శివతత్త్వం......!!
నామరూపాత్మకమైన ఈ జగత్తులో శివనామం కన్నా గొప్ప నామం, కాశీకన్నా గొప్పరూపం లేనేలేవని పెద్దలు చెబుతారు. అలాగే మంత్రాలలో పంచాక్షరికి ఆ ప్రసిద్ది ఏర్పడింది. శివ అనేమాటకు మంగళం క్షేమం శాంతి శుభం భద్రం వగైరా ఎన్నో అర్ధాలు చెప్పారు.
దేన్ని జపిస్తే అమృతత్వ స్థితి లేదా పునర్జన్మ లేని స్థితి కలుగుతుందో చెప్పమని యాజ్ఞవల్క్య మహర్షిని శిష్యులు అడిగారు. దానికాయన 'శతరుద్రీయేణేతి' అంటే శతరుద్రీయ ఉపాసనతో మనిషికి అమృతత్వ స్థితి కలుగుతుందని చెప్పారు. శతరుద్రీయ మంత్రాలకు అమృతం అని పేరు. మామూలు మాటల్లో చెప్పాలంటే శతరుద్రీయంటే నమక చమకాలు. ఒక్కోదాంట్లో పదకొండేసి అనువాకాలు ఉంటాయి. అన్నింటినీ కలిపి రుద్రంగా వ్యవహరిస్తారు. రుద్రం శివతత్త్వాన్ని ప్రతిపాదిస్తోంది. సకల దేవతా సమష్టి రూపం శివతత్త్వం. కనుకనే శివారాధనతో సకల దేవతానుగ్రహాన్ని సాధించడం సాధ్యమని సూత సంహిత ప్రకటించింది.
శివుడు పంచముఖుడని వేదం చెప్పింది. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనేవి ఆ అయిదు ముఖాల పేర్లు. మృత్యుంజయునిగా కొలుపులందుకునే మహాదేవుడు అష్టమూర్తులుగా తన కరుణామృతాన్ని ప్రసరింపచేస్తున్నాడని శివపురాణం చెబుతోంది. 'శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అని నానుడి. అంటే సృష్టి సర్వస్వాన్నీ శివుడే శాసిస్తున్నాడని అర్ధం. 'ఈశావాస్యమిదం జగత్' అనే ఉపనిషత్ వాక్యానికి తాత్పర్యం ఇదే. ఈ వివరాలను బట్టి జగచ్చలనం యావత్తూ ఆయన కనుసన్నలలో నడుస్తోందని ఋజువౌతోంది. అయినా ఆయన భక్తసులభుడని లోకప్రతీతి. పైగా బోళాశంకరుడని ఆయనకు వ్యవహారనామం.
భక్తుల పాలిట పరమశివుడు సరళమైన దేవుడు. అటు పురాణాలు పరిశీలించినా, ఇటు లోకరీతిని గ్రహించినా అదే నిజమని తెలుస్తుంది. క్షీరసాగరమథనంలో ఏవేవో అమూల్యమైన దినుసులు వెలువడ్డాయి. గడుసువాళ్లంతా వాటిని ఎంతో వాటంగా పంచేసుకున్నారు. విషం బయటపడేసరికి మాత్రం దూరం జరిగారు. అగ్రపీఠాధిపతి శివుడే ఆదుకోవాలన్నారు. బోళాశంకరుడు పొంగిపోయాడు. గరళాన్ని చేతికిస్తే కాదనలేదు.
కామధేనువులు, కల్పవృక్షాలు మీకూ, కాలకూటవిషం నాకూనా? అని నిలదీయవచ్చనే తర్కం కూడా ఆయనకు తోచలేదు. ఆయన భార్యా వెర్రిబాగులదే. 'హాలాహలమైతేనేం? లోకహితం కోసమేగా స్వీకరించు' అని సమర్థించిందా సర్వమంగళ.
ఇది అమాయకత్వం కాదు. తల్లిదండ్రుల లక్షణం. తాము కష్టపడ్డా బిడ్డలు ఏ లోటూ లేకుండా హాయిగా జీవించాలన్నది తల్లిదండ్రుల సహజ జీవలక్షణం. పార్వతీ పరమేశ్వరులు లోకానికి తల్లిదండ్రులు కాబట్టే వాళ్లిద్దరూ నిరాడంబరంగా ఉంటారు. అందుకే తక్కిన ఆలయాలకన్నా శివాలయాలు ఆర్భాటాలు లేకుండా ఉంటాయి. గమనిస్తే ఈ విషయం మనకు చక్కగా బోధపడుతుంది. బోసిపోయిన గుళ్లు, చౌకరకం తిళ్లు శివుడి వంతు. కమ్మని నేతి వంటకాలు, స్వర్ణాలయాలు ఆయన ఖాతాలోకి రావు. కట్టుకునేది కూడా పీతాంబరం కాదు, ఏనుగు తోలు. ధరించేది పసిడి ఆభరణాలు కావు, మెళ్లో పాకే పాములు. ఆకులు అలములు తప్ప పరిమళాలను వెదజల్లే ఖరీదైన పూలహారాలు తెచ్చి శివుడి మెళ్లో వేసేవారు కనబడరు. పూజాదికాలూ అంతే. అంతగొప్ప రుద్రమంత్రాలున్నా వాటితో పనిలేదు. నమశ్శివాయ పంచాక్షరితో సరిపుచ్చేసుకుంటాడు. కాసింత పత్రి, నీళ్లు తెచ్చి నెత్తిన పోస్తే అదే ప్రసాదం అనుకుంటాడు. మాదయ్యగారి మల్లన్న చెప్పినట్లు, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింట గాడి పసరము, అల్ల సురశాఖి (కల్పవృక్షం) వానింట మొల్లచెట్టు.
అంతెందుకు తిన్నడు పుక్కిలించిన నీళ్లు నెత్తిన ఊసినా దాన్నే అభిషేకమంటూ మురిసిపోయిన అల్పసంతోషి శివుడు. ఆకలితో ఒడిచేరిన పసిబిడ్డకు అమ్మ పాలిచ్చినంత చులాగ్గా వరాలిచ్చేయడం శివతత్త్వం. అలా ఇచ్చేసి అడపాదడపా ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఆయన నైజం. ఆఖరికి పడతిట్టి పోస్తుంటేనూ వాటిని గొప్ప ప్రార్ధనాగీతాలుగా స్వీకరించి అనుగ్రహాన్ని వర్ణించే అమాయకుడు శివుడు. ఒక్కమాటలో చెప్పాలంటే శివుడు మనకు అత్యంత ఆత్మీయుడు. ఆ ఆత్మీయతకు దైవత్వ రూపమే శివతత్త్వం.
#తెలుసుకుందాం #హర హర మహాదేవ 🙏 #🕉️హర హర మహాదేవ 🔱 #హర హర మహాదేవ శంభో శంకర #hara hara mahadeva