#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*జగన్పై విఫలమైన బాబు బ్రహ్మాస్త్రం……❗️*
FEBRUARY 6, 2026🎯
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విఫలమైంది. దీంతో రాజకీయంగా జగన్ను దెబ్బకొట్టేందుకు అస్త్రాల కోసం వెతుకులాడుతున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరులో తమపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు, కేబినెట్లోని సగం మంది సహచరుల్ని చంద్రబాబు వెంటపెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత సీరియస్ గా తీసుకున్నారో ఇదే నిదర్శనం.
మీడియా సమావేశంలో చంద్రబాబు జంతువుల కొవ్వు అంశాన్ని పక్కన పెట్టినట్టు కనిపించింది. ఇదే సందర్భంలో జగన్పై మరో అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ అస్త్రం కూడా
తిరుమల లడ్డూ ప్రసాదం కావడం గమనార్హం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిపింది కమీషన్ల కోసం కాదని, ఏకంగా హిందూమతాన్ని అప్రతిష్టపాలు చేయడానికే అంటూ పేద్ద బండరాయి వేశారు. అయితే ఏడాది క్రితం మతం ప్రాతిపదికగా, శ్రీవారి ప్రసాదాన్ని బ్రహ్మాస్త్రంగా భావించి జగన్పై బాబు ప్రయోగించారు.
సీబీఐ చార్జిషీట్ తో బాబు, పవన్ ఆరోపణలన్నీ అబద్ధాలని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు జంతువుల కొవ్వుకు బదులు, కల్తీ జరపడం హిందూమతాన్ని దెబ్బకొట్టడానికే అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. జగన్ క్రిస్టియన్ మతస్తుడు కావడంతో ఆయన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తిరుమల శ్రీవారిని పాలకులు ఆయుధంగా వాడుకుంటుండడంపై భక్తులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.
తెలుగు సమాజం మతం విషయంలో మొదటి నుంచి చాలా అప్రమత్తతో వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మతం కంటే కుల రాజకీయాలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత ఎన్నికల్లో కుల సమీకరణల్లో కూటమి సక్సెస్ అయ్యింది. పవన్కల్యాణ్ను టీడీపీ దగ్గరికి తీసుకోవడం వల్ల కాపులు, బలిజల్లో మెజార్టీ కూటమి వైపు మొగ్గింది.
అలాగే బీజేపీతో జత కట్టడం వల్ల మతపరమైన భావాలున్న కొద్ది మంది కూటమి వైపే మొగ్గు చూపారు.
ఇప్పుడు ప్రజలిచ్చిన అధికారాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్పై వుంది. అదేంటో గానీ, వైఎస్ జగన్పైనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కువ దృష్టి సారించారు. మళ్లీ ప్రజల్లో జగన్కు జనాదరణ ఉందని భయపడుతున్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను సీఎం సీట్లో కూచోనివ్వకుండా చేయాలనే పట్టుదలతో బాబు, పవన్ రాజకీయాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వారికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి రాజకీయ అస్త్రమయ్యారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో అంతుచిక్కని పరిస్థితి. రానున్న రోజుల్లో తిరుమల శ్రీవారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నట్టు పాలకుల తీరు హిందువుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇదేమంటే, స్వామి వారి ప్రతిష్టను కాపాడే పేరుతో, రకరకాల ముసుగుల్ని వేస్తున్నారు. బ్రహ్మాస్త్రం విఫలం కావడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అస్త్రం పోతే, ఇంకో అస్త్రం అన్నట్టు కొత్తకొత్త ఆరోపణలతో ముందుకు రావడాన్ని గమనించొచ్చు.