#⌚రేపటి నుంచి మృత్యు పంచకం ఆరంభం: అత్యంత అశుభ దినాలు!
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణించే మృత్యు పంచకం గడువు సమీపించింది. ఇంకో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 6న సాయంత్రం 7:03 నిమిషాలకు ప్రారంభమై 11 ఉదయం 8:16 నిమిషాలకు ముగుస్తుంది. ఈ అయిదు రోజుల కాలాన్ని అత్యంత సున్నితమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని వస్తువులను కూడా కొనడం కూడా వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు కుంభ, మీన రాశులలోని అయిదు ప్రత్యేక నక్షత్రాలయిన ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి మీదుగా సంచరించే అయిదు రోజుల కాలాన్ని 'పంచకం' అంటారు. వాటిలో మృత్యు పంచకం అత్యంత తీవ్రమైనది. ఈ సమయంలో ప్రమాదాలు, వివాదాలు, అనూహ్య సంఘటనలు సంభవించే అవకాశం ఉందని నమ్ముతారు. ఈ సమయంలో చేసే కొన్ని పనుల వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తారు.
శాస్త్రాల ప్రకారం మృత్యు పంచకం సమయంలో ఎవరైనా మరణిస్తే, అంత్యక్రియలకు ముందు దర్భ గడ్డి లేదా పిండితో ఐదు ప్రతీకాత్మక బొమ్మలను తయారుచేస్తారు. ఈ బొమ్మలను మృతదేహంతో పాటు ధార్మిక పద్ధతిలో దహనం చేస్తారు. దీనివల్ల దోషాలు తొలగిపోతాయని, కుటుంబానికి రాబోయే అరిష్టాలు నివారించినట్టవుతుందనేది విశ్వాసం.
మృత్యు పంచకంలో కొన్ని పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. వాహనాలు నడుపుతున్నప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. రిస్క్ తో కూడుకున్న, ప్రమాదకరమైన పనులను వాయిదా వేయడం మంచిదని పెద్దలు చెబుతారు.