#ఏపీ అప్ డేట్స్..📖
*వారెవ్వా.. చంద్రబాబు భలే మందు వేశారే❗*
APRIL 2, 2026🤣
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఏకంగా ఎస్పీ ఆఫీసు మీదకు వెళ్లి వీరబీభత్స స్థాయిలో దందా చేశారు. దాష్టీకం చేశారు. జిల్లా ఎస్పీని ఇంచుమించుగా బెదిరించారు. తాను చెప్పిన మనిషికి పోలీసు న్యాయసలహాదారు పదవి ఇచ్చి తీరాల్సిందేనని యాగీ చేశారు.
తన సిఫారసు ఉత్తరం మేరకు ఆ పోస్టు ఇవ్వకపోవడం పట్ల ఎస్పీతో తగాదా పెట్టుకున్నారు. ఆయన సిఫారసు లేఖను ఎస్పీ సంతకం చేసి పై అధికారులకు పంపేసినా కూడా ఆయన అక్కడినుంచి పదిగంటలపాటు కదల్లేదు. పై అధికార్లనుంచి నియామక ఉత్తర్వులు వచ్చేదాకా అక్కడినుంచి కదలనంటూ
భీష్మించుకున్నారు.
మరో ఎమ్మెల్యే ఇతర నాయకులు సర్దిచెప్పడానికి ఎస్పీ కార్యాలయానికి వెళితే.. ఎస్పీ ఛాంబర్ బాత్రూంలోకి వెళ్లి గడియ బిగించుకున్నారు. చివరకు పోలీసు అధికారులు డంబెల్స్ తో బాత్రూం తలుపులు పగలగొట్టి.. ఆయనను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. తన మనిషికి పోస్టు ఇచ్చేదాకా కుదరదంటూ ఆ తర్వాత కూడా ఆయన మొండికేశారు. ఈలోగా.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ కార్యాలయాలనుంచి ఆయనకు ఫోను వచ్చినా కనీసం రెస్పాండ్ కూడా కాలేదు.
లోకేష్ అయితే నాకేంటి.. నేను చెప్పిన వ్యక్తి అడిగిన పోస్టు దక్కాల్సిందే అన్నట్టుగా తలెగరేసి నిలబడ్డారు. ఈ మొత్తం దందాతో.. పార్టీ పరువు బజార్న పడింది. ఈ ఎమ్మెల్యే
రచ్చచేశాడు గనుక.. అందరికీ తెలిసింది గానీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నెన్ని దందాలు సాగిస్తున్నారో కదా.. అని అందరూ విస్తుపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటి ఆగడాల ఎమ్మెల్యేలకు చంద్రబాబు చూపిస్తున్న పరిష్కారం ఇంకా చిత్రంగా ఉంది.
ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉంటే దానిని తగ్గించుకోవడానికి ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలని చంద్రబాబు హితోపదేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేల టెన్షన్ కు కారణాలను ఓటీటీ సిరీస్ ల మీదకు నెట్టేస్తున్నారు. ఆయన చెబుతున్నదేంటో తెలుసా.. “ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లలో సిరీస్ లు చూడడం ఎక్కువైంది. నేరాలు ఘోరాలు చేస్తున్న రీల్స్ ను తెగ చూస్తున్నారు. దీంతో మనసు పాడు చేసుకోవడం, అక్కడినుంచి ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా అసహనానికి గురవడం మెంటల్ ఇన్ బ్యాలన్స్ అవడం జరుగుతోంది.
మా ఎమ్మెల్యే నిన్న వెళ్లి ఓ కార్యాలయంపై పడ్డారు.. అందుకే అందరూ టెన్షన్ ఎక్కువగా ఉంటే మైండ్ కంట్రోల్ చేసుకునేందుకు ఓ ఇరవై నిమిషాలు ధ్యానం మెడిటేషన్ చేయండి. అవసరమైతే ప్రత్యేకంగా క్లాసులు పెట్టిస్తా' అని అంటున్నారు.
తన పార్టీ ఎమ్మెల్యేల దుడుకు తనాన్ని కంట్రోల్ చేయలేని చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాక్షాత్తూ చంద్రబాబు స్థాయి వ్యక్తి ఇలాంటి పలాయనవాదపు మెడిటేషన్ డైలాగులు వల్లించడం మరీ కామెడీగా ఉంది. ఏ ఎమ్మెల్యే అయితే ఎస్పీ మీదనే దందా చేయదలచుకుని పార్టీ పరువు బజార్న పడేశాడో.. ఆ ఎమ్మెల్యే ఏదో పబ్లిక్ టెన్షన్ లో ఉన్నట్టుగా రంగుపులమడానికి పాపం.. చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుంది.
తన అనుచరుడికి పోలీసు శాఖలో పోస్టు ఇప్పించుకుని దందాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఎమ్మెల్యే చేసిన బాహాటపు కుట్రలు కూడా చంద్రబాబుకు 'టెన్షన్' రూపంలో కనిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఇక ఎవరు బాగు చేయగలరు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే పని ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసి ఉంటే చంద్రబాబు ఇదే రీతిగా స్పందించేవారేనా అని కూడా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.