*శివలింగము*
సామాన్యముగా లింగ మనగా చిహ్నము (గుర్తు) అని అర్ధము. 'శివునికి గుర్తు' అనునర్థములో 'శివలింగ'మని రూఢి. ఇది ఒక సంకేతమే కాని, వాస్తవమునకు ఇదే శివుని రూప మని కాదు. ధ్యానానుగుణముగ శివుని రూపములు అనేకము లున్నవి. లింగములో సాకార నిరాకారములు లీనమై యున్నవి. సర్వమును తనయందు లీనము గావించుకొనునది కనుక లింగ మని పేరు. ప్రళయాగ్నిలో సర్వమును భస్మమై శివలింగములో లయించును. (లీనమగును) మరల సృష్టిప్రారంభములో అందుండియే ఉద్భవించును.
పంచలింగములు, ద్వాదశ జ్యోతిర్లింగములు ఇవ న్నియు విశ్వమునకు, అందలి తత్త్వములకు సంకేతములు. విశ్వమే విశ్వేశ్వరతత్త్వముకదా! శివలింగము ఆపాతాళన భస్సలాంత వ్యాప్తము – అనగా సర్వవ్యాప్తము! శివలింగములు అనేక విధములు. అందు సువర్ణ నిర్మితలింగము ముక్తి నిచ్చును. వెండి లింగము ఐశ్వర్యమును, వైడూర్యలింగము శత్రునాశమును, స్పటికలింగము సర్వవాంఛాఫలప్రదత్వ మును, కల్గించును. (కాని రాగి, కంచు, సీసము, ఎఱ్ఱ చందనము, శంఖము, ఇనుము లింగములు కలియుగములో నిషేధింపబడినవి). పాదరస లింగము మహైశ్వర్య ప్రదాయకము. మహా ప్రభావ సంపన్నము. పాదరసమునకు
పాదర' మనిపేరు. "రోగములను నశింపజేయునది” అని వ్యుత్పత్తి. ఇందు 'ప = విష్ణువు, ఆ = పార్వతి, ర = శివుడు, ద = బ్రహ్మ - అని అర్ధములు కనుక 'పారద' - (పాదరసము) త్రిమూర్త్యాత్మక పరాశక్తి స్వరూపము. పాదరసలింగపూజ జీవితములో ఒక్కమారైనను చేయుట సకలాభ్యుదయప్రదము. బాణలింగ పూజ ముక్తి ప్రదము. బాణలింగములు నర్మదా నదిలో లభించును. ఇంద్రాదిదేవతలును బాణలింగములను పూజించినారని పురాణోక్తి. ఇందు ఆవాహన విసర్జనములుండవు.
వేదములలో శివుడు
ఋగ్వేదములోని మూడు సూక్తములలో (మం 114 నూ 2-33, 7-46) రుద్రుని స్తుతియున్నది. కృష్ణయజుర్వేదములో చతుర్ధ కాండము 5,7 ప్రపాఠకములకు రుద్రాధ్యాయ మనిపేరు. వీటిని నమక చమకము లందురు. శుక్లయజుర్వేదములోని 16వ అధ్యాయము రుద్రదేవతా కమైనది. అధర్వవేదములో 11వ కాండములోని 2వ సూక్తములో రుద్రమాహాత్మ్య మున్నది. పురాణములు శివప్రభావమును అనేకరీతుల వర్ణించినవి.
