బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
551 views
4 days ago
ఫ్యాక్షనిజం,నక్సలిజం ఏదైనా హింసను ప్రేరేపించే అనాగరిక దోరణులే! లేదా ఈ రెండు మానవజాతికి పట్టిన శనిగ్రహలు - మానవజాతి మనుగడను సైతం అశాంతిమయం చేసేవే! సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెంది మానవజాతి మనుగడ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునాతన టెక్నాలజీ యుగంలో సైతం ఫ్యాక్షనిజం,నక్సలిజం అనే రెండు విష బీజాలు మానవజాతి ఉనికిని కొంతమేర ప్రశ్నార్థకం చేస్తుండటం అత్యంత దురదృష్టకరం.గత అనేక సంవత్సరాలుగా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫ్యాక్షనిజం, నక్సలిజంను ఎందుకనో పూర్తి స్థాయిలో అణిచివేయలేకపోతున్నారు.ముఖ్యంగా ఈ రెండు సమాజంలో తిష్ట వేసుకొని ఉండటానికి,వ్రేళ్లానుకోని పోవడానికి ప్రధాన కారణాలు అధిపత్య,పెత్తందారీ ధోరణి,ద్వేషం,పేదరికం,మానవత్వం లోపించడం, డబ్బుపై విపరీత వ్యామోహం,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇతరులపై పై చేయి సాధించేందుకు ఎత్తుగడలు,కుట్రలు,కుతంత్రాలు ఇలా అనేక మూలకారణాలు వెరసి ఈ రెండు పెడ ధోరణులు ఈసమాజంలో ఓక ఊడలమర్రిలా విస్తరించడానికి కారణభూతమయ్యాయి.అంతేగాకుండా ఈ రెండు అనాగరిక ధోరణిలను,పంథాను మానవాళి తమ జీవితంలో ఓక భాగం చేసుకోవడం మూలాన పలు హింసాత్మక ఘటనలు ఈ సమాజంలో తరచుగా చోటు చేసుకుంటూ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా వందలాది మంది వీటి రక్కసికి బలై తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు,అనేక మంది విగతజీవులుగా, అంగవైకల్యం బారినపడి తమ జీవితాలను కడు దుర్భరం చేసుకుంటున్నారు.ఈ వాస్తవ ఘటనలు నిత్యం మన కళ్ళ ముందు కదలాడుతున్న మన ప్రజానీకంలో మార్పు కానరావడం లేదు.ఏదో ఓక సందర్భంలో ఈ రెండు వక్ర మార్గాలలో ఏదో ఓక దానిలో మన ప్రజానీకం అవివేకంతో తల దూర్చి తమ ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు,తమ అమూల్యమైన జీవితాలను అధోగతిపాలు చేసుకుంటున్నారు.అంతేగాకుండా ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ప్రజలంతా ఎంతో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే అధికారం వారికి వుంది.అయితే కొంతమంది మానవత్వం లోపించిన కొందరు రాజకీయనాయకుల దౌర్జన్య వ్యవహారశైలి మూలాన ఆ స్వేచ్ఛ కూడా ప్రజలు కోల్పోతూ కొన్ని ప్రాంతాలలో పోలింగ్ బూత్ లకు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురిఅయ్యి అప్పనంగా తమ ఓట్లను వాళ్లకు అప్పజెప్పుతున్నారు అనే మాట అక్షర సత్యం.ఎలక్షన్ కమీషనర్ వారు ఇలా జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొంతమంది రాజకీయ గూండాల ఆగడాల మూలాన రిగ్గింగ్ అనే పైశాచిక ప్రవృత్తి ఈ సమాజంలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కొనసాగుతుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఓక సిగ్గుచేటైన విషయం.ఓక వేళ వారిని దిక్కరించి వెళ్లే సాహసం ప్రజలు గాని,ప్రభుత్వ అధికారులు కాని చేయలేకపోతున్నారు.మరో వైపు నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా వున్న ప్రాంతాలలో ప్రజలకు మేము మంచి చేస్తాం,వారిని ఉద్దరిస్తాము అని చెప్పుకునే మావోయిస్టు అన్నలు సైతం కొన్ని ప్రాంతాలను తమ గుప్పిట్లో ఉంచుకొని అయా ప్రాంత ప్రజలను శాసిస్తూ స్వేచ్ఛగా జీవించాల్సిన ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఇటు పోలీసులు,అటు నక్సల్స్ మధ్య నిత్యం జరిగే పోరులను భరించలేక అయా ప్రాంతాలలోని తమకు జన్మ నిచ్చిన ఊరును సైతం వదిలిపెట్టి బ్రతుకు జీవుడా అంటూ వీరిరువురి దాటికి తట్టుకోలేక ఎక్కడో సుదూర ప్రాంతాలకు తరలివెళుతున్నారు.మరికొంత మంది ప్రజలు చేసేదేమిలేక తమ స్వంత ప్రాంతాన్ని వదలిపెట్టడం ఇష్టం లేక అక్కడే వుంటూ నిత్యం తుపాకుల మ్రోతలా మధ్య భయం గుప్పిట్లో కాలం గడపడం ఓక అలవాటుగా చేసుకున్నారు. ఏదిఏమైనా దేశ వ్యాప్తంగా చట్టాలు ఎంతో బలపడినప్పటికి,న్యాయస్థానాలు ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అన్ని హక్కులు కల్పించేలా అనేక స్ఫూర్తిదాయకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికి ఫ్యాక్షనిజం,నక్సలిజం పేర జరిగే అనేక ఆనారోగ్య, దౌర్జన్య కార్యకలాపాల నుంచి ప్రజలను పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వాలు గాని,ఇటు న్యాయవ్యవస్థ వారు గాని విముక్తులు గావించలేకపోతున్నారు అనేది ఎవరు కాదనలేని ఓ చేదు నిజం.ఏమైనా మానవజాతి మనుగడను కొంతమేర ప్రశ్నార్థకం చేస్తున్న, అశాంతిపాలు చేస్తున్న ఈ ఫ్యాక్షనిజం,నక్సలిజం అనే ఈ రెండూ వికృత దోరణులు మానవజాతికి పట్టిన రెండు పెనుభూతాలు,శాపాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాబట్టి ప్రభుత్వాలు,పోలీసు,న్యాయశాఖ వారు గట్టి చర్యలు తీసుకోని ఈ రెండూ పైశాచిక కార్యకలాపాలను క్రుక్కటి వ్రేళ్ళతో సహా పేకలించి ప్రజలంతా వారి మానాన వారు సుఖ,సంతోషాలతో జీవించే వాతావరణం కల్పించాలి. ఏమైనా మానవత్వం వికసించాలి,పశుత్వం,దౌర్జన్యం, దోపిడి వాతావరణం నశించాలి. జయ జయహో భారత్!మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #రాయలసీమ ఫ్యాక్షన్