** హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 13**
ఈ చౌపాయి హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన ఘట్టాన్ని, ఆ సందర్భంలో శ్రీరాముడు పొందిన ఆనందాన్ని అద్భుతంగా వివరిస్తుంది.
-----
**11వ చౌపాయి**
**లాయ సంజీవన లఖన జియాయే |**
**శ్రీ రఘుబీర హరషి ఉర లాయే ||**
**ప్రతిపదార్థం:**
* **లాయ సంజీవన:** సంజీవని మూలికను తెచ్చి
* **లఖన జియాయే:** లక్ష్మణుడిని బతికించినవాడా\!
* **శ్రీ రఘుబీర:** శ్రీరామచంద్రుడు
* **హరషి:** అమితమైన సంతోషముతో
* **ఉర లాయే:** (నిన్ను) తన గుండెలకు హత్తుకున్నాడు.
-----
**విస్తృత వివరణ:**
**1. లాయ సంజీవన లఖన జియాయే:**
ఇక్కడ ప్రాణదాత అయిన హనుమ రూపాన్ని మనకు ఇస్తున్నాడు.
హనుమంతుడు సంజీవని పర్వతం రెండు మార్లు తెచ్చాడు. చాలా మంది ఒక్కమారే అనుకుంటారు.
ఆ సంజీవన పర్వతాన్ని తీసుకుని రావడం ఒక రమ్యమైన ఘట్టం.
మొదటిసారి ఇంద్రజిత్ వేసిన మహాస్త్రాలకు వానరవీరులు, రామలక్ష్మణులు అందరూ నిశ్చేష్ఠులై పడిపోతారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల విభీషణుడు నిలబడగలిగాడు. రెండవవాడు హనుమంతుడు. ఆయనను ఏ అస్త్రము ఏమీ చెయ్యలేదు. కనుక వాళ్ళిద్దరే మిగిలారు. ఈ పడిపోయిన వాళ్ళంతా ఎలా ఉన్నారో చూద్దామని ఒక దివిటీని చేతితో పట్టుకుని హనుమంతుడు, విభీషణుడు వస్తున్నారు.
ఒక చోట మూలుగు వినబడుతోంది చూస్తే జాంబవంతుడు. ఆయనను కూడా అస్త్రములేమీ చెయ్యలేవు. పెద్ద వయస్సు కావడం వల్ల ఆ అస్త్రధాటికి పడి మూలుగుతూ ఉన్నాడు కానీ జీవించే ఉన్నాడు. మిగిలినవారు జీవించిలేరా! అనడానికి వీలు లేదు కానీ, చేష్టలుడిగి పడి ఉన్నారు.
అప్పుడు విభీషణుడు ఎలా ఉన్నావని అడగగానే 'నాయనా! హనుమంతుడు క్షేమమేనా' అని అడుగుతాడు.
రాముడు ఉన్నాడా లేదా లక్ష్మణుడు ఉన్నాడా అని అడగాలి లేదా వానరరాజు సుగ్రీవుడున్నాడా అని అడగాలి. వీళ్ళెవరినీ అడగకుండా హనుమంతుడు ఉన్నాడా అని ఎందుకు అడిగావు?' అంటాడు విభీషణుడు.
'హనుమంతుడు ఉంటే అందరూ ఉన్నటే. ఆయన లేకపోతే ఎవరు ఉన్నా లేనట్టే అన్నాడు. అదీ మాట!
హనుమంతుడు ఉంటే మనకు జీవితాశ ఉంది, హనుమంతుని భక్తునికి ఎప్పుడూ కూడా జీవితాశ దెబ్బ తినదు.
ఆ మాట విన్న వెంటనే జాంబవంతునీ పాదాలకు నమస్కరం చేసి తాత నేను క్షేమం అన్నాడు హనుమ.
నువ్వు వెళ్ళి హిమవత్పర్వత ప్రాంతంలో కైలాసానికి సమీపంలో దివ్యమైన పర్వతం ఉన్నది. దానిని నిరంతరం గుప్తులైన దేవతలు రక్షిస్తూ ఉంటారు. దానిపై సంజీవ కరణి, విశల్య కరణి, సంధాన కరణి ఇత్యాదులు దివ్యౌషధులు ఉన్నాయి. అవి తీసుకుని రా!' అని చెప్పాడు.
విశల్యకరణి విరిగిన ఎముకలను అతికిస్తే, సంధానకరణి విరిగిన అవయవాలను అతికిస్తుంది. సంజీవకరణి తిరిగి బ్రతికిస్తుంది. సౌందర్యకరణి వచ్చిన మచ్చలు తొలగిస్తుంది.
జాంబవంతుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళి ఆ ఓషధులు వెతుకుతున్నాడు. హనుమంతుడు. కానీ అవి ప్రచ్ఛన్నంగా ఉండడంతో ఆ వెతుక్కోవడమేదో జాంబవంతుడే చూసుకుంటాడని, ఆ పర్వతాన్ని జాగ్రత్తగా కదిపి, కుదిపి తీసుకుని స్వామివారు గగనమండలం నుండి వస్తూ ఉంటే దేవతలందరూ నమస్కరిస్తున్నారు.
