#neet paper' leak 🧾
*లేపి తన్నించుకున్నట్లయింది..‼️*
28.07.2026🎯
హెడింగ్ చూడగానే తెలుగువాళ్లకు రావు గోపాలరావు డైలాగు గుర్తుకు వస్తే అది కాక్రోచ్ ఆందోళనకారులను అవమానించినట్లే అవుతుంది.
దాని కంటె మెరుగైన ఉదాహరణ యిస్తాను. జపాన్ వాళ్లు 1941 డిసెంబరులో అమెరికా వారి పెర్ల్ హార్బర్పై ఆకస్మిక విమానదాడి చేసి, దాన్ని యుద్ధంలోకి లాక్కుని వచ్చిన సబ్జక్టుపై ‘‘తొరా, తొరా, తొరా’’ (1970) అనే సినిమా వచ్చింది. ఆ దాడి చేయాలా వద్దా అనే దానిపై చాలా తర్జనభర్జనలు జరుగుతాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వుంటుంది. చివరకు దాడి చేసి, తిరిగి వెళ్లిపోతూ జపాన్ నౌకాదళాధికారి
‘ఐ ఫియర్ ఆల్ వి హేవ్ డన్ ఈజ్ టు ఎవేకెన్ స్లీపింగ్ జయంట్ అండ్ ఫిల్ హిమ్ విత్ ఏ టెర్రిబుల్ రిజాల్వ్’ అంటాడు.
అదే క్లయిమాక్స్. ఈ వాక్యం అర్థం కావాలంటే కాస్త చరిత్ర తెలియాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో (1914-18) ఎల్లయిడ్ పవర్స్ తరఫున గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, ఇటలీ, జపాన్ యిత్యాదులు పోరాడగా, సెంట్రల్ పవర్స్ తరఫున జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఓటోమాన్ సామ్రాజ్యం, బల్గేరియా పోరాడాయి. ఎల్లయిడ్ పవర్స్ నెగ్గాయి.
అమెరికాను లేపి, చావగొట్టించుకుంది
రెండవ ప్రపంచ యుద్ధం (1939-45)ని ఏక్సిస్ పవర్స్ ఐన జర్మనీ, ఇటలీ, జపాన్ మొదలుపెట్టాయి. ఎల్లయిడ్ పవర్స్గా గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్గా మారిన రష్యా, అమెరికా ఏర్పడి వాటిని ఓడించాయి. 1939 సెప్టెంబరులో యుద్ధం ప్రారంభమైతే అమెరికా రెండేళ్లు గడిచినా యుద్ధరంగంలోకి దిగలేదు. యూరోప్యే ప్రధానంగా యుద్ధక్షేత్రంగా వుంది. ఈ సమయంలో జపాన్ చక్రవర్తికి ఆశ పుట్టింది. వాళ్లకు రష్యాతో సరిహద్దు పేచీలున్నాయి, సరైన ప్రభుత్వం లేక, బలహీనంగా వున్న చైనాపై కన్నుంది. 1937లో చైనాపై దాడి చేసి దాన్ని ఆక్రమించింది.
యుద్ధం మొదటి దశలో యాక్సిస్ పవర్స్దై పైచేయిగా వుండడం చూసి ‘యూరోప్ మీరు కబళించండి, ఆసియాను నేను కబళిస్తాను’ అంటూ 1940 సెప్టెంబరులో వారి కూటమిలో చేరింది. చైనాతో సరిపెట్టుకోవడం దేనికి, ఏకంగా తూర్పున వున్న అమెరికాను, పశ్చిమాన వున్న బ్రిటిష్ వలస రాజ్యాలైన ఇండియా, బర్మా, ఆగ్నేయాసియా దేశాలను గెలుచుకోవచ్చు కదా అనుకుని, 1941 డిసెంబరులో అమెరికాపై దాడి చేసింది.
దాంతో గట్టు మీద వున్న అమెరికా రంగంలోకి దిగి, ఎల్లయిడ్ పవర్స్తో చేతులు కలిపి, యుద్ధంలో వారు విజయం సాధించడానికి ఘనమైన పాత్ర వహించింది. ఆ భూతాన్ని నిద్ర లేపి, చితక్కొట్టించుకున్న పాపానికి జపాన్ యింకా ప్రాయశ్చిత్తం చేసుకుంటోంది.
