బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
708 views
3 days ago
ఎండాకాలంలో అకాల వర్షాలు రైతన్నల కంట్లో కునుకు లేకుండా చేస్తున్నాయి! లేదా పంట పండి చేతికొచ్చే సమయం లో రైతన్నల ఉసురు తీస్తున్న అకాల వర్షాలు! గత 5 సంవత్సరాలుగా వాతావరణం అదుపు తప్పి ఎండాకాలంలో సైతం అకాల వర్షాలు కురుస్తూ,మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రైతన్నల కష్టానికి తూట్లు పొడుస్తూ చేతికొచ్చిన పంటను ఈ అకాల వర్షాలు చాలా తీవ్ర స్థాయిలో నష్టాలు చేకూరుస్తున్నాయి అనే మాట సత్య దూరం కాదు.దీంతో ఎండాకాలంలో మొక్కజొన్న,కొర్ర,వరి పంటలు వేసిన రైతుల పరిస్థితి దిన దిన గండంగా మారుతున్నది.ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏరూపంలో దాపురిస్తాయో తెలియని ఈ అకాల వర్షాల మూలాన రైతన్నల కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. ఒక్కొక్కసారి కొంతమంది రైతన్నల తలరాత బాగుండి నాలుగు ఐదు రోజులు వర్షాలు కురువకపోతే తాము పండించిన పంటలను త్వరగా అరబెట్టి మిషన్ లలో వేసి దాన్యాన్ని వ్యాపారస్తులకు అమ్మడమో లేదా ఇంటికి చేర్చుకోవడమే జరిగి సురక్షితంగా బయట పడుతూ వుంటారు.అలా కాకుండా వారం లేదా పది రోజులు లేటుగా పంటలు వేసుకున్న రైతులకు దురదృష్టం వెంటాడి తాము పండించిన దాన్యాలను అరబెట్టుకునే సమయంలో అకాల భారీ వర్షాలు కురిస్తే ఎంతగా పట్టాలు కప్పి ధాన్యాలను కాపాడుకోవాలని చూసిన దిగువ భాగంలో వర్షపు నీళ్లు పోవడం మూలాన రైతన్నల ధాన్యం ఎంతో కొంత తడిసి ముద్దవడం,నష్టపోవడం తథ్యం.ఆ విధంగా ఈ ప్రతికూల వాతావరణం మూలాన రైతన్నలకు వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ఈ ఎండాకాలంలో ఓక జూదం లా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది చాలదన్నట్లుగా రోజు వారి వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి 200 రూపాయల నుండి 250,300 రూపాయలు చెల్లించాల్సి రావడం,ఎరువులు మరియు విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటడం,తాము కౌలుకు తీసుకున్న భూముల గుత్తల ధరలు ఏడాపేడా పెరిగి ఎకరా భూమి గుత్త ధర దాదాపు 10,000 రూపాయల నుండి 12,000 దాకా పలుకుతుండటం రైతుల పాలిట ఓక శాపంగా,ఓక గుదిబండగా మారింది అనే మాట అక్షర సత్యం.ఇలా వ్యవసాయరంగంలో ఇన్ని ఇబ్బందులు,సాధక బాధకాలు వున్నాయి అని తెలిసి కూడా రైతన్నలకు చేసేందుకు వేరే పని తెలియక, తాము ఎంచుకున్న వృత్తిలోనే చావో,రేవో తేల్చుకోవాలనే దిశగా ముందడుగు వేస్తున్నారు.దీంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనే భావన వున్న రైతులు ఈ వ్యవసాయం అనే జూదంలో కాలు పెట్టి కొన్ని కొన్ని సందర్భాలలో తమ తలరాత బాగాలేక,తమ అదృష్టం తిరగబడి,కాలం అనుకూలించక తీవ్రంగా నష్టాలు చవిచూసి మరీ పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం మెండుగా వున్న రైతులు ఆత్మహత్యే శరణ్యం భావించి వున్న ఫలంగా తమ విలువైన ప్రాణాలు తీసుకోని తమ కుటుంబాలను దిక్కులేని వారిగా చేస్తున్నారు అనే మాట ఎవరు కూడా కాదనలేని అక్షర సత్యం. ఏదిఏమైనా యావత్తు దేశ ప్రజానీకానికే పట్టెడు అన్నం పెట్టే వారుగా,అశేష జనవాహిని చేత నీరాజనాలు,కితాబు అందుకునే రైతన్నల పరిస్థితి ఈ ఎండా కాలంలో అకాల వర్షాల దాటికి ఆగమ్యగొచరంగా తయారు అవుతుండటం అత్యంత బాధాకరమైన పరిణామం.ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సామాన్య,నిరుపేద రైతులకు రైతు భరోసా వంటి పథకాలతో పాటు పండించిన పంటలకు సకాలంలో అన్ని దాన్యాలకు గిట్టుబాటు ధరలు ఉండేలా చేయడం,వారు పండించిన పంట ఏదేని విపత్తు వల్ల నష్టపోతే వారికి తగిన భీమా సౌకర్యం ఆరు నూరైనా కల్పించడం,ఆకాశాన్ని అంటుతున్న ఎరువులు,విత్తనాల ధరలకు కళ్లెం వేసి వాటిని నామమాత్రపు ధరలకు రాష్ట్ర వ్యాప్తంగా వున్న లక్షలాది మంది లభ్యం అయ్యేలా ఈ రాష్ట్రప్రభుత్వం చేయగలిగితే ఈ రైతన్నల ఆత్మహత్యల పరంపరకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయవచ్చు.పైగా వారి వ్యవసాయ వృత్తిలో వారికి ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు,దీన,దయనీయ పరిస్థితులు ఎదురవ్వకుండా వారంతా ఉన్నంతలో హుందాగా బ్రతికేందుకు మన రాష్ట్రప్రభుత్వం వారు ఓక స్ఫూర్తిదాయకమైన అవకాశాన్ని యావత్తు రైతు సోదరులకు కల్పించిన వారవుతారు.ఈ విధమైన ఆదర్శవంతమైన రీతిలో రైతు సోదరుల బాగోగుల గురించి మన రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించాలని మనసా,వాచ,కర్మణా కోరుకుందాం.అన్నదాత సుఖీభవ,జై కిసాన్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #రైతు