సంజీవ పర్వతం పట్టుకు వస్తున్న ఆంజనేయస్వామివారిని ఎవరు ధ్యానిస్తారో, వారికి ఆరోగ్యం కలుగుతుంది. హనుమంతుని సంజీవరాయ స్వరూపం ఇది
అలా సంజీవని పర్వతం తెచ్చాడు మొత్తం అందరూ జీవించారు.ఆ తర్వాత మళ్ళీ హనుమ వెళ్ళి దాన్ని యదా స్థానంలో పెట్టీ వచ్చాడు.
ఇది ఒక ఘట్టం మరొక సారి కూడా హనుమ సంజీవని తెచ్చాడు.
రావణునితో యుద్ధం జరుగుతున్నప్పుడు అతడు వేసిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛితుడవుతాడు. అప్పుడు మళ్ళీ సుషేణుడు (వానరుల తరపున వచ్చిన వైద్యుడు, వానరులలో ఒకడు) లక్ష్మణస్వామిని పరీక్షించి సంజీవనీ పర్వతం తీసుకురావాలంటే, మళ్ళీ బయలుదేరి స్వామే తీసుకువచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించాడు.
ప్రాణదాత, జీవితాశా ప్రదాత, ఆనందదాత, శోకనాశకుడు, భయత్రాత హనుమ.
జియాయే అంటే బ్రతికించాడు. ఇంచుమించు లక్ష్మణుడు మృతి చెందాడనే అంతా భావించారు. తిరిగి హనుమత్ స్వామి తీసుకుని వచ్చిన సంజీవ పర్వతం వల్లనే జీవించాడు.
**అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే శక్తికి**, తన యజమాని పట్ల ఉన్న **విధేయతకు** నిదర్శనం. మన జీవితంలో కూడా అపజయాలు ఎదురైనప్పుడు, ఆశ కోల్పోకుండా సంజీవని లాంటి ధైర్యాన్ని హనుమంతుడు మనకు ప్రసాదిస్తాడు.
**2. రఘుబీర హరషి ఉర లాయే (ప్రేమకు బానిస):**
లక్ష్మణుడు బతకగానే రాముడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే హనుమంతుడిని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇది కూడా రెండు సార్లు జరిగింది ఎప్పుడూ.
రెండుమార్లు నా ప్రాణం నిలబెట్టావయ్యా! ఒకటి సీతమ్మ ఎక్కడుందో తెలియని పరిస్థితులలో ఆమె జాడచెప్పి నిలబెట్టావు. ఇప్పుడు లక్ష్మణస్వామిని బ్రతికించి నా ప్రాణం నిలబెట్టావు. ఇప్పుడు నువ్వు బ్రతికించింది లక్ష్మణుని కాదు, నన్ను ఎవరి ఋణమైనా తీర్చుకోగలనేమో కానీ నీ ఋణం నేను తీర్చుకోలేనయ్యా!" అంటాడు రామచంద్రమూర్తి
ఆనందంతో రెండు చేతులూ ముకుళించి "నన్ను నేను ఇచ్చుకుంటున్నాను. నా సర్వస్వం నీకు ఇస్తున్నా”నని గాఢంగా ఆలింగనం చేసుకుని రాముడు తనని తాను హనుమత్ స్వామికి ఇచ్చుకున్నాడు. ఆ గాఢాలింగనం చేసుకున్నప్పుడు చుట్టూ ఉన్న వానరులు, పైనుంచి చూస్తున్న దేవతలకు ఆనందాశ్రువులు రాలాయి. వారంతా ఆ ఘట్టాన్ని చూసి ఎంతో ఆనంద పడ్డారు.
ఆ గాఢాలింగనంలో సగం హనుమంతుడు, సగం రాముడు కనిపిస్తున్నారు హరిహరాద్వైతమూర్తి'లా హనుమద్రామమూర్తి అందరికీ దర్శనమిచ్చింది.ఈ మూర్తిని ధ్యానించడం కూడా ఒక గొప్ప విషయం.
భగవంతుడిని మెప్పించడం కష్టం అనుకుంటాం, కానీ నిష్కల్మషమైన సేవ చేస్తే ఆ పరమాత్మ స్వయంగా వచ్చి మనల్ని హత్తుకుంటాడని ఈ చౌపాయి చెబుతోంది.
-----
**తులసీదాసు గారి సందేశం:**
సమయానికి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు, నిజమైన భక్తుడు. హనుమంతుడు సమయస్ఫూర్తితో సంజీవనిని తెచ్చి ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా, రాముడికి ఉన్న పెద్ద చింతను తొలగించాడు. మనం కూడా ఇతరులకు ఆపదలో 'సంజీవని' లాగా సహాయపడాలని తులసీదాసు గారి సందేశం.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!**
#✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