యుద్ధం ముగిసి 80 ఏళ్లు దాటినా జపాన్ సొంత సైన్యం పెట్టుకోవడానికి, యుద్ధం ప్రారంభించడానికి వీల్లేదని అమెరికా శాసించింది. తన ఆజ్ఞ ఉల్లంఘిస్తే దండించడానికి 50 వేల మంది తన సైనికులను జపాన్లో వుంచి, వారి ఖర్చులను జపాన్ నెత్తి మీదే రుద్దుతోంది. ఇదీ చరిత్ర చెప్పే పాఠం.
ఇది ఎందుకు గుర్తుకు
వచ్చిందంటే తాజాగా నీట్ పరీక్షల లీక్ వివాదంలో మోదీ ప్రభుత్వం సుషుప్తావస్థలో వున్న యువతను అనవసరంగా మేల్కొల్పి, కొరివితో తల గోక్కుందని అనిపించింది నాకు.
ఇప్పుడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో భారతదేశ రాజకీయ చరిత్ర మారిపోతుందని, మోదీ అధికార పీఠం కదిలిపోతుందని, ఇదే వూపుతో యువలోకం సమాజాన్ని మార్చేసి, రాజకీయాలను ప్రక్షాళన చేసేసి, దేశానికి దిశానిర్దేశం చేస్తుందనే భ్రమలు నాకు లేవు. త్వరలోనే మొత్తమంతా సద్దు మణిగి, ఎవరికి వారు తమ తమ పనుల్లో మునగవచ్చు. కానీ యీ క్షణానికి యిది ఒక గమనార్హమైన సంఘటనే.
ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడి, కళ్లు నులుముకుని, యిది నిజమేనా? అని ఆశ్చర్యపడి, తనను తాను గిల్లుకుని చూసే సందర్భమే. దీని ప్రభావం తీవ్రంగా వుంటుందని ఎలా చెప్పలేమో, అస్సలు వుండదని కూడా అలాగే చెప్పలేం. చెట్టుకి మేకు కొట్టి, సారీ చెప్పి, దాన్ని వెంటనే పీకేసినా, ఆ గాటయితే కాండంపై వుంటుంది కదా! అలాగే ఫీలింగ్స్ హర్ట్ అయిన వాళ్ల మనసులో పుండు సలుపుతూనే వుంటుంది.
అది ఎప్పుడు ఏ రూపంలో తన ప్రభావాన్ని చూపుతుందో యిప్పుడే చెప్పలేం.
కొన్ని వర్గాలతో సున్నితంగా వ్యవహరించాలి
నిజానికి దీన్ని యీ స్థాయి దాకా ముదరనీయకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్త పడి వుండాల్సిందని అనుకునే వారు మోదీ అనుయాయులే కాదు, అభిమానుల్లో కూడా వున్నారు.
బిజెపి వారు రాజకీయ నాయకులు కాబట్టి, వంది మాగధులు చుట్టూ చేరి, దడి కట్టేయడం చేత వారికి ప్రజలతో డిస్కనెక్ట్ ఏర్పడే అవకాశాలున్నాయి. కానీ ఆరెస్సెస్ కార్యకర్తలు సామాన్య ప్రజలతో నిరంతరం సంపర్కంలో వుంటారు కాబట్టి, ప్రజల్లో కలుగుతున్న అసంతృప్తి వారు ఫీలై వుంటారు. ఆరెస్సెస్ అధికారికంగా ప్రకటన చేయకపోయినా దాని నాయకులు కొందరు మా వ్యక్తిగత అభిప్రాయం అంటూ ‘తెగేదాకా లాగకండి’ అంటూ బహిరంగంగానే అనసాగారు.
ఆందోళన చేసేవాళ్లు రాజకీయ నాయకులైతే జనాలు నోరు చప్పరించి వూరుకుంటారు. కానీ విద్యార్థులు, ఉద్యోగార్థులు, 30 ఏళ్ల లోపు వాళ్లు. పైగా వాళ్లు తమకు ప్రభుత్వోద్యోగాలు కావాలనో, కులరీత్యా రిజర్వేషన్లు కావాలనో రోడ్డు మీదకు రాలేదు. పరీక్షా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ గళమెత్తారు. ఎందుకంటే అది వారి భవిష్యత్తుకి సంబంధించిన విషయం. వారి భవిష్యత్తుతో వాళ్ల తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు కూడా ముడిపడి వున్నాయని గుర్తించాలి.