శివపూజా మహిమ
శివధ్యానము నిరంతరము ఎక్కడ జరుగునో అక్కడ సమస్త మంగళము, సర్వసిద్ధులు, సాలోక్యసామీప్య సారూప్య సాయుజ్యములు అనబడు చతుర్విధపురుషార్థములు కాచుకొని యుండును. శివస్మరణవల్ల ఎట్టి దారుణ సంకటములైనను పటాపంచలైపోవును. అంతేకాక ఎన్ని విఘ్నములు సంభవించినను అవి అన్నియు తొలగిపోవును అనుటలో ఎట్టి సంశయములేదు. తెలియకుండ అమృతమును పానముచేసినచో పానము చేసినవారు ఎట్లు అమరులు అగుదురో అదేవిధముగా ఎవ్వరి నామోచ్చారణము వల్లనైనను, హాస్యమునకయినను, నిందించుటకు నైనను శివస్మరణ చేసినను, అన్నిపాపములు భస్మమైపోవును. కావున భక్తిశ్రద్ధలతో ఏకాగ్రచిత్తముతో, శివధ్యానము చేసిన మహాభక్తుల పుణ్యమునకు హద్దు లుండవు. ఈవిధముగా శివునిపై పరమప్రీతిగల్గిన ఉత్తమ సంస్కారముగల మానవులు అత్యంత పవిత్రమైన శివరాత్రినాడు ఉపవాసముచేసి, జాగరణసల్పి, బిల్వ దళములతో క్రమముగా శివార్చన చేసినచో వారిజన్మాంతర పాపశేషములు దహింపబడుటలో ఎట్టిసందేహము లేదు. ప్రతినిత్యము బిల్వములతో శివార్చన చేయువారు మిక్కిలి పుణ్యవంతులు. అట్టి భక్తుల దర్శన మాత్రముచేతనే అన్నిపాపములు తొలగిపోవును. ప్రాతః కాల శివ దర్శనముచే గతరాత్రి చేసినపాపములు, మధ్యాహ్న శివదర్శనముచే జన్మాంతరదోషములు పరిహారమగును. సంధ్యాకాలములో శివదర్శనమును ప్రేమపూర్వకముగా చేసినచో వెనుకటి ఏడుజన్మములలోని పాపములు భస్మమగును. శివరాత్రి మహిమను వర్ణించుటకు ఆదిశేషునికిని తరముగాదు. అరవై సంవత్సరములకు ఒకసారివచ్చుకపిలాషష్ఠికంటె, అర్ధోదయ మహోదయాది సంక్రమణగ్రహణాదిపర్వకాలములకంటే, శివరాత్రియే శ్రేష్ఠమైనది, వసిష్టవిశ్వామిత్రాది మునీశ్వరులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు శివరాత్రివ్రతమును ఆచరించుదురు. ఈ సందర్భము నందు శౌనకాది మహర్షులకు సూతపౌరాణికులు చెప్పిన పావనమైన కథ ఒకటికలదు. దానిని శ్రోతలు సావధాన చిత్తముతో శ్రవణముచేసి ధన్యులగురుగాక! మాసములలో మాఘ మాసము విశేష మహిమాన్వి తమైనది. అందుకృష్ణపక్షచతుర్దశి శివరాత్రి కనుక అద్భుతమైన మహిమ గలదిగా శ్రీవ్యాస మహర్షి వర్ణించిరి. ఆ మహిమను ఆదరభావముతో శ్రవణము చేయవలెను. వింధ్యపర్వతప్రాంతమున శాకలనగరమున అంకిలుడు అను ఒకబోయవాడు నివసించుచుండెను. అతడు మృగములను వేటాడుచు నిర్దయాస్వభావముగల్గి ఎల్పప్పుడు నిషిద్ధకర్మలనే ఆచరించుచుండెను. ఒకనాడు దురాచారపరుడైన ఈ వ్యాధుడు పచ్చనికవచమును ధరించి, ధనుర్బాణములు తీసికొని, చంకనొక పగ్గమును తగిలించుకొని, ఘోరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవిలో మిగుల రమణీయమైన ఒక శివాలయ ముండెను. ఆదినము శివరాత్రి గావున నలుదిక్కులనుండి భక్తులు విశేషముగా ఆ ఆలయమునకు వచ్చుచుండిరి. ఆ శివాలయము ఆకాశమునంటు పతాకములతో, ప్రకాశించు రత్న కలశములతో, శుద్ధమైన కైలాస శిఖరములవలె నొప్పుచు, మిక్కిలి రమణీయముగా నుండెను. “గర్భగుడి”లో మణిమయమైన శివలింగము స్థాపింపబడియుండెను. వచ్చిన భక్తులు భక్తితో అభిషేకాదిషోడశోపచారములచే స్వామిని పూజించు చుండిరి. బ్రాహ్మణులు రుద్రమును చెప్పుచుండిరి. తాళమృదంగములతో శివభజన జరుగుచుండెను. ఆధ్వనిచే ఆ ప్రాంతమంతయు మారుమ్రోగుచుండెను. దివ్యమైన పుష్పముల పరిమళము దశదిశలు వ్యాపించియుండెను. లక్షల కొలది దీపముల ప్రకాశము సూర్యచంద్రుల ప్రకాశమునే తిరస్కరించు చుండెను. ఈ సందర్భమందు ఆ వ్యాధుడు అచ్చటికి వచ్చి ఆ ఉత్సవమునంతయు సంభ్రమముతో చూచుచు అట్టహాసముతో నవ్వుచు ఇట్లు అనుకొనెను.
