ఏపీ అప్ డేట్స్..📖
4K Posts • 2M views
P.Venkateswara Rao
528 views 1 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 *పెనం మీద నుంచి పొయ్యిలోకి❗* NOVEMBER 18, 2025🎯 "తెల్ల కాగితం ఇస్తున్నా. ఎలాంటి పాలసీ తీసుకొస్తే మీకు లాభమే, ఏం కావాలో రాసుకోండి. మీరు కోరుకున్నట్టు చేస్తా” అని యువగళం పాదయాత్రలో ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ గ్రానైట్ వ్యాపారులతో అన్నమాటలివి. కూటమి ప్రచారాన్ని అన్ని వర్గాల ప్రజానీకం నమ్మినట్టే గ్రానైట్ వ్యాపారులు కూడా విశ్వసించారు. కూటమి వచ్చిన తర్వాత రాయల్టీ, జీఎస్టీ విషయాల్లో గ్రానైట్ వ్యాపారులకు ప్రయోజనం కలగడం పక్కనపెడితే, వైసీపీ హయాంలో కంటే దారుణమని వ్యాపారులు వాపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం, కడప, కర్నూలు, కొద్దోగొప్పో అనంతపురం, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో గ్రానైట్, మైనింగ్ పరిశ్రమలు ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు గ్రానైట్ వ్యాపారులు వెళ్లి రాయల్టీ, జీఎస్టీ విషయంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ బాదుడు ఉన్న సంగతిని వివరించారు. అయితే ఈ దోపిడీ వెనుక ప్రభుత్వంలోని కీలక పెద్దలున్నారని, తామేమీ చేయలేమని చేతులెత్తేసినట్టు గ్రానైట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వైసీపీ హయాంలో గ్రానైట్ పరిశ్రమల్లో ఒక్కో కట్టరు రూ.27 వేలు చొప్పున రాయల్టీ వసూలు చేసేవారు. ఇప్పుడు కట్టర్కు రూ.35 వేలు, అలాగే అదనంగా జీఎస్టీ కింద రూ.5 వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దుస్థితి. అనధికారికంగా మరో రూ.35 వేలు చెల్లించుకోవాల్సి రావడంతో వ్యాపారం చేయలేమని వారు అంటున్నారు. అంటే ఒక్కో కట్టర్కు రూ.75 వేలు ముట్టచెబితే తప్ప, వ్యాపారంలో ఏమీ చేయలేని పరిస్థితి వుందని వ్యాపారులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్లో అక్రమ, సక్రమ వసూళ్ల బాధ్యతల్ని నెల్లూరుకు చెందిన ఒక కంపెనీకి అప్పగించారు. వైసీపీ హయాంలో ఈ కంపెనీ రెండు, మూడు జిల్లాలకే పరిమితమై వుండింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని గంపగుత్తగా అప్పగించినట్టు గ్రానైట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ గ్రానైట్ వ్యాపారుల్ని జలగల్లా రక్తం పీల్చి పిప్పి చేస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. గ్రానైట్ వ్యాపారంలో ప్రభుత్వానికి 60 శాతం, కీలక నాయకులకు 40 శాతం ఆదాయం వెళుతున్నట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ నుంచి అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నారనేది వారి ఆరోపణ. ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇష్టానుసారం చెకోపోస్టులు పెట్టడాన్ని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. ఒక్కో చెక్ పోస్టులో ఇద్దరు ఉద్యోగులను నియమించుకుని, గ్రావెల్, ఇసుక, మట్టి తరలింపుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తోందని వారు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గ్రానైట్ వ్యాపారులు పరిశ్రమల్ని మూసుకోడాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రాయల్టీలు భారమై, వ్యాపారాలు చేయలేకపోతున్నామని వాపోయేవారు. గతంలో నారా లోకేశ్ తియ్యటి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత భారం తగ్గించడానికి బదులు, మరింత మోపారని వారు ఆరోపిస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైందని గ్రానైట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
11 likes
13 shares
P.Venkateswara Rao
559 views 1 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 *బాబుతో తప్పు చేయిస్తున్న అధికారం❗* NOVEMBER 17 2025🎯 విశాఖలో సీఐఐ సదస్సు పేరుతో రెండు రోజుల పాటు చంద్రబాబు సర్కార్ హడావుడి చేసింది. లక్షల కోట్లు పెట్టుబడులు, వందలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఆకాశమే హద్దుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ మీడియా కూడా అదే ప్రచారంలో మునిగి ఉండగా, చంద్రబాబు నోరు జారారు. విశాఖ ఉక్కు కార్మికులు, సంబంధిత సంఘాల నాయకులపై ఆయన నోరు పారేసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టపోవడానికి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులే సోమరితనమే కారణమని అర్థం వచ్చే రీతిలో బహిరంగంగానే ఆయన అన్నారు. చంద్రబాబు ఎంత ఫ్రెండ్లీగా వుంటారో కానీ, ప్రశ్నిస్తే చాలు ఆయన తట్టుకోలేరు. చేతిలో అపరిమితమైన అధికారం వుందనే కారణం కావచ్చు, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఆయన అనుకుంటున్నట్టున్నారు. సీఐఐ సమ్మిట్ వల్ల వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా టీడీపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉన్నాయి. బాబు చేసిన నష్టాన్ని, పూడ్చేందుకు అన్నట్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు. బాబు మాటల్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో పౌర సమాజం వుందని పల్లా శ్రీనివాసరావు భావిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. గతంలో తమ సమస్యలు చెప్పుకోడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులపై నడిరోడ్డుపై చంద్రబాబు చిందులు తొక్కారు. తోకలు కట్ చేస్తానని, వారి వృత్తిని అవమానించే రీతిలో బాబు మండిపడడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును నిలుపుకోలేక పోతుండడంతో పాటు ఇంకా పెట్టని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తుందని ఆయన చెప్పడం విశేషం. ప్రైవేటీకరణపై చంద్రబాబు మోజు మరోసారి బయటపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనంటే చాలు ప్రైవేట్కు స్వర్గధామం. విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రైవేట్పరమే. కేవలం తమ పదవుల్ని మినహాయించుకుని, అన్నింటినీ ప్రైవేట్పరం చేయడానికి చంద్రబాబు వెనుకాడడం లేదని వామపక్షాల నాయకుల విమర్శలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు కామెంట్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బాబు చెప్పింది వినాలే తప్ప, ఎదురు ప్రశ్నిస్తే ఆయన స్పందన అట్లే వుంటుందనే మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నాయకుడిగా మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లు అని సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ ఆరోపణ చర్చనీయాంశమైంది.
15 likes
1 comment 12 shares
P.Venkateswara Rao
1K views 2 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #చంద్రబాబు నాయుడు *బాబు పాలన అత్యంత ప్రమాదకరం..‼️* NOVEMBER 16, 2025🎯 సమాజంలో అసహనం, అశాంతి ఉండకూడదు. ఇవి రెండు సమాజంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. తద్వారా ప్రజలకు మనశ్శాంతి కరువవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి 17 నెలల పాలనలో ఏవైనా తీసుకొచ్చిందంటే అసహనం, అశాంతి అని చెప్పాల్సి వుంటుంది. ఇంత తక్కువ సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ తమ పాలనారీతులు సమాజంలో కక్షలు, కార్పణ్యాలు పెంచేవిగా ఉన్నాయనే సంగతిని పాలకులు విస్మరించారు. కేవలం అధికారం చేతిలో వుందన్న ఏకైక కారణంతో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే లెక్కలేని తనంతో ప్రత్యర్థులు, అలాగే సామాన్య ప్రజలపై వేధింపుల పర్వాన్ని సాగిస్తున్నారనే అభిప్రాయం వుంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డగోలుగా నడుచుకుంటున్నారనే విమర్శ వుంది. ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజానీకం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది. వైసీపీ పాలనే నయం అని ప్రజలు అనుకునే పరిస్థితిని 17 నెలలకే తీసుకొచ్చిన ఘనత కూటమి పాలనకే దక్కింది. నిజానికి వైసీపీ ఘోర పరాజయం తర్వాత, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్పై సొంతవాళ్లలోనే అనేక అనుమానాలు తలెత్తాయి. గతంలో మాదిరిగా సీఎం చంద్రబాబు తప్పులు చేయరని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న చెడ్డపేరు వుంది. పరిపాలనలో, అలాగే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు వైసీపీ పాలనలో చోటు చేసుకున్న తప్పుల్ని చేయరని జనం ఎంతో నమ్మకంగా వున్నారు. కానీ ఆచరణకు వచ్చే సరికి, జగన్ పాలన ఎన్నో రెట్లు నయమని సానుకూలంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నారా లోకేశ్ రెడ్బుక్ అంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు శ్రీకారం చుట్టారు. తామేం తక్కువని కిందిస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఎవరికి వారు లోకేశ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఏకంగా సామాన్య ప్రజానీకంపై గద్దల్లా పడ్డారు. ఎవరైనా తిరగబడితే పోలీస్ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా, అడ్డగోలుగా వాడుకుంటూ, తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో అసహనం, అశాంతిని రేకెత్తించాయి, రేకెత్తిస్తున్నాయి. చాలా మంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చారు. రాజకీయంగా టీడీపీకి ఇది మంచిది కాదు. అలాగే ఇలాంటి ధోరణులు ఆంధ్రప్రదేశ్ సమాజ అభివృద్ధికి అవరోధం. మనుషుల మధ్య ప్రేమాభిమానాలుండాలి. భిన్నాభిప్రాయాలు గొడవలకు దారి తీయకూడదు. అసలిప్పుడు ప్రజాస్వామిక లక్షణాలే లేకపోతే, ఇక స్వేచ్ఛగా అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం ఎక్కడ? అని ప్రశ్నించే పరిస్థితి. కేవలం భయంతో కూటమి పాలనలోని తప్పుల్ని ప్రశ్నించలేకపోతున్నారు. అంతే తప్ప, మౌనం ప్రజామోదం అనుకోకూడదు. రాజకీయంగా వైసీపీని వేధించడం వరకే ముఖ్యంగా టీడీపీ పరిమితం కాలేదు. తటస్థులు, సామాన్యుల ఆస్తులపై కూడా పడుతుండడం వల్లే ఇబ్బందులు తలెత్తాయి. ఒకవేళ అధికారం మారితే, అసహనం, అశాంతి తీవ్ర ఆగ్రహం రూపం దాల్చితే... పరిస్థితి ఏంటో మంత్రి నారా లోకేశ్ ఆలోచించుకుంటే మంచిది. ఏది ఏమైనా తమ పాలనలో నాణేనికి రెండో వైపు ఏం జరుగుతున్నదో చంద్రబాబు, లోకేశ్ తెలుసుకోవడం మంచిది.