ఈ సున్నితత్వాన్ని గ్రహించి, ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి వుండాల్సింది. కానీ అనవసరంగా కోతిపుండుని బ్రహ్మరాక్షసి చేసుకుంది. ఇవాళ తీసుకున్న చర్యలు నెల్లాళ్ల కితమే తీసుకుని వుంటే, యింత రగడ జరిగేది కాదు. కొన్ని వర్గాలతో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా వుండాలి. రాజకీయ నాయకుల్ని అర్ధరాత్రి లేపి జైలుకి యీడ్చుకుపోయినా, తల బద్దలు కొట్టినా, ఏ ఆధారమూ లేకుండా ఈడీ కేసులో యిరికించినా, బెదిరించి పార్టీ మార్పించినా, ప్రత్యర్థి క్యాంపుల్లోంచి కిడ్నాప్ చేసినా, పాత్రికేయులను, ప్రజాహక్కుల ఉద్యమకారులను దేశద్రోహం నేరం మీద ఏళ్ల తరబడి జైల్లో పెట్టి కాళ్లు విరక్కొట్టినా, విరాళాలివ్వడానికి నిరాకరించిన పారిశ్రామికవేత్త ఫ్యాక్టరీకి అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా ఆపేసినా.. చెల్లిపోతుంది. జనం లైట్ తీసుకుంటారు.
అదే వికలాంగుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జులుం ప్రదర్శిస్తే నొచ్చుకుంటారు. విద్యార్థినులపై జులుం ప్రదర్శించినా అసహ్యించుకుంటారు. టీవీ లేదా యూట్యూబు ప్రేక్షకుడికి తన కూతురే గుర్తుకు వస్తుంది.
వికలాంగుల నిరసనలో న్యాయం వుందా, విద్యార్థినులు సవ్యంగా ప్రవర్తించారా అనేవి తర్వాతి విషయాలు. ఇప్పుడు యీ వ్యాసంలో కూడా నేను కాక్రోచ్ జనతా పార్టీ సవ్యమైనదా కాదా, అభిజీత్ దీప్కే బోస్టన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేశాడా లేదా, సోనమ్ వాంగ్చుక్కు హిడెన్ ఎజెండా వుందా, యీ ఆందోళన వెనక్కాల విదేశీ శక్తులున్నాయా? ఆందోళన కారులు ఎక్కువ హింసాత్మకంగా వున్నారా, పోలీసులు ఎక్కువ హింసను ప్రదర్శించారా, ప్రతిపక్షాలు వీరిని ఎగదోశాయా, ఆందోళనకారులు డాన్సులు చేశారా, పగటి వేషాలు వేశారా, అసభ్యకరమైన భాష వాడారా, పరీక్ష పేపర్లు లీక్లు కావడం యిప్పుడే జరిగిందా, గతంలో జరిగినప్పుడు యింత లావు ఆందోళన చేయలేదేం, ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రిత్వ శాఖపై శ్రద్ధ చూపకుండా ఎన్నికల వ్యూహరచనల్లో బిజీగా వున్నాడన్నమాట వాస్తవమా – యిలాటి వాటిపై రాయదలచటం లేదు. విద్యార్థులు రంగంలోకి దిగితే ఎంత దూరం వెళ్లగలదో చెప్పడానికే యీ వ్యాసాన్ని ఉద్దేశిస్తున్నాను.
1970ల్లో నవనిర్మాణ్ ఆందోళన్
మా చిన్నప్పుడు కాలేజీల్లో విద్యార్థి సంఘాలుండేవి, కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు – యిలా ప్రతీ పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘాలుండేవి. నాయకుల పిల్లలు వాటిల్లో తర్ఫీదు అయ్యేవారు. విడిగా ప్రతిభావంతులు రాతలో లేదా కూతలో లేదా చేతలో తమ టాలెంటు చాటుకుని, పార్టీ పెద్దల దృష్టిలో పడేవారు. కాలేజీ తర్వాత యూత్ వింగ్లో పని చేసేవారు. అక్కణ్నుంచి ప్రమోషన్ వచ్చి మెయిన్ పార్టీలో టిక్కెట్టు దక్కించుకునే వారు. ఇదీ అప్పటి నాయకులు తయారయైన వరస. (ధర్మేంద్ర ప్రధాన్ కూడా అలా వచ్చినవాడేట) విద్యార్థి నాయకులుగా వుండగా వీళ్ల దృష్టి తక్షణ రాజకీయాల కంటె జాతీయ, అంతర్జాతీయ అంశాలపై, సమాజాన్ని తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎలా మార్చాలి అనే దానిపైనే వుండేది. ఇలా వుంటూండగా 1973లో గుజరాత్లో నవనిర్మాణ్ ఆందోళన ప్రారంభమైంది. దాని పూర్వాపరాలు తెలుసుకోవడం ఆవశ్యకం.
