తిమ్మిని బమ్మి,బమ్మిని తిమ్మి చేసేలా తప్పుడు కథనలు ప్రచురిస్తూ అభాసుపాలవుతున్న కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,సోషల్ మీడియా!
లేదా
ఈ మధ్యకాలంలో కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,సోషల్ మీడియా పని గట్టుకొని అసత్య ప్రచారానికి నడుం బిగిస్తుండటం అత్యంత దురదృష్టకరం!
ఎందుకనో ఈ మధ్య కాలంలో కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,సోషల్ మీడియా సంస్థలు తమ రేటింగ్ ను పెంచుకోవడమే లక్ష్యంగా తప్పుడు కథనలు ప్రచురిస్తూ,అసత్య ప్రచారానికి కేంద్ర బిందువుగా నిలుస్తుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత దురదృష్టకరమైన విషయం.ఎందుకంటే ప్రజలకు మంచి ఏదో,చెడు ఏదో తెలియజేసి,ఈ సమాజంలో నిత్యం జరిగే పలు అవినీతి బాగోతాలను, ఆరాచకాలను, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి వారిని చైతన్య పరచాల్సిన కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,మీడియా సంస్థలు వక్ర మార్గాన పయనం సాగిస్తూ వున్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్టుగా చూపడమే కాదు ఒక్కొక్కసారి బతికున్న మనుషులను కూడా చనిపోయినట్లుగా చూపే అపద్దపు,దగా కోరు ప్రచారానికి నడుం బిగిస్తుండటం ఈ దేశ ప్రజానీకాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేయడమే కాదు వారిని అశాంతి పూరితమైన వాతావరణానికి తీసుకెళ్లే చర్యలకు తెగబడుతుండటంతో రోజు రోజుకు అవి తమ విశ్వసనీయతను ఈ సమాజంలో,ఈ సమాజంలోని ప్రజలలో కోల్పోతున్నాయి అనే మాట జగమెరిగిన సత్యం.ఇకనైనా కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,సోషల్ మీడియా సంస్థలు ఈ చౌకబారు ఎత్తుగడలకు,అనైతిక దోరణులకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలు ఎవ్వరూ కూడా మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి భవిష్యత్ లో ఉండదు అనే చేదు నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహించి నడుచుకుంటే అది మీ ఇంటికి,వంటికి అంతా మంచిది.ఇప్పటికే ప్రజల్లో కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,మీడియా సంస్థలపై అపనమ్మకం అనేది గూడు కట్టుకొని పోయింది.దీనికి తోడు మీరు చేసే ఈ విపరీత చేష్టలు, జుగుస్సకరమైన ఎత్తుగడల మూలాన అంతో ఇంతో నీతి, నిజాయితీగా, పారదర్శకంగా, క్రమశిక్షణ,నిబద్దతతో నడిచే అన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్లపై కూడా అనవసరంగా లేనిపోని అబాండాలు, విమర్శలు, తలనొప్పులు వచ్చిపడటమే కాదు చేయని నేరానికి శిక్ష అనుభవించినట్లుగా వారి పరిస్థితి సైతం అడకత్తెరలో పోక చెక్కలా తయారు అయ్యింది అనే మాట సత్య దూరం కాదు.ఒక విధంగా చెప్పాలంటే కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,మీడియా సంస్థలు అయితే హద్దు పొద్దు లేకుండా వ్యక్తులను,అయా పార్టీలలోని వ్యక్తులను టార్గెట్ చేసుకొని మరీ వారిపై విష ప్రచారానికి, బురద చల్లే పాపానికి,వారి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే కుట్రకు కూడా వెనుకంజ వేయడం లేదు అంటే అవి ఎంతటి నీచ స్థాయికి దిగజారిపోయాయో,ఎలాంటి పనికిమాలిన, దుర్మార్గపు,హేయమైన సిద్ధాంతాలను అనుసరిస్తున్నారో మనమంతా ఇట్టే ఊహించవచ్చు.
ఏదిఏమైన గతంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,మీడియా సంస్థలు పూర్తిగా లోపభూయిష్టంగా తయారు కావడమే కాదు,కొన్ని బలహీనతలకు,ఒత్తిడులకు లొంగిపోయి,కొన్ని పార్టీల నాయకులకు మడుగులు ఒత్తుతూ,గులాంగిరికి కూడా తెరలేపుతూ వారికి పూర్తిగా దాసోహాం అవుతుండటం కూడా వారి ప్రతిష్టను అత్యంత తీవ్ర స్థాయిలో మసకబార్చడమే కాదు,వారు చేజేతులారా తాము నమ్ముకున్న విలువలకు,ఆశయాలకు తూట్లు పొడుస్తూ, తిలోదకాలు ఇస్తూ యావత్ పత్రిక, మీడియా రంగాలను తమ స్వార్తానికి బలి పశువులను చేస్తుండటం ఈ యావత్తు దేశ ప్రజానీకానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులకు,మానవతా విలువలు పాటించే వ్యక్తులకు ఈ ఆనారోగ్య వాతావరణం ఏ మాత్రం మింగుడు పడని విషయం. ఏమైనా పనిగట్టుకొని మరీ ఈ ఫేక్ న్యూస్, నకిలీ వార్తల జాడ్యాన్ని ఇలాగే కొన్ని వార్త పత్రికలు,టీవీ చానళ్ళు,మీడియా సంస్థలు అదేపనిగా తలకు ఎక్కించుకుంటూ పోతే మాత్రం భవిష్యత్ లో మీ మనుగడే ప్రశ్నర్థకంగా మారే ప్రమాదం పొంచి వుంది.కాబట్టి ఇకనైనా వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకొక తప్పదు కాక తప్పదు.తస్మాత్ జాగ్రత్త!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #మీడియా