"ఆహా! ఈ ప్రజలు ఎంతటి మూర్ఖులు! ఈ పూజలకై ఎంతో ద్రవ్యమును వ్యర్థము చేయుచున్నారు. ఇదంతా శిలామయము. లోపల శిల! బయటశిల! ఇక దేవత్వము ఎక్కడ నుండి రాగలదు? మృష్టాన్నభోజనము చేయుటమాని ఉపవాసము చేసి, బాధపడుచున్న వీరికి పిచ్చిపట్టినట్లు ఉన్నది" - ఇట్లు హాస్యము చేయుచు నిలబడియుండెను. అంతలో భక్తసమూహము శివనామమును కీర్తింపదొడగిరి. దానిని విని వ్యాధుడుగూడ “శివ శివ హర హర” అని చెప్పుచు ఆలయప్రదక్షిణము చేసి, భయంకరమైన అడవిలో ప్రవేశించెను. అతనికి శివనామోచ్చారణము అలవాటు అయ్యెను. "హర హర” అనుకొనుచు నాట్యము చేయుచుపోవుచుండెను. శివ నామోచ్చారణ చే వాడు చేసిన పాపములు తొలగిపోవుచుండెను. ఇంతలో సూర్యాస్తమయము అయ్యెను. కంటికి కాటుక పూసినట్లు అంధకారమంతయు అలముకొనెను. ఆ రాత్రి నిషాదుడు ఉపవాసము చేసియుండెను. వేటకొరకై అతడు అక్కడక్కడ సంచరించుచుండకొద్ది దూరములో గొప్ప సరోవర మొకటి కనబడెను. అది తామరనపుష్పశోభితమై మిక్కిలి రమణీయముగా నుండెను. గట్టున ఆకాశమునంటు చున్నవేమో అనునట్లు కనబడు బిల్వవృక్షములు ఉండేను. యోగభ్రష్టులు మరల కర్మభూమిపై దిగి జన్మ పరంపరలను పొందినట్లు ఈ బిల్వవృక్షములు సూర్యచంద్ర కిరణములను భూమిపై పడకుండ చేయుచుండెను. ప్రత్యేకించి ఆరోజు మిక్కిలి అంధకారము ఆవరించి యున్నందున ఆ ప్రాంత మంతయు చిమ్మచీకటితో నిండియుండెను. ఒకానొక బిల్వవృక్షము నెక్కి ఒకకొమ్మపై కూర్చొని, ఆ వ్యాధుడు విల్లును సంధించి, బాణములు తొడిగి, చుట్టును తిలకించెను. అతని దృష్టికి బిల్వదళములు అడ్డము వచ్చినందున కుడిచేతితో వాటిని త్రుంచి ఎడమ చేతితో పారవేయ దొడగెను. అచ్చట క్రిందిభాగమున పవిత్రమైన శివలింగ మొకటి కలదు. వ్యాధుడు క్రిందికి పారవేయు బిల్వదళములు ఈ శివలింగము మీదనే పడుచుండెను. ఈశ్వరుడు ఆ బిల్వదళపూజలో మిక్కిలి సంతుష్టు డయ్యెను. ఆదినము తాను ఉద్దేశింపకయే ఉపవాస, జాగరణములు అనివార్యముగా అతడు చేసియుండెను. నీటిపై అలలవలె శివనామోచ్చారణము కూడ అతని నోటినుండి వెలువడు చుండెను. ఈ విధమైన శివస్మరణార్చనాది కృత్యములచేత ఆ వ్యాధుని పాపములు క్షయింపదొడగెను. ఇట్లుండ జాము ప్రొద్దుపోయిన తర్వాత నీరుత్రాగుటకై పూర్ణగర్భవతి అగు తేజోమయమైన ఒకానొక ఆడుజింక ఆ సరోవరము చేరి, సోపానములపై దిగుచుండెను. దానిని చూచిన వ్యాధుడు ఆ జింకను తనబాణమునకు గురిచేయ ప్రయత్నించుచుండగా వానిని ఉద్దేశించి ఆ లేడి ఇట్లు చెప్పదొడగెను. “ఆర్య! మాపై బాణమును ఎందుకు ఎక్కుపెట్టెదవు? నీకు నేను ఏమి అపచారమును గావించితిని?