ఇందిరా గాంధీ ప్రధాని అయ్యే సమయానికి దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో వుంది. అనేక రకాల కొరతలు వుండేవి. ముఖ్యంగా ఆహారధాన్యాల కొరత! ఆమె పార్టీలో కొందరి సహాయంతో బాంకుల జాతీయకరణ వంటి కార్యక్రమాలు చేపట్టి, సోషలిస్టు విధానాలతో ప్రజలను ఆకట్టుకుందామని చూసింది. కానీ పార్టీ పెద్దలకు (సిండికేట్ అనేవారు) అది రుచించలేదు. 1969 నవంబరులో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె కాంగ్రెసు (ఆర్-రిక్వెజనసిస్ట్స్) పేర పార్టీని చీల్చింది. సిండికేట్ చేతిలో వున్న భాగాన్ని కాంగ్రెస్ (ఓ – ఆర్గనైజేషన్) అనేవారు. 1971 మార్చిలో ఇందిర పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళితే మొత్తం 518లో 352 సీట్లు ఇందిర వర్గానికి రాగా, కాంగ్రెస్ (ఓ)కు 16 వచ్చాయి. 1972 మార్చిలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా మొత్తం 167 సీట్లలో 140 సీట్లు ఇందిర వర్గానికి రాగా, మొరార్జీ దేశాయి నేతృత్వంలోని కాంగ్రెస్ (ఓ)కు 16 వచ్చాయి. ఐదేళ్ల కితం 66 సీట్లు తెచ్చుకున్న స్వతంత్ర పార్టీకి యీ సారి 0, 1 సీటు తెచ్చుకున్న జనసంఘ్కి 3 వచ్చాయి. ఇందిర పార్టీ తరఫున ఘన్శ్యామ్ ఓఝా ముఖ్యమంత్రి అయ్యాడు.
1973 జులైలో ఇందిర అతన్ని తీసివేసి చిమన్భాయ్ పటేల్ను ముఖ్యమంత్రిగా చేసింది. చిమన్భాయ్ అప్రతిహతంగా పాలించాడు. అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్రంగా వున్నాయి కానీ 20% కంటె తక్కువ సీట్లతో కునారిల్లుతున్న ప్రతిపక్షం అతన్ని నిలవరించే స్థితిలో లేదు.
మెస్ చార్జీలకు వ్యతిరేకంగా ప్రారంభమై రాజకీయంగా మలుపు
ఇలా వుండగా ఆహార ధాన్యాల కొరత వలన చిమన్భాయ్ 1973 డిసెంబరులో కాలేజీ హాస్టల్స్కు యిచ్చే ఫుడ్గ్రెయిన్స్పై సబ్సిడీని ఉపసంహరించాడు. దాంతో మెస్ చార్జీలు 20-30% పెరిగాయి. వెంటనే ఒకూరిలో ఇంజనీరింగు కాలేజీ మెస్లో ధరలు పెంచడాన్ని నిరసిస్తూ విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ విరక్కొట్టారు. 40 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వెంటనే మరొక కాలేజీలోనూ యిలాటి సంఘటనే జరిగింది.
