#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*మహిళలకు చంద్రబాబు వరాల డ్రామా❗*
MARCH 9, 2026🎯
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. ఇలాంటి ఆర్భాటాలను ఎలా సెలబ్రేట్ చేయాలో బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ వేడుకల్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికల ప్రకారం.. ఈ సందర్భంగా.. చంద్రబాబు మహిళలకు మహాగొప్ప వరాలను ప్రకటించారు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, ఎమ్మెల్యేలయ్యేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు.
అలాగే.. గ్యాస్ ధరలు పెరిగినా కూడా.. ఏడాదిలో మూడు సిలిండర్ల పథకాన్ని యథాతథంగా కంటిన్యూ చేయనున్నట్టుగా కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇంతకు మించిన వరాలు ఆయన వద్ద మరేమీ లేవేమో అనిపించేలా.. కొన్ని పత్రికల పతాకశీర్షికల్లో ఇవే కనిపిస్తున్నాయి.
అసలు ఈ వరాల్లో చంద్రబాబు మహిళాలోకానికి కొత్తగా ఒరగబెడుతున్నది ఏముంది? అదే సమయంలో, మూడేళ్లకిందటి హామీని అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా తొక్కిపట్టేసి మహిళల పట్ల సాగిస్తున్న వంచన మాటేమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
మహిళలు ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలనేది కూడా ఒక హామీనేనా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కినంత మాత్రాన.. అందులో చంద్రబాబు పాత్ర
ఏమైనా ఉందా? తాను వ్యతిరేకించినా కూడా నెగ్గగల బిల్లుకు తన పార్టీ ఎంపీలతో అనుకూలంగా ఓటు వేయించడం తప్ప.. ఆయన చేసినది ఏముంది?
కేంద్రం పూనికతో 33 శాతం రిజర్వేషన్లు చట్టరూపం దాల్చగా.. అదేదో తాను చేసిన గొప్పపని అన్నట్టుగా.. మహిళలు ఎమ్మెల్యే కావడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం చేసిన చట్టం అమలయ్యేలోగా.. మహిళలకు చంద్రబాబు అదే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనను నెత్తిన పెట్టుకుని ఉండవచ్చు.
ఫరెగ్జాంపుల్.. ఆ చట్టం గత ప్రభుత్వ హయాంలోనే అయింది గనుక.. 2024 ఎన్నికల్లోనే చంద్రబాబు గనుక.. తన పార్టీ తరఫున 33 శాతం టికెట్లు మహిళలకు ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనకు నీరాజనాలు పట్టిఉండవచ్చు. పోనీ.. కేబినెట్ లో 33 శాతం బెర్తులు మహిళలతో భర్తీచేసి ఉంటే అదైనా గౌరవంగా ఉండేది. అవేమీ చేయకుండా.. మహిళా దినోత్సవానికి అదే తన పెద్ద హామీ అన్నట్టుగా చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అని ప్రజల అభిప్రాయం.
2023 మేలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించారు చంద్రబాబునాయుడు. ఇంకో నెల గడిస్తే.. మూడేళ్లు పూర్తవుతాయి. అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తున్నాయి. ఆ పథకానికి ఇప్పటిదాకా అతీగతీ లేదు.
రాష్ట్రంలో అర్హురాలైన ప్రతి మహిళకు రూ. 1500 నెలకు ఇవ్వాలనేది ఆ పథకం. మహిళాదినోత్సవం నాడు ఆ పథకాన్ని ప్రారంభించి ఉంటే బాగుండేది. లేదా, కనీసం ఫలానా తేదీనుంచి ప్రారంభిస్తాం అని ప్రకటించి ఉంటే మర్యాదగా ఉండేది. దానిని మరుగున పెట్టేసి.. సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేశాం.. అవన్నీ సూపర్ హిట్ అయిపోయాయి.. అని అబద్ధాల డప్పు కొట్టుకుంటూ చంద్రబాబు మాయచేస్తున్న తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.