గర్భవతి నయిన నన్ను వధించుట నీకు ధర్మమా? నాగర్భమునందున్న శిశువు అతిసూక్ష్మమై, అజ్ఞానావృతమై యున్నది. ఇట్టిస్థితిలో నీవు నాకు తొందర గల్గించినచో నీకు దారుణమైన పాపము గల్గును. "ఎట్టి అన్యాయము తలపెట్టని గర్భిణినయిన నన్ను చంపుట నీకు పాడిగాదు” అని జింక వ్యాధునకు హితవచనములు తెల్పెను. ఈ వాక్యములను విన్న బోయవాడు “ఓ మృగమా! నా ఆలుబిడ్డలు ఉపవాసముతో నారాకను ప్రతీక్షించుచున్నారు. నేనుకూడ ఈదినము ఉపవాసము చేయుచున్నాను. నీవు మనుష్యులవలె శాస్త్రోక్తమైన మాటలు చెప్పుట ఆశ్చర్యముగా నున్నది. నీయెడ నాకు సంపూర్ణమైన దయగల్గినది. నీవు పూర్వజన్మములో ఎవరు? నీ కిట్టిజ్ఞానము యెట్లు గల్గినది? విశదముగా తెలుపు"మని ప్రశ్నించెను. లేడి ఈ విధముగా జవాబు చెప్పదొడగెను. "పూర్వము దేవదానవులు క్షీరసాగరమును మథించినప్పుడు పదునాల్గు స్త్రీరత్నము లుద్భవించెను. వాటిలో 'రంభ' యనబడు అప్సర నేనే! నా రూపలావణ్యములకు దేవతలు దిగ్భ్రాంతులైరి. నా లావణ్యవీక్షణములకు దేవతలు మత్స్యములవలె నాకు వశులైరి. నా శరీరపరిమళము నాఘ్రాణించుటకై భ్రమరములవలె మునులు నన్ను చుట్టిరి. నా మధురమైన సంగీతముచే అందరు తమశరీరములనే మరచి పరవశులైరి. నేను స్వర్గభోగములను అనుభవించుచు మదముచే శివభజన. శివార్చన, మున్నగు సత్కర్మలను త్యజించి, మద్యము సేవించుచు దేవతలను మాని, హిరణ్యడు అను రాక్షసుని చేపట్టి చాలకాలము గడపితిని. ఒకనాడు వాడు వేటకై పోయెను. ఇట్టి దుర్మార్గుని సహవాసముచే శివపూజాదివిధులనెల్ల మరచిపోవలసి వచ్చెనుగదా యని తలచి, ఒకానొక నాడు రాక్షసుడు వెళ్లిన సమయమందు నేను శివదర్శనార్ధమై కైలాసమునకు పోయితిని. మహాపాపిని అయిన నన్ను శంకరుడు చూచి "నీవు మర్త్యలోకములో నీయిరువురు సఖులతోపాటు జింకగా పుట్టుము. హిరణ్యనామకరాక్షసుడుకూడ జింకగానే పుట్టి, మీ మువ్వురితో సుఖించుగాక” అని శాపమిచ్చెను. వెంటనే నేను పరమేశ్వరుని పరిపరివిధములుగా ప్రార్ధించి, శాపపరిహారమును గూర్చి వేడుకొంటిని. శివుడు కరుణించి పండ్రెండు సంవత్సరములు జరిగిన పిదప మీకు శివప్రాప్తి గల్గును" అని అనుగ్రహించెను. శాపానుసారము మేము నలువురము కర్మభూమిపై జింకలుగా జన్మించితిమి. నేను గర్భిణినన్న విషయము నీకు తెలియును. నా శరీరమును కోరిన యెడల నా స్వస్థానమునకేగి బిడ్డను ప్రసవించి, మరల వచ్చెదను. అప్పుడు, నీవు నన్ను చంపి నాశరీరమును తినవచ్చును. ఇది సత్యమైన మాట" అని జింక విన్నవించెను. వ్యాధుడు జింక మాటలు విని యిట్లనెను “నీవు చెప్పునది నిజమే అయినను నీ మాటలలో నాకు నమ్మకముచాలదు. లోకములో ఎందరో ఎన్నోరకము లుగా అబద్ధములు చెప్పి, తమ శరీరములను కాపాడు కొందురు. కావున నీవు నిజముగా సత్యవాదినివి అయినచో ఏదైన ఒట్టుపెట్టుకొను” మని చెప్పగా ఆ మృగము మహాదైన్యముతో నిట్లుచెప్పెను. “ఓ వ్యాధుడా!" నేను నా మాటను తప్పినచో అనేక పాపములు నాకు సంభవించును. చేసిన ఉపకారమును మరచు కృతఘ్నునకు, ఇతరులను హింసించువానికి, భగవంతుని భజింపనివానికి, దానములకు విఘ్నముచేయువానికి, గురువును నిందించువానికి గల్గు పాపము నాకు ప్రాప్తించుగాక! లక్ష్మీపతి అయిన విష్ణువును, పార్వతీపతి అయిన శివుని నిందించువారికి, దానమిచ్చి పిదప దానిని మరల తీసికొనువారికి, వచ్చు పాపము నాకు సంభవించు గాక! స్వధర్మభ్రష్టునకు, శాస్త్రమును నిందించువారికి, భ్రష్టాచారునకు దేవాలయమునందుండి హరికీర్తనాది.సత్కాలక్షేపములలో తాంబూలము వేసికొనునతనికి కుష్ఠురోగము సంభవించు నని శాస్త్రములలో చెప్పబడినది. అట్టి పాపము నాకు సంభవించుగాక! తాను విద్యావంతుడై ఇతరులకు ఆ విద్యను దానముచేయక దాచువానికి శకునపక్షి జన్మమువచ్చును. సజ్జనులను అనవసరముగా బాధపెట్టువానివంశము నిర్వంశమగును.
స్వామి ద్రోహము చేయువాడు కుక్క అగును. సేవకులతో సేవచేయించుకొని, వారికి జీతభత్యములివ్వని యజమానులు భిక్షగాండ్రు అగుదురు. వంటపదార్థములను దొంగలించువారు పిల్లిజన్మమెత్తెదరు. అతిథి అభ్యాగతులకు, మంచిఆహారము పెట్టక, తానుమాత్రము మృష్టాన్నము భుజించినయెడల పతితుడగును. తల్లిదండ్రులను దుః ఖపెట్టువాడు కోతిగా పుట్టును. నేను ఇక్కడికి నామాటమేరకు మరల. రాకపోయినయెడల ఈ పాపము లన్నియు సంభవించును. నామాటలు తప్పినచో శివపూజకు విఘ్నము కలిగించిన దాని వల్ల వచ్చు పాపమునకు గురియగుదును” అని జింక ప్రతిజ్ఞ చేసెను.
బోయవాడు ఈ మాటలు విని ఆశ్చర్యభరితుడై జింకతో తన పనిని త్వరగా ముగించుకొని రావలసినదిగా అనుమతించెను. అట్లు అనుమతించిన బోయవానికి శుభములను కోరుచు సరోవరమునందలి నీరుత్రాగి, ఆ జింక తన తావునకు పోయెను. ఇక్కడ బోయవాడు తన యెడమ చేతితో బిల్వదళములను త్రుంచి, పారవేయుచుండెను. రెండుజాములవరకు బోయవాడు వేయుచున్న బిల్వదళములతో తనకు ఉత్తమమైన పూజ జరిగినందున ఈ చెట్టుక్రిందగల శివుడు పరమసంతోషమును పొందెను. దానివలన ఏడు జన్మములనుండి ఆ బోయవాని
నాశ్రయించిన పాపములలో సగభాగము భస్మమాయెను. శివనామోచ్చారణయందు వానికి ఆసక్తి గల్గెను. జింక చెప్పిన పవిత్రమైన మాటలు వినినందున సత్కాలక్షేపముద్వారా ఆ బోయవాడు జాగరణము చేసినట్లు అయ్యెను.
