#📰ఈరోజు అప్డేట్స్
అమరజీవి త్యాగం తెలుగు జాతికి చిరస్మరణీయం
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, డిసెంబరు 15:
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, చివరకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి అచ్చెన్న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన చేసిన త్యాగం తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోలేనిది, చిరస్మరణీయం అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన ఆత్మబలిదానమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది. పొట్టి శ్రీరాములు కేవలం రాష్ట్ర సాధనకే కాక, హరిజనోద్ధరణ వంటి ఉన్నత ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప గాంధేయవాది అని గుర్తు చేశారు. చరిత్ర ఉన్నంత వరకూ ఆయన అందరి మదిలోనే ఉంటారు. ఆయన త్యాగ ఫలితమే రాష్ట్రం ఏర్పడింది. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం మనమంతా పునరంకితమవ్వాలి. ఆయన త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా మార్చడమే మన సంకల్పమని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని మంత్రి పేర్కొన్నారు.
#🙏పొట్టి శ్రీరాములు వర్ధంతి💐 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #🆕Current అప్డేట్స్📢