👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
642 views
#సత్సంగం_అంటే_ఏమిటి* సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్ నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం. సత్సంగత్వంలో ఒక క్షణం గడపడం వలన జన్మజన్మల సంస్కారం కలుగుతుందట. అందుకు ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షికి ‘సత్సంగం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఫలితాలేమిటి?’ అనే సందేహం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆయనను అడిగాడు. అప్పుడు శ్రీహరి, ‘ఓస్! ఇంత మాత్రానికే నా దగ్గరకు రావాలా? అదిగో అక్కడ ఒక పురుగు పాకుతోంది. దాన్ని అడుగు’ అన్నాడు. అలాగే వెళ్లి ఆ పురుగుని ‘సత్సంగమంటే ఏమిటి?’ అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు ‘సత్సంగమంటే…’ అంటూ ప్రాణం వదిలేసింది. నారదుడు ఇలా జరిగిందేమిటా అనుకుంటూ మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు. ఈసారి ‘అదిగో అక్కడ చెంగనాలు పెడుతున్న కోడెదూడను అడుగు’ అనగానే నారదుడు కోడెదూడను అదే ప్రశ్న అడగడంతోటే అది కూడా ప్రాణం వదిలింది. నారదుడు మళ్లీ విష్ణువు దగ్గరకు వెళితే, ‘ఒక లేడి పిల్లను కంటోంది. పుట్టే ఆ పిల్లను అడుగు చెబుతుంది’ అనడంతో నారదుడు అప్పుడే పుట్టిన లేడిపిల్లను అడిగాడు. నారదుడికి అదే అనుభవం ఎదురయింది. నారదుడు బాధపడుతూ గట్టిపట్టుదలతో మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. విష్ణువు చిద్విలాసంగా ‘నారదా! కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు. అతడిని అడిగి నీ సందేహం తీర్చుకో’అన్నాడు. అప్పుడు నారదుడు ‘‘స్వామీ! మీరు నా సందేహం తీర్చుకొనేందుకు వెళ్లమంటున్నారా? లేక బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో అక్కడకు పొమ్మంటున్నారా?’’ అని అడిగాడు. అందుకు శ్రీమహావిష్ణువు ‘అటువంటిదేమీ జరగదు. ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది. నీ రాకతో వారెంతో సంతోషిస్తారు’అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్లాడు. కొడుకు పుట్లిన ఆనందంలో అక్కడ వారందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషంతో స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేశారు. నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ‘‘నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు ఆ బిడ్డ, ‘స్వామీ! మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, తర్వాత కోడెదూడగా ఉన్నప్పుడు వేశారు. ఆ తర్వాత జింకపిల్లగా ఉన్నప్పుడు వేశారు. ఆ మాట వినటం చేత ఆ జన్మలన్నీ రహితమయ్యి ఈ జన్మ సంప్రాప్తించింది. అనగా కేవలం ‘సత్సంగం’ అనే ఒక్కమాట వినడంతోటే నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్రజన్మలు లభించాయి కదా! మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా! నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని’’ అన్నాడు ఆ బాలుడు. ఇదీ సత్సంగం మహిమ.ఆదిత్యయోగీ. సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్ నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః అన్నారు జగద్గురు ఆదిశంకరులవారు. సంగము అంటే అన్నిటి మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటం. నిస్సంగం అంటే దేనియందు ఏ విధమైన అనురక్త్తి లేకపోవడం. సంగం సంకెళ్లవలె మానవుని బంధిస్తుంది. విషయ వాసనలు తగులుకుంటున్నకొద్దీ మానవుడు పతనమైపోతాడు. వీటన్నింటికీ విరుగుడు సత్సంగం. సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం. దీన్ని బట్టి మీరందరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందఱో మహాపురుషుల సత్సంగం వలన మనకి మానవజన్మ ప్రాప్తించింది. దీనిని సార్ధకం చేసుకోవాలి తప్ప పాడు చేసుకోవద్దు అని ఈ కాల్పనిక కధా సారాంశం. మన పురాణాలు యధాతధములు కావు. కాని వాటియందు దాగియున్న నీతిని గ్రహిస్తే మాత్రం అందులో వున్న యదార్ధం అర్థమవుతుంది. అందుకే తత్వ చింతన అవసరం....* జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 🙏 #తెలుసుకుందాం #😃మంచి మాటలు