ఆ జింక వెళ్లిన తరువాత వ్యాధుడు శివనామస్మరణ చేయుచు, బిల్వదళములను గిల్లి, క్రింద వైచుచుండెను. కాలము నిలువదుకదా! రెండవజాము పూర్తికావచ్చినది. ఇంతలో నీరు ద్రాగుటకై ఒక ఆడుజింక అచ్చటికి వచ్చెను. "దీనిని వదలను” అనుచు వేటగాడు బాణమును సంధింపగా, కలత చెందిన జింక “నేటితో నా ఆయుస్సు తీరినది” అనుకొని, ధైర్యము వహించి, "అయ్యా! శబరా! కొంచెము ఆలోచింపుము. నీరు ద్రాగుటకై నే నిక్కడికి వచ్చితిని. మొదట తనివిదీర నీరు ద్రావ నిమ్ము. ఇంట చిన్న చిన్న బిడ్డలున్నారు. వారినొక్కమారు పల్కరించి, సంతోషపరచి వత్తును. సంతానవ్యామోహమనునది సహజముకదా! ఐహికసుఖోప భోగమోహము నాకును తప్పకున్నది. త్వరగా ఇల్లుచేరి, భర్తను, సంతానమును దర్శించి, తిరిగి వత్తును. ఇంతమాత్రము ఔదార్యము నాపై చూపుము. నన్ను విశ్వసింపుము. నాకడసారి కోర్కెను మన్నించి, ఈ సాహాయ్యము చేయుము. నీ మేలు ఎన్నటికి మరువను” అనెను. ఈ మాటలు విన్న వ్యాధుడు “చాల బాగున్నది!
ఇటనుండి వెళ్లి, నీవు తిరిగి వత్తువా? ప్రాణములు మిక్కిలి తీపియైనవి. ప్రాణములు కోల్పోవుటకు ఎవ్వరును రారు. నీ మాటపై నాకు నమ్మకము లేదు. కనుక ప్రమాణము చేసి, ప్రయాణము కమ్ము" - అనెను.
అంతట జింక "అయ్యా! పుణ్యాత్మా! ఆడిన మాటను తప్పి, నేను రాకున్నచో - బావులను, గుళ్ళను, గోపురములను కూల్చువారును, వేదశాస్త్రములను నిందించువారును, సాధు సజ్జనులను హింసించువారును, పురాణపుణ్యకథలను దూషించువారును - ఏ పాపము నొందుదురో, అట్టి పాపమును నేనును పొందుదును. అన్నదమ్ములయ్యును కడుపుమంటతో (ఈర్ష్యతో) ఒకరినొకరు హింసించువారు తమ ఐశ్వర్యమును కోల్పోవుదురు. ప్రత్యక్షమున మంచిగా మాట్లాడి, పరోక్షమున నిందించువారు కొంగలగుదురు. గురువునందలి దోషములను వెదకువారిసంపదలు సర్వనాశనమగును. తల్లిదండ్రులను, గురువులను కష్టపెట్టువారును, మూగజీవులకు నీరు మేత పెట్టని వారును, మూగవారై పుట్టుదురు. నేను తిరిగి రాకున్నచో ఇట్టి పాపము లన్నియు నన్ను చెందునుగాక! మరణమునుగూర్చి నాకు ఆవగింజంతయు బాధ లేదు. పుణ్యాత్మ! అంత్యకాలమున నా మనోవాంఛను నెరవేర్చి, పుణ్యముగట్టుకొమ్ము. త్వర త్వరగా పోయి వత్తును. అనుమతింపుము” - అని ప్రమాణములు చేసెను.
వ్యాధునికి జ్ఞానోదయకాలము సమీపించినది. శాశ్వత సుఖములు లభింపనున్నవి. కనుకనే కఠినాత్ముడైన వ్యాధుని మనస్సు మెత్తపడుచున్నది. కరుణారసము కట్టలు తాకుచున్నది. జింకను కరుణించి, 'పోయి రమ్మనినాడు. జింక మిక్కిలి సంతోషించి, కడుపునిండ నీరు ద్రావి, వ్యాధుని ప్రశంసించుచు ఇంటికి వెళ్లినది. మంచికాలము చేరువగునప్పుడు - మంచిబుద్ధియు చేరువగునుకదా! కొంతసేపటికి ఆ సరోవరమునకు నీరు ద్రాగుటకై మగజింక వచ్చెను. వెంటనే వ్యాధుడు బాణమును సంధించెను. వానిని చూచి జింక ఇట్లు చెప్పెను. “ఓ శివభక్తుడా! సుగుణవతులై పతివ్రతలైన నా భార్యలకు కొన్ని విషయములను చెప్పి, నేను వెంటనే ఇక్కడికి వచ్చెదను. నేను అట్లు రానిచో నా శపథములను వినుము. పరమభక్తుడు హరకీర్తన చేయు సమయమున దానిని భంగపరచువాని వంశము నిర్వంశమగును. అట్టి పాతకము నాతలపై పడుగాక! సజ్జనులను హింసించు వారికి, సంతానము వృద్ధికానేరదు. దేవతావిగ్రహములను భంగము చేయువారు, శివమహిమను తృణీకరించువారు, ఘోరమైన నరకమును పొంది, కీటకము లగుదురు. లేనిపోనివాటిని అతిశయోక్తితో చెప్పువారికి కప్ప జన్మము కలుగును. పురాణములు జరుగుచోట నిద్రించువారికి పెనుభూతజన్మము వచ్చును. నేను మరల ఇక్కడికి రానిచో ఈ పాపము లన్నియు నాకు కలుగుగాక!” అని వాగ్దానము చేసి, పోయివచ్చుటకు, వ్యాధుని అనుమతిని అర్థించెను. అమృతోపమానములైన ఆ జింకమాటలను విని, వ్యాధుడు ఆనందబాష్పములతో, పోయివచ్చుటకు జింకకు అనుమతినిచ్చెను. నీరుత్రాగి ఆ జింక తనయింటికి వెళ్లెను.
