సాధించేగలిగే శక్తి సామర్థ్యాలు వుండేది.
కానీ చంద్రబాబు హయాంలోకి వచ్చే సరికి ఆ పరిస్థితి పోయింది. టీడీపీ ప్రస్థానంలో 44 ఏళ్లు పూర్తి అయ్యే సరికి ఎదిగిందా? దిగజారిందా? అనే ప్రశ్నకు... పరపతి పోయిందనే సమాధానమే వస్తుంది. ఇంకో పార్టీతో పొత్తులేనిదే టీడీపీ అధికారంలోకి రాలేని దుస్థితి. ముఖ్యంగా వైసీపీని ఎదుర్కోవాలంటే మూడు, నాలుగు పార్టీలతో కలిసి చంద్రబాబు ఎన్నికల సమరానికి వెళ్లాల్సిన పరిస్థితి.
టీడీపీ భయం, బలహీనత ఇతర పార్టీలకు అలుసుగా మారింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏ మాత్రం బలం లేకపోయినా, ఆ పార్టీ శక్తికి మించి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను చంద్రబాబు కట్టబెడుతున్నారు. అది కూడా టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటోంది. తానే బతిమలాడి పొత్తుకు ఒప్పించానని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పదేపదే అంటుంటారు.
మరోవైపు తామే అండగా నిలబడలేకపోతే, అసలు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి, వైసీపీని ఎదుర్కొనేంత సీన్ లేదని పవన్తో పాటు జనసేన నాయకులు ఇప్పటికీ అంటుంటారు. ఈ మాటల్ని ఖండించే పరిస్థితిలో టీడీపీ లేదు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ బలహీనపడడం వల్లే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందనేది జగమెరిగిన సత్యం.
ప్రస్తుతం నారా లోకేశ్ అనధికారికంగా టీడీపీని నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ ఈయనే ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా అధికారాన్ని చెలాయిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీలో చంద్రబాబు, లోకేశ్ వర్గాలున్నాయి. అయితే ఈ మాటను లోకేశ్ అసలు ఒప్పుకోరు. తమందరీ బాస్ చంద్రబాబే అని లోకేశ్ అంటుంటారు.
అయితే చంద్రబాబు ఉన్నంత వరకే లోకేశ్కు ఆదరణ అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇది లోకేశ్కు రాజకీయంగా శ్రేయస్కరం కాదు. చంద్రబాబును మించిన నాయకుడనే లోకేశ్ అనిపించుకుంటే భవిష్యత్ బాగుంటుంది. అయితే కలుపుగోలుతనంలో తండ్రిలా లోకేశ్ కూడా చొరవ చూపుతున్నారు. లోకేశ్ను టీడీపీ శ్రేణులు ఆదరిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో వుండడం వల్ల ఆదరిస్తున్నారా? అనే ప్రశ్నకు కాలం జవాబు చెప్పాల్సి వుంటుంది. ప్రస్తుతానికైతే, ఊతకర్ర లేనిదే నడవలేని దశకు టీడీపీ చేరింది. దీని నుంచి ఎదిగినప్పుడే టీడీపీకి భవిష్యత్. ఆ పని లోకేశ్ హయాంలో జరుగుతుందా? లేదా? అనేది తేలాల్సి వుంది.