P.Venkateswara Rao
452 views
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 * #తిరుమల లడ్డు.. పవన్ కు అవగాహన లేక కాదు❗* FEBRUARY 5, 2026🎯 తిరుమల లడ్డూ వ్యవహారాన్ని అయినకాడికి లాగాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని స్పష్టం అవుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తిరుమల లడ్డులో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించారు. ప్రత్యేకించి జంతుకొవ్వు, పంది కొవ్వుఅంటూ పవన్ మాట్లాడారు. అయితే సీబీఐ విచారణతో వ్యవహారం అడ్డం తిరగడంతో.. ఇప్పుడు మరో కమిటీ అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు! ఈ కమిటీ వ్యవహారం ఆల్రెడీ అభాసుపాలవుతోంది. తాము చెప్పినట్టుగా నివేదిక వచ్చే వరకూ తిరుమల లడ్డును కూడా వదలమని, అది తమ అధికార మహత్యమని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా అవుతోంది. ఆ సంగతలా ఉంటే.. తిరుమల లడ్డుకు వినియోగిస్తున్న నెయ్యి విషయంలో పవన్ కల్యాణ్ స్పందన మరింత ఆశ్చర్యకరంగా ఉంది. అది ధర విషయంలో! తిరుమల లడ్డుకు వాడుతున్న నెయ్యి ధర చాలా తక్కువగా ఉందని, ఆ ధరకు కనీసం నువ్వుల నూనె రావడం లేదని, అలాంటిది నెయ్యి ఎలా వస్తుందంటూ పవన్ దీర్ఘాలు తీశారు, తెగ ఆశ్చర్యపోయారు! అయితే కనీస అవగాహన లేని మాటలు అవి. పైకి అలా కనిపించినా, పవన్ కు అవగాహన లేక కాదు, రాజకీయం కోసం ఇలా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది! ఇలా మాట్లాడే ముందు అయినా కాస్త ఆలోచించుకోవాలి. ఏదో లాజికల్ పాయింట్ తీసినట్టుగా పవన్ అనుకుంటే అనుకుని ఉండవచ్చు కానీ, అది ఆయన అవగాహన రాహిత్యాన్ని బయట పెడుతూ ఉంది. ఒక కేజీ నెయ్యిని పురాతన, సంప్రదాయ పద్ధతుల్లో తీయాలంటే చాలా ఖర్చే అవుతుందేమో! అయితే.. టీటీడీ దశాబ్దాలుగా ఈ సంప్రదాయ పద్ధతుల ద్వారా తయారైన నెయ్యిని కొనడం లేదు. అది నందిని డైయిరీ నుంచి కొన్నా, మరో డైయిరీ నుంచి కొన్నా.. డైయిరీ ఇండస్ట్రీ పద్ధతుల ద్వారా తీసిన నెయ్యినే కొంటూ ఉంది. డెయిరీ ఇండస్ట్రీలో దేనికదే అన్నట్టుగా.. క్రీమ్ తీసే శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రాసెసింగ్ చేస్తారని పాల పాకెట్ కొనే వారెవరిని అడిగినా చెబుతారు. పాల బూత్ దగ్గరకు వెళితే.. సవాలక్ష రకాల పాలు అందుబాటులో ఉంటాయి. ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్క్, నాన్ ఫ్యాటీ మిల్క్, ఆవు పాలు, గేదెపాలు.. ఇంకా నందిని పాలు అయితే ఐదారు రకాల పాకెట్లలో అందుబాటు ఉంటాయి. ఆరెంజ్, బ్లూ, స్పెషల్ మిల్క్, ఇలా జనాలు రంగులు చెప్పి కొంటూ ఉంటారు. వాటిల్లో తేడాలు ఏమిటో జనాలకు స్పష్టంగా తెలుసు! ఈ మేరకు నెయ్యి తయారీకి పాల నుంచి క్రీమ్ ను వేరు చేసి.. ఆ క్రీమ్ ని నెయ్యి తయారీ కోసం వాడతాయి కంపెనీలు. దీంతో.. డెయిరీ ఇండస్ట్రీ నుంచ వచ్చే నెయ్యి ధర తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉండాలి కూడా! ఎందుకంటే.. ఒక ఇంట్లో నెయ్యి కాచాలంటే.. పాలను పెరుగుగా మార్చి, చిలికి, వెన్న తీసి నెయ్యి కాచాలి. అప్పుడు ఒక్క లీటర్ నెయ్యి కోసం ఎన్నో లీటర్ల పాలు అవసరం అవుతాయి. అయితే డెయిరీ ఇండస్ట్రీలో క్రీమ్ తీసిన పాలను కూడా మార్కెటింగ్ కు ఆస్కారం ఉంది. కాబట్టి.. అక్కడ నెయ్యి ధర తగ్గిపోతుంది. ఇదంతా చిన్న పిల్లలకూ తెలిసిన విషయమే! అయితే.. లడ్డూ వ్యవహారాన్ని సంచలనంగా మార్చడం కోసం, తమ రాజకీయ అవసరాల కోసం.. ప్రతిదాన్నీ ట్విస్ట్ చేసి, ఆశ్చర్యాలు వ్యక్తం చేసి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు! సార్.. అది తిరుమల లడ్డూ సార్! మరీ ఇంత రాజకీయ వస్తువుగా మార్చాలా!