#🔥🔥వై యస్ జగన్ మోహన్ రెడ్డి🔥🔥 #ఒకే ఒక్కడు
*జగన్.. ఒకే ఒక్కడు❗*
01.98.2026🎯
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు, ఆయన మీడియాకు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొరకరాని కొయ్యగా మారారు. ఉమ్మడి, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో బాబు, ఆయన మీడియా ఎత్తుగడల్ని చిత్తు చేసి, చేస్తూ నిలబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రతి ఒక్కరిలో లోపాలున్నట్టు, వైఎస్ జగన్ కూడా అలాంటి వాటికి మినహాయింపు కాదు.
అయితే జగన్ను నాయకుడిగా నిలబెట్టింది మాత్రం ఆయనలోని ఆత్మ నిబ్బరం. మహా భారతంలో కర్ణుడు కవచ కుండలాలతో జన్మించినట్టు, వైఎస్ జగన్ కూడా పుట్టుకతోనే జగమొండితనం అనే కవచాన్ని ధరించారు. ఇదే ఆయనకు శ్రీరామ రక్ష.
చంద్రబాబు, అలాగే ఆయన్ను ఆరాధించే, వైఎస్ జగన్ కుటుంబాన్ని తీవ్రంగా ద్వేషించే మీడియాను ఎదుర్కోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు.
వైఎస్ జగన్కు తప్ప, మరొకరికి వాళ్ల కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోవడం సాధ్యం కానేకాదు. దీనంతటికి జగన్ మానసిక ధైర్యమే కారణం.
చంద్రబాబు, ఆయన మీడియా దశాబ్దాలుగా వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్తో ఏ రకంగా మైండ్గేమ్ ఆడుతున్నదో తెలుగు సమాజ రాజకీయాల్ని జాగ్రత్తగా గమనించే వారందరికీ తెలుసు.
వైఎస్సార్ ఆకస్మిక మరణానంతరం, వైఎస్ జగన్పై చంద్రబాబు, ఆయన మీడియా మానసిక దాడి మరింత తీవ్రతరం చేసింది. ఎందుకంటే, రాజకీయంగా జగన్ అనే నాయకుడు మాత్రమే తమకు అడ్డంకి అని చంద్రబాబు అండ్ కో పసిగట్టింది. దీంతో మొగ్గ దశలోనే జగన్ను తుంచేయాలని కుట్రలకు తెరలేపారు.
వైఎస్ జగన్ను 16 నెలల పాటు జైలుపాలు చేయడంలో కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపిందనే విమర్శలున్నాయి. జైలు జీవితం జగన్ను భయపెట్టి, రాజకీయాలకు దూరం చేయలేకపోయింది. అంతేకాదు, జగన్ను నాయకుడిగా మరింత రాటుదేల్చింది. వైఎస్ జగన్ను లక్ష కోట్లు దోచుకున్న అవినీతిపరుడిగా, ఫ్యాక్షనిస్టుగా కొన్ని సంవత్సరాల పాటు పదేపదే అంటూ, అదే అభిప్రాయాన్ని ప్రజల్లో బలమైన వ్యతిరేక ముద్ర వేసేందుకు చంద్రబాబు తన అనుకూల మీడియాని అడ్డం పెట్టుకుని ప్రయత్నించారు.
చంద్రబాబు , ఆయన మీడియా ఎంతగా కవ్వించినా, రెచ్చగొట్టినా ….జగన్ మాత్రం అదరలేదు, బెదరలేదు. తనపై మానసికంగా సాగుతున్న దాడిని ఎదుర్కొంటూనే, ప్రజలకు చేరువయ్చేందుకు నిత్యం ప్రయత్నించారు. రాజకీయ యుద్ధంలో అనేక సందర్భాల్లో జగన్ది ఒంటరి పోరే. కొన్ని సందర్భాల్లో రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి, జగన్ను నామరూపాల్లేకుండా చేసేందుకు శత్రువులంతా చుట్టుముట్టారు. అలాంటి సమయాల్లో జగన్ ఏమవుతారో అనే భయం ఆయన అభిమానులకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది.
అయినప్పటికీ జగన్ అనేక అడ్డంకుల్ని ఎదురొడ్డి, ధైర్యంగా, దృఢంగా నిటారుగా నిలబడ్డారు. 2014లో గెలుపు జగన్ నోటి వరకూ వచ్చి, చేజారింది. టీడీపీ, బీజేపీ జత కట్టడం, వారికి పవన్కల్యాణ్ మద్దతు తోడవడంతో విజయం సాధించారు. వైఎస్ జగన్ 67 ఎమ్మెల్యే, 8 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో గెలుపునకు జగన్ దూరం అయ్యారు.
ప్రతిపక్ష నాయకుడిగా అతి చిన్న వయసులో అడుగుపెట్టిన వైఎస్ జగన్ను, ఓ ఆట ఆడుకోవచ్చని చంద్రబాబు, యనమల రాయకృష్ణుడు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు అనుకున్నారు. స్పీకర్ స్థానంలో కరడు గట్టిన టీడీపీ నేత కోడెల శివప్రసాద్. ఇక అసెంబ్లీలో జగన్ మాట్లాడేందుకు ఏ మాత్రం అవకాశం ఇచ్చి వుంటారో, ఎవరైనా ఊహించుకోవచ్చు.
విధానాల పరంగా జగన్ను ఎదుర్కోలేక, అసెంబ్లీలో సైతం ఆయనపై అనకూడని మాటలన్నారు. జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయినప్పటికీ జగన్ పోరాటాన్ని ఆపలేదు. 2019 ఎన్నికలకు ముందు, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్కు విపరీతమైన ప్రజాదరణ.
2019లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను ఏపీ ప్రజానీకం కట్టబెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ అనేక సంస్కరణల్ని తీసుకొచ్చారు. అలాగే ఆయన పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూదందాలకు పాల్పడ్డారు. చేసిన మంచి గురించి వైఎస్ జగన్ ప్రచారం చేసుకోలేకపోయారు.
రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయం అనవసర తలనొప్పికి కారణమైంది.
మరోవైపు టీడీపీ, ఆ పార్టీ మీడియా తమ పాలనపై సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో వైసీపీ విఫలమైంది. 2024 ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల భూముల్ని లాక్కోడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్న టీడీపీ ప్రచారం తీవ్ర ప్రభావం చూపింది. కారణాలేవైనా, గత ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కేవలం 11 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది.
దీంతో రాజకీయంగా వైఎస్ జగన్, అలాగే ఆయన నేతృత్వం వహిస్తున్న వైసీపీ కథ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. ఇక కూటమి నాయకులు, కార్యకర్తