#ఏపీ అప్ డేట్స్..📖 #YSR Congress Party #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*భయపడే స్థితి నుంచి భయపెట్టే వరకూ.. వైసీపీ ఎదుగుదల❗*
14.06.2026🎯
ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ తీవ్ర ఆగ్రహావేశంతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. అయితే హామీల్ని నిలబెట్టుకోవడంలోనూ, అలాగే ఇతరత్రా ప్రభుత్వం విఫలమైందని వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వెన్నుపోటుకు రెండేళ్ల నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు.
అధినాయకుడి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగింది. ప్రతి చోటా, ఒకరికి మించి మరొకరు కార్యక్రమాన్ని నిర్వహించడానికి పోటీ పడ్డారు. వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో కడప ఎంపీ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో చాలా కాలం తర్వాత భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పోరుబాటలో నడవడం విశేషం. అలాగే అనంతపురం మొదలుకుని ఇచ్ఛాపురం వరకూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరోత్సాహంతో నడిచారు.
వైసీపీ శ్రేణుల ఉత్సాహం చూస్తే, కేవలం 11 సీట్లకే పడిపోయిన పార్టీగా కనిపించదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయన్న భావన వైసీపీ పోరుబాటలో చూపిన తెగువ చూపుతోంది. కేవలం రెండేళ్లకే కోలుకుని అట్టడుగు స్థాయి నుంచి పైకి లేవడం సామాన్య విషయం కాదు. రెండేళ్ల క్రితం ఇక వైసీపీ పని అయిపోయిందన్న ప్రచారం విస్తృతంగా సాగింది.
అలాంటి స్థితి నుంచి మళ్లీ అధికారం మనదే అనే భరోసాతో ముందుకు కదలడం కూటమి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లు పూర్తి చేసుకున్నామన్న ఆనందం కంటే, వైసీపీ వెన్నుపోటు నిరసన ప్రదర్శనలు భయాన్ని కలిగించాయి. అసలేం జరుగుతున్నదో అంతుచిక్కని విధంగా వైసీపీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది.
వైసీపీ నాయకులు కూడా ఈ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు విజయవంతం అవుతాయని ఊహించలేదు. వైసీపీ కార్యకర్తల్లో 70 శాతం మంది యాక్టీవ్ అయ్యారనేందుకు నిన్నటి నిరసన ప్రదర్శనల్లో వెల్లువెత్తిన జనమే నిదర్శనం. వైసీపీ కార్యక్రమం ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా టీడీపీ అంటే భయపడే పరిస్థితి పోయింది. కేవలం రెండేళ్లకే భయపడే స్థితి నుంచి భయపెట్టే వరకూ వైసీపీ ఎదిగిన తీరు అద్వితీయం.
తిరుపతిలో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో మరోసారి మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ గురించి ప్రస్తావించారు. అయితే ఇప్పుడు రెడ్బుక్, కేసులు, అరెస్ట్లు, జైళ్లకు భయపడే నాయకులు వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. మహా అయితే జైళ్లో నెలో, రెండు నెలలో, మూడు నెలలో వుండి వస్తామని, ఆ తర్వాత మీ కథేంటో చూస్తామని హెచ్చరిస్తున్నారు.
గుడివాడ, గన్నవరం, తాడిపత్రి, గుంటూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రి ఇలా ఎక్కడ చూసినా, పోలీసులు, అధికార పార్టీ నాయకుల హెచ్చరికల్ని వైసీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. గుడివాడలో కొడాలి నాని నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఎప్పట్లాగే చంద్రబాబు, ఆయన తనయుడిపై విమర్శలు గుప్పించారు. తమది పరశురాముడి గొడ్డలి అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.
గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ అదరగొట్టారు. ఇక అంబటి రాంబాబు అయితే మరోసారి చెలరేగిపోయారు. చంద్రబాబు కథ ముగిసిన అధ్యాయంగా ఆయన తనదైన స్టైల్లో మాటలకు పదును పెట్టారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి దూకుడు ప్రదర్శించారు. పోలీసులు ఎంతగా అడ్డుకుంటున్నా, అడుగులు ముందుకే తప్ప , వెనక్కి వేసేది లేదని తేల్చి చెప్పారు.
తనను అరెస్ట్ చేసిన తర్వాత, అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట పెద్దారెడ్డి ధర్నాకు దిగారు. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. తిరుపతిలో ఒకవైపు కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ, మరోవైపు దాన్ని తలదన్నేలా భారీ ప్రదర్శన నిర్వహించిన ఘనత భూమన కరుణాకరరెడ్డికే దక్కుతుంది. ఆ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్పై భూమన విరుచుకుపడ్డారు.
కర్నూలు జిల్లాలో ఏకంగా వాహనాలు దహనం చేసుకునే పరిస్థితి. అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ, అయితే ఏంటట అని వైసీపీ నాయకులు ధైర్యంగా నిలదీస్తున్నారు. అధికారంలోకి రాబోయేది తామే అని ధీమాగా వ్యవహరిస్తున్నారు.
కేవలం రెండేళ్లలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఊహించి వుండరు. మరోవైపు తిరుపతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అద్భుతాలు సాధించామని చెప్పుకునేందుకు నిర్వహించిన విజయోత్సవ సభ …వైసీపీ నిరసన ప్రదర్శనలతో పోల్చితే వెలవెలబోయింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సభ సక్సెస్ కాలేదు. జనం కూడా ఊహించిన స్థాయిలో రాలేదన్న మాట టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తోంది.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రసంగాలు ఆకట్టుకోలేదు. రెండేళ్లలో సాధించిన ప్రగతిపై తమ నాయకులు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని కూటమి పార్టీల శ్రేణులు సైతం పసిగట్టాయి. తమ ఆకాంక్షలకు తగ్గట్టు పాలన సాగడం లేదన్న ఆవేదన, ఆగ్రహం వారిలో వుంది. అయితే ఇంకా మూడేళ్ల పాటు అధికారం వుండడంతో ఎవరూ నోరెత్తి ప్రశ్నించలేని పరిస్థితి కూటమిలో నెలకుంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని కార్యకర్తలకు బాగా తెలుసు. రెండేళ్లలో సాధించింది ఏంటంటే… కూటమి ప్రజాప్రతినిధుల కంటే, గత వైసీపీ ప్రజాప్రతినిధులే మేలు అని ప్రజలు ఒక అభిప్రాయానికి రావడం. తమ వారిని కంట్రోల్ చేసుకోవడం మానేసి, ఇంకా గత పాలకుల వైఫల్యాలపై సీఎం చంద్రబాబు , ఆయన కేబినెట్ సహచరులు ఆరోపణలు చేయడాన్ని పౌర సమాజానికి నచ్చడం లేదు.
మంచి పరిపాలన అందించాలని అపరిమితమైన అధికారాన్ని ఇస్తే, ఇంత అధ్వానంగా చేస్తున్నారేంటి? అని ప్రజలు తిట్టుకునే పరిస్థితి. అయితే ఇవేవీ తెలియని అమాయకుల్లా పాలకులు నటిస్తున్నారు. ప్రభుత్వం మారినా, అరాచకాలు, దోపిడీలు మరింత పెరిగాయన్న భావన ప్రతి ఒక్కరిలో వుంది. ఒకింత పెరిగాయని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అందుకే క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
తమ లోపాల్ని సరిదిద్దుకునే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. అందుకే రానున్న రోజుల్లో పాలనలో మంచి కనిపిస్తుందనే ఆశ సన్నగిల్లుతోంది. ఇదే వైసీపీకి ఆయుధంగా మారింది. అందుకే ఆ పార్టీకి మళ్లీ అధికారంపై భరోసా ఏర్పడింది. కదనోత్సాహంతో కదులుతోంది.