వ్యాధుడు శివనామస్మరణచేయుచు బిల్వపత్రములను శివలింగముపై వేయుచు, ఆ వృక్షముపైననే కాలము గడపుచుండెను. ఈవిధముగా నాల్గు జాములలోను శివునకు పూజ జరిగెను. వ్యాధుని పాపరాశియంతయు సమూలముగా భస్మమయ్యెను. అప్పటికి తెల్లవారెను. సూర్యభగవాను డుదయించు చుండెను. కొంతసేపటికి మూడవ ఆడుజింక ఆ సరోవరము దగ్గరికి వచ్చెను. దానిని చంపుటకు బాణమును గురిపెట్టగా అది యిట్లు చెప్పెను. "అయ్యా! నన్ను చంపవద్దు. నా బిడ్డకు పాలిచ్చి వెంటనే యిక్కడికి వత్తును. ఆపై నీ యిష్టము వచ్చినట్లు చేయుము” అని ప్రార్ధించెను. వ్యాధుడు అప్పుడు ఈ జింక ఎట్టి ధర్మములను చెప్పునో వినవలెనను కుతూహలముచే జింకను ప్రతిజ్ఞాపూర్వకముగా మాట యిమ్మని కోరెను. అప్పు డాజింక ఇట్లు చెప్పెను. "గడ్డివామికి, గ్రామమునకు నిప్పు పెట్టువారు, గోమాతకు ఉపయోగపడునీటిని అడ్డగించువారు, క్షయరోగపీడితులగుదురు. ఇతరుల వస్తువులను దొంగలింపగోరువారు, మంచివారికి జరుగు సమ్మానమును చూచి అసూయపడువారు, నేత్రరోగములతో బాధపడుదురు. పుస్తకములను దొంగలించువారు మూగవా రగుదురు. భక్తులను నిందించువారినోరు దుర్గంధపూరితమగును. ద్రవ్యమును ఖర్చు చేయక లుబ్ధు డగువాడు బుసగొట్టుచున్న మహాసర్పమగును. భిక్షకై వచ్చిన యతిని బయటికి పంపు పాపి, శివుని ఆగ్రహమునకు పాత్రుడగును. వానిసంతతి, సంపద దగ్ధమగును. వడ్డించిన విస్తరివద్దనుండి బయటికి అతిథిని పంపువాడు మహాపాపి యగును. నేను నీ కిచ్చినమాట తప్పినచో ఈ చెప్పిన పాపము లన్నియు నాకు లభించుగాక!" అని చెప్పిన జింక యొక్క మాటలు విని గద్గదకంఠుడయి జింక పోయి వచ్చుటకు వ్యాధుడు అనుమతించెను. ఆ జింక నీరుత్రాగి యింటికి పోయి తన బిడ్డకు పాలిచ్చి దానిని తృప్తిపరచెను.