23 likes
2 shares
P.Venkateswara Rao
569 views 3 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 *ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇక కష్టకాలమే..⁉️* NOVEMBER 15, 2025🎯 ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇక కష్టకాలమే. కరిస్తే కప్పకు, విడిచిపెడితే పాముకు కోపం అనే చందంగా రాజకీయాలు తయారయ్యాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఒక రకమైన వేధింపులు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వేధింపులు, అలాగే ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయని ఉద్యోగులు నమ్మారు. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి. వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసే క్రమంలో తమను బలి పెడుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో పని చేసిన ఉద్యోగులంతా దొంగలన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యతిరేక పాలన సాగిస్తున్నామనే స్పృహ పాలకుల్లో కొరవడిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాదొడ్డిపై అక్కసుతో ఏకంగా ముగ్గురు పాత మున్సిపల్ కమిషనర్లు, అలాగే వివిధ హోదాల్లో పని చేస్తున్న, అలాగే పదవీ విరమణ చేసిన 43 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఫిర్యాదు మేరకు సాగుతున్న తతంగం ఇది. ఇదేమంటే అక్రమాలపై చర్యలు తీసుకోవద్దా? అనే ప్రశ్న వస్తోంది. అక్రమాలపై చర్యలు తీసుకోడాన్ని ఎవరూ వద్దనరు. ఆ సాకుతో కక్షసాధింపునే తప్పు పడుతున్నారు. అలాగే అభ్యంతరకర పోస్టులపై అరెస్ట్ అయిన ఎన్ఆర్ఎ మాలెంపాటి భాస్కర్రెడ్డిని ఆయన గ్రామం నుంచి జైలుకు తరలిస్తూ మార్గంమధ్యలో టిఫెన్ చేయించడాన్ని ప్రభుత్వం నేరంగా భావించింది. ఎస్కార్ట్ సిబ్బందిపై పోలీస్ అధికారులు నిఘా పెట్టి మరీ ఫొటోలు తీసుకుని, ఐదుగురు పోలీస్ సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం. పరకామణి కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న గుంతకల్లు రైల్వే సీఐ సతీష్కుమార్ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనం రేపుతోంది. సిట్ అధికారుల వేధింపులతోనే బలవన్మరణం చెందినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసులో నిజాలు చెబుతారనే భయంతో వైసీపీ నాయకులే హత్య చేయించారని కూటమి నేతల ఆరోపణలు. మొత్తానికి పరకామణి కేసులో తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. వైసీపీకి అనుకూలమని రాజకీయ ముద్ర వేసి వివిధ స్థాయిల్లోని పోలీస్ అధికారులకు అసలు పోస్టింగ్లో లే ఇవ్వలేదు. అలాగే కొందరిపై నెలల తరబడి సస్పెన్షన్ చేయడం, ఉద్యోగులపై ఏదో రకంగా కక్షసాధింపులు. నిజానికి ఎన్నికల ముందు కూటమికి ఉద్యోగులు భారీస్థాయిలో అండగా నిలిచారు. కులాలకు అతీతంగా కూడా మద్దతుగా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కృతజ్ఞత చూపకపోగా, తీవ్రంగా వేధిస్తోందన్న ఆవేదన ఉద్యోగుల్లో వుంది. ఇలాగైతే ఉద్యోగాలు చేయలేమన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతోంది. భవిష్యత్లో అధికారం మారితే, ఆ ప్రభుత్వానికి ఉద్యోగులే టార్గెట్. పాలకుల రాజకీయ కక్ష, కార్పణ్యాలకు తమను బలి చేస్తున్నారన్న ఆవేదనతో ఉద్యోగులున్నారు. మరోవైపు పాలకుల మెప్పుకోసం తమను కొన్ని శాఖలకు చెందిన అధికారులు వేధిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అంతుచూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు విధులు నిర్వహించడం కత్తిమీద సామే. మనశ్శాంతి లేకుండా పోతోందని ఉద్యోగులు వాపోతున్నారు.
9 likes
14 shares