#🎂 HBD ఘంటసాల గారి జయంతి 💐
మహాగాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి నేడు…
వారికి నివాళులర్పిస్తూ... 🙏
జననం : 1922, డిసెంబర్ 4
గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు.
సంగీత గురువు : శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి
బిరుదు : పద్మశ్రీ ( 1970)
భార్య : సావిత్రి
సంతానం నలుగురు కుమారులు
(విజయ కుమార్,రత్న కుమార్,శంకర్ కుమార్,రవికుమార్)
ముగ్గురు కుమార్తెలు
(శ్యామల,సుగుణ,మీరా, శాంతి)
ఘంటసాల తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. తన 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. తన చివరి కోరిక తనయుడు మంచి సంగీత విద్వాంసుడు కావాలని.
ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం చేయవలసి వచ్చింది. ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.
విజయనగరం చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటివిద్యార్థులు చేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు.
శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయాడు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నాన్ని ఒకగుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.
వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.
ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల రాఘవాచార్యులు కలిస్తే ఆయన ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామని హామీ ఇచ్చారు .
సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంను పానగల్ పార్కు వాచ్మన్కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమ లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.
1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
***
మురళీకృష్ణ చిత్రం 1964
మాస్టర్ వేణు
సి నారాయణ రెడ్డి
ఘంటసాల
పల్లవి:
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
చరణం 1:
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం 2:
పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను.....
గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం 3:
నీ కలలే కమ్మగ పండనీ... నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..