గర్భిణిగానున్న ఆడుజింక ప్రసవించెను. రెండవ ఆడుజింక తన ఆశయము తీర్చుకొని, సంతసించెను. వీటి యజమానుడైన మగజింక ఆ మూడుజింకలను చూచి తా మిచ్చిన మాట ప్రకారము వెంటనే వ్యాధునివద్దకు పోవలసినదిగా ఆనతియిచ్చెను. తమ పిల్లలతోపాటు ఆ జింకలన్నియు వ్యాధుని వద్దకు వచ్చెను. మగజింక ముందు నిలబడి మొదట తన్ను చంపవలసినదిగా బోయవానిని
ప్రార్ధించెను. అపుడు ఆడుజింకలు "ఓ వ్యాధుడా! అట్లు చేయుట ధర్మముకాదు. భర్తకంటె ముందుగా భార్యలు చనిపోవుట ఉచితము” అని చెప్పగా తల్లిదండ్రుల మాటలు విన్న చిన్న పిల్లలు అంతఃకరణశుద్ధితో ముందు నిలిచి "మొదట మమ్ములను చంపుము. ఎందువలన ననగా తల్లిదండ్రులను పోగొట్టుకొన్న పిల్లల జీవితము మహాదుః ఖభాజనముకదా” అని ప్రార్ధించిరి.
ఆ బిడ్డలు చెప్పిన మాటలకు ఈ వేటగాని హృదయము కరగిపోయెను. వెంటనే వాని కన్నుల నుండి ఏకధారగా అశ్రువులు రాల నారంభించెను. మిక్కిలి దయార్ద్రచిత్తముతో వ్యాధుడు "ఓ పవిత్రజీవులారా! ధర్మఫలదర్శకమైన మీ హితబోధ విని నేటికి నేను పరమపవిత్రుడనైతిని. జన్మజన్మాంతరములనుండి చేసిన పాపము లన్నియు దగ్ధమై, నాశరీరము పవిత్రమయ్యెను. నా పాలిటికి తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నియు మీరే! ఆలుబిడ్డలతో చేరిన సంసారము కేవలము భ్రాంతినిలయము. శివ! శివ! శివపదవి ఎపుడు ప్రాప్తమగునో!” యని ప్రేమభరితముగా చెప్పుచు నిలబడెను. ఆ సమయమునకు సరిగా కైలాసమునుండి విమానము ఒకటి వచ్చెను. దానిలో ప్రమథులు కూర్చొనియుండిరి. వారిమధ్య పంచముఖములు, పది భుజములు, వ్యాఘ్ర చర్మమును ధరించిన సర్వమంగళ కర్తయగు శ్రీ శంకరుడు దివ్యమైన తేజస్సుతో విరాజిల్లు చుండెను. కిన్నరులు మధురమనోహరమైన వాద్యములను వాయించ నారంభించిరి. విద్యాధరులు రాగాలాపన చేయదొడగిరి. పుష్పవృష్టి కురిసెను. జింకలన్నియు దివ్యశరీరములను పొందెను. వానిని చూచిన వ్యాధుడు వారికి సాష్టాంగనమస్కారముచేసెను. వాని మనోభావములు మారిపోయెను. లోహము స్పర్శమణియొక్క స్పర్శచేత బంగారగునట్లు వ్యాధుడు శివరూపమును ధరించి నిలిచెను. వానిని కూడ విమానములో కూర్చుండజేసిరి. తమదివ్య శరీరములతో జింకలుకూడ విమానమెక్కెను. దేవసమూహమంతయు ఆ శివభక్తులను స్తుతించ నారంభించిరి. శివరూపమును పొందిన వ్యాధుడు శివలోకము నలంకరించెను. జింకలు నక్షత్రమండలమును అలంకరించెను. ఈనాటికి నక్షత్రమండలములో ఆ జింకలు మృగశీర్ష నక్షత్రముగాను, దాని వెనుక ప్రకాశించు నక్షత్రము వ్యాధుడుగాను ప్రకాశించు చుండుటను పుణ్యవంతులు చూడగలుగుచున్నారు.
శ్రీవ్యాసభగవానుడు పవిత్రమైన ఈ కథను స్కాంద పురాణాంతర్గతబ్రహ్మోత్తరఖండమందు లింగకారణమున పేర్కొనినారు. పరమేశ్వరుని కృపా విశేషమున దానిని సంగ్రహముగా ఇందు పొందుపరచితిని. శివరాత్రి మహిమ అనంతము. ఈ కథలను భక్తి శ్రద్ధలతో పఠించు వారిని పరమ శివుడు సర్వదా సంరక్షించును” అని వివరించెను.
సమాప్తము
శ్రీ సాంబ సదాశివార్పణ మస్తు!
#హర హర మహాదేవ శంభో శంకర #🕉️హర హర మహాదేవ 🔱 #🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🙏ఓం నమః శివాయ🙏ૐ #hara hara mahadeva