1974 జనవరిలో గుజరాత్ యూనివర్శిటీలో విద్యార్థులు, పోలీసులు కలబడ్డారు. లాఠీచార్జిలు, అరెస్టులు జరగడంతో బంద్కు పిలుపు నిచ్చారు. ప్రతిపక్షాలకు దీనిలో మంచి అవకాశం కనబడింది. వారికి అనుబంధంగా పని చేసే ప్రయివేటు సెక్టార్, ప్రభుత్వ సెక్టార్ల ఉద్యోగ సంఘాల ద్వారా అధికధరలకు, అవినీతికి వ్యతిరేకంగా సమ్మెలు మొదలుపెట్టారు, ప్రదర్శనలు చేశారు. కొందరు మధ్యతరగతి వారు కూడా చేరి రేషన్ షాపులను దోచుకున్నారు. అదే నెలలో నవనిర్మాణ సమితి అని ఏర్పడింది. అవినీతి రహిత నూతన సమాజసృష్టి తమ ఆశయం అని ప్రకటించుకున్నారు.
ప్రతిపక్షాలైన కాంగ్రెసు (ఓ), స్వతంత్ర పార్టీ, జనసంఘ్ తమ తమ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అనేక ఊళ్లలో కర్ఫ్యూలు విధించి, ఆర్మీని దించారు. ఉద్యమనాయకులను అరెస్టు చేయసాగారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అధికధరలకు, అవినీతికి వ్యతిరేకంగా అని ప్రారంభించిన విద్యార్థి ఉద్యమం, రాజకీయ పరమైన మలుపు తీసుకుని చిమన్భాయ్ రాజీనామా చేయాలనే డిమాండు ముందు పెట్టింది. సరేలే అని ఇందిరా గాంధీ 1974 ఫిబ్రవరిలో అతన్ని తీసేసింది. కానీ ఆందోళన ఆగలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాల్సిందే అంటూ విద్యార్థి నాయకులు ఎమ్మెల్యేల యిళ్లపై పడి ఒత్తిడి చేయసాగారు. నిజానికి ఆహారధాన్యాల కొరత, ద్రవ్యోల్బణం అనేవి కేంద్ర ప్రభుత్వం సబ్జక్టులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన సమస్య పరిష్కారమౌతుందా? అవినీతి అంటారా, పార్టీ తరఫున ఎన్నికైన 140 మందీ అవినీతిపరులని ఎలా చెప్పగలరు? ఆధారాలు చూపాలిగా! కానీ 95 మంది చేత యిలా అప్రజాస్వామికంగా చేయించి అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండు చేయసాగారు.
పరోక్ష మద్దతుతో యిక్కడిదాకా తీసుకుని వచ్చిన ప్రతిపక్షాలు యిక ప్రత్యక్ష పాత్ర తీసుకున్నాయి. ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోలేక పోయిన మొరార్జీ దేశాయి, అసెంబ్లీ రద్దు చేయాలంటూ 1974 మార్చిలో నిరవధిక దీక్షకు కూర్చున్నాడు. 78 ఏళ్ల వృద్ధుడికి ఏమైనా అయితే నింద మోయాల్సి వస్తుందని భయపడి ఇందిర అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. విద్యార్థులు కేరింతలు కొట్టారు. ధరలు తగ్గాయా. అవినీతి అదృశ్యమైందా అని తర్కించలేదు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దింపాం, చాలనుకున్నారు. అవినీతిపరుడని ముద్ర
వేసిన యిదే చిమన్భాయ్ మద్దతుతో 16 నెలల తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. 1990లో అతను మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బిజెపి (పాత జనసంఘ్) మద్దతిచ్చింది.
పార్టీలు హైజాక్ చేసిన ఉద్యమం
కాంగ్రెసు ప్రభుత్వం రద్దు కావడంతో సగం పనే అయింది. తక్కిన సగం, అనగా తాము ప్రభుత్వంలోకి రావాలంటే ఎన్నికలు జరగాలి. అందుకని ప్రతిపక్షాలు నవనిర్మాణ్ యువక్ సమితి పేర ఆ డిమాండు చేయించాయి, మొరార్జీ 1975 ఏప్రిల్లో మళ్లీ నిరాహారదీక్షకు కూర్చున్నాడు. ఆ ఒత్తిడితో మామూలుగా అయితే 1977లో జరగాల్సిన ఎన్నికలను 1975 జూన్లోనే జరిపించారు ఇందిర. కాంగ్రెసు (ఓ), స్వతంత్ర పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ, లోక్దళ్ కలిసి జనతా మోర్చా పేర కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే 182లో 88 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ (ఆర్)కి 75 వచ్చాయి. చిమన్భాయ్ సొంతంగా పెట్టుకున్న కెఎంఎల్పికి 12 వచ్చాయి. అతని మద్దతుతో జనతా మోర్చా తరఫున బాబూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ యిదే నెలలో ఎమర్జన్సీ విధించడంతో ఇందిర బలపడింది. 1976 మార్చిలో చిమన్భాయ్ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలింది. రాష్ట్రపతి పాలన, డిసెంబరులో ఇందిరా కాంగ్రెసు ముఖ్యమంత్రి మాధవ్ సింగ్ సోలంకి ముఖ్యమంత్రి కావడం, మరో 4 నెలల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికలలో ఇందిర ఓడిపోవడం, ఆ పై నెలలోనే బాబూభాయ్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం జరిగాయి.
చెప్పవచ్చేదేమిటంటే, హాస్టల్ మెస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ప్రారంభించిన విద్యార్థుల చేతి నుండి ఉద్యమం రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిపోయింది. వాళ్ల క్రీడలు వాళ్లు ఆడుకున్నారు. ఈ నవనిర్మాణ్ ప్రభావం దేశమంతా వ్యాపించడానికి కారకుడు జయప్రకాశ్ నారాయణ్. 1974 ఫిబ్రవరిలో చిమన్భాయ్ రాజీనామా తర్వాత గుజరాత్ వచ్చి చూసి, యీ ప్రయోగాన్ని బిహార్లో కూడా రిపీట్ చేయాలనుకున్నాడు. బిహార్ పరిస్థితి గురించి చెప్పాలంటే 1972 మార్చి నాటికి ఇందిర ప్రభ దేశమంతా వెలుగుతున్నా, అక్కడ ప్రతిపక్షాలు బలంగా వుండడంతో అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 318 సీట్లలో కాంగ్రెసుకి 167 మాత్రమే వచ్చాయి. ప్రతిపక్షాలుగా వున్న సిపిఐకి 35, సోషలిస్టు పార్టీకి 33, కాంగ్రెస్ (ఓ)కి 30, జనసంఘ్కి 25 వచ్చాయి. కాంగ్రెసు తరఫున కేదార్ నాథ్ పాండే ముఖ్యమంత్రి అయ్యాడు.
బిహార్లోనూ అదే కథ
అప్పట్లో రాష్ట్రాలలో బలమైన నాయకుల్ని తీసివేసి, తనకు విధేయులైన రాజకీయంగా బలహీనులైన వారిని ముఖ్యమంత్రులుగా చేసే పనిలో వున్న ఇందిర పాండేను 1973 జులైలో తీసివేసి అబ్దుల్ గఫూర్ అనే ముస్లింను ముఖ్యమంత్రిగా చేసింది. అతను సౌమ్యుడు, అవినీతి ముద్ర ఏ మాత్రం లేనివాడు. కానీ గుజరాత్ అనుభవం చూశాక ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను మార్చడానికి విప్లవం పేరుతో విద్యార్థులను ముందు పెట్టుకోవడమే తారకమంత్రం అని గ్రహించిన జయప్రకాశ్ నారాయణ్ 1974లో సంపూర్ణ క్రాంతి ఉద్యమం అని బిహార్లో మొదలుపెట్టాడు.
గుజరాత్లో ప్రతిపక్షాలు కొన్నాళ్లు తెరచాటున వున్నాయి కానీ యిక్కడ మొదట్నుంచి చురుగ్గానే పని చేశాయి. జనసంఘ్ వారి ఎబివిపి, సమాజ్వాదీ పార్టీకి చెందిన యువజన సభ, లోకదళ్, సిపిఐ వారి ఎఐఎస్ఎఫ్ యివన్నీ దిగాయి. ఆనాడు బిహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి తరఫున నాయకులుగా ఎదిగిన లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, సుశీల్ కుమార్ మోదీ, రాం విలాస్ పాశ్వాన్ తర్వాత రోజుల్లో ఎలా తయారయ్యారో చూశాం. అదే సమయంలో యుపిలో సోషలిస్టు యువనాయకుడిగా ప్రాభవంలోకి వచ్చిన ములాయం సింగ్ కూడా ఎలా మారాడో చూశాం.
జయప్రకాశ్ వీరందరినీ వెంటేసుకుని, ప్రజాస్వామ్యం, ఎన్నికలు వీటన్నిటినీ నిరాకరిస్తూ, అబ్దుల్ గఫూర్ అవినీతిపరుడని ఏ ఆధారమూ చూపకుండానే ప్రజలు కోరుతున్నారు కాబట్టి దిగిపోవాలి అంటూ ఉద్యమం నడిపాడు. అంతేకాదు, ప్రభుత్వాజ్ఞలను ధిక్కరించండి అంటూ మిలటరీకి పిలుపు నిచ్చాడు. వీటితో ఎలా వేగాలా అని సతమతమవుతున్న ఇందిరకు అశనిపాతంలా ఇలహాబాద్ కోర్టు తీర్పు తగిలింది. భయపడిపోయి,
ఎమర్జన్సీ విధించి, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో కుక్కి, 19 నెలల పాటు నియంతగా పాలించింది.
ఎమర్జన్సీ సమయంలో అనేక అత్యాచారాలు జరగడంతో ప్రజలు 1977 ఎన్నికలలో ఆమెకు బుద్ధి చెప్పారు. సంపూర్ణ క్రాంతి ఉద్యమ ఫలితంగా, జయప్రకాశ్ మార్గదర్శకం చేత కాంగ్రెసు (ఓ), జనసంఘ్, లోక్దళ్, సోషలిస్టు పార్టీ కలిసి జనతా పార్టీగా ఏర్పడి ఇందిరను ఓడించి 1977లో అధికారంలోకి వచ్చారు. అంతఃకలహాలతో రెండేళ్లలోనే ఆ కూటమి విచ్ఛిన్నమైంది. 1980 ఎన్నికలలో ఇందిర మళ్లీ ఘనవిజయం సాధించింది.
ఆ విధంగా బిహార్ విద్యార్థుల ఉద్యమం కూడా రాజకీయ నాయకులకే ఉపయోగ పడింది.
విద్యార్థులే రాజకీయ నాయకులుగా తర్జుమా ఐన అసాం
ఇక అసాం విద్యార్థి ఉద్యమానికి వస్తే, శరణార్థులుగా వచ్చిన విదేశీయులు పౌరసత్వం సంపాదించి, తమ అవకాశాలు తన్నుకుపోతున్నారన్న ఆవేదనతో ఆసు (ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్) ఏర్పడింది. ఆరేళ్ల పోరాటం తర్వాత కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాక 1985 అక్టోబరులో అసాం గణ పరిషద్ పేరుతో రాజకీయ పార్టీగా ఏర్పడి వెంటనే ఎన్నికలలో 126 సీట్లలో 96 నెగ్గి, ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఆ విధంగా అసాంలో విద్యార్థులు తామే రాజకీయ నాయకులై పోయారు.
ఉద్యమంలో జంటకవుల్లా పని చేసిన ప్రఫుల్ల మహంత, భృగు పూకన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా మారాక కలహించుకున్నారు. మహంతపై అవినీతి, అసమర్థత ముద్ర పడింది. 1991 ఎన్నికల్లో 19 సీట్లు మాత్రమే రావడంతో పార్టీ విడిపోయింది. ఆ తర్వాత 1996లో 59 తెచ్చుకుని యితరుల సహాయంతో మహంత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. 2001లో 20 సీట్లు వచ్చాయి. ఇక అప్పణ్నుంచి ఆ దరిదాపుల్లోనే సీట్లు వస్తున్నాయి. పార్టీలోంచి నాయకులు వెళ్లిపోతూ, తిరిగి వస్తూ వున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరితో జత కడుతోంది పార్టీ. ప్రస్తుతం ఎన్డిఏలో వుంది.
అసాం అనుభవం చెప్పేదేమిటంటే రాజకీయాల్లోకి వచ్చాక విద్యార్థులు కూడా వాళ్లలాగే తయారవుతున్నారు. ఇవన్నీ చూశాక నేటి తరం విద్యార్థులు రాజకీయాలకు దూరంగా వుంటున్నారంటే ఆశ్చర్యమేముంది? 1980లు వచ్చేసరికే అసాంలో తప్ప తక్కిన రాష్ట్రాలలో కాలేజీ విద్యార్థులు రాజకీయాలను చర్చించడం మానేశారు. ప్రాంతీయ పార్టీలు విద్యార్థి విభాగాలను ప్రోత్సహించ లేదు. మన తెలుగునాట అయితే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు కులాలవారీగా విడిపోయి కలహించడం కనబడింది. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక యువతకు కన్స్యూమరిజం మప్పాడు. సిద్ధాంతాలు, దేశభక్తి నుంచి దృష్టి మళ్లించి, విదేశీ మోజు పెంచాడు. పివి వచ్చాక గ్లోబలైజేషన్ పెరిగి, యువతలో ఆదర్శవాదం అడుగంటింది.
సమాజం గురించి కాదు, సొంత బాగు చూసుకుంటే చాలు అనుకోసాగారు. దేశం కుడికి లేదా ఎడమకి, తూర్పుకి లేదా పడమటికి ఎటు పోయినా ఫర్వాలేదు. విదేశాల్లో వున్న చెట్లకు డబ్బులు కాస్తూ వుండాలి, వెళ్లి కోసుకోవడానికి మనను రానిస్తూ వుండాలి అని అనుకోసాగారు. ఉద్యమాలు, ఊరగాయలూ అంటూ తిరక్కుండా చదువు మీదే ఫోకస్ పెట్టి, తమ కోసం లక్షల రూపాయిల కష్టార్జితాన్ని వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు సంతోషాన్ని సమకూరిస్తే చాలు అనుకుంటున్నారు.
నేటి విద్యార్థుల ప్రాధాన్యతలు
ఏదైనా ఆవేశానికి లోనై మరోలా ఆలోచిద్దాం అనుకున్న తెలుగు కుర్రాళ్లు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుని వీపు చరుచుకుంటున్నారు. తెలంగాణ వస్తే యింటికో ఉద్యోగం వస్తుందన్న కెసియార్ మాటలు విని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎందరో తెలియకపోయినా, ఎవరి నోటికి వచ్చిన అంకె వారు చెప్పారు. ఇప్పటిదాకా లెక్క తేలలేదు. చచ్చిపోయిన కుర్రాళ్ల పేరు చెప్పుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీలు వారి కుటుంబాలను ఆదుకోలేదు సరి కదా, కనీసం వారిని ఎవరూ తలవనీయకుండా చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక విద్యార్థులను న్యూసెన్సుగా చూశారు తప్ప, వారి కోసం చేసిందేమీ లేదు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిల సంగతి చూస్తే మొత్తం బోధపడుతుంది.
ఇవి చూసి విసుగెత్తిన విద్యార్థులు రాజకీయాల జోలికి పోకుండా, సామాజిక సమస్యలను పట్టించుకోకుండా వుండడంలో ఆశ్చర్యమేముంది? సోషల్ యాక్టివిజం విషయంలో వాళ్లు పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్లిపోయారు. వారిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతతో తట్టి లేపింది. లేచాక, నాలుక కరుచుకుని, సరైన టైములో స్పందించి, జోకొట్టి వుంటే పోయేది. కానీ రెచ్చగొట్టింది, రైతులను హేండిల్ చేసిన తీరులో మొరటుగా డీల్ చేసి, ఆందోళన కారులపై దశాబ్దంగా వాడుతున్న టెక్నిక్కులనే వాడి చూసింది. ‘మోదీ హైతో ముమ్కిన్ హై’ అని ప్రజలను నమ్మిస్తూనే, ‘హాథ్ మే మీడియా హోతో, ముమ్కిన్ హై’ అని తను నమ్ముతూ అసలు సమస్య గురించి కాకుండా, పోలీసువారిపై జరిగిన జులుం గురించి కథనాలు రాయించింది.
క్రిమినల్స్, దేశ విచ్ఛిన్నానికి విదేశీ శక్తుల కుట్ర కథనాలు షరా మామూలుగానే వినిపించింది. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు నిర్ణయంపై తాత్సారం చేసి, సరిగ్గా హేండిల్ చేయకుండా, నెత్తికి తెచ్చుకుంది. ఆ తీరుతెన్నుల గురించి ‘‘ఇదేదో ముందే చేసి వుంటే..?’’ అనే వ్యాసంలో చర్చిస్తాను.
– (ఫోటో – విద్యార్థుల ఆందోళన, ఇన్సెట్లో ధర్మేంద్ర ప్రధాన్)
– ఎమ్బీయస్ ప్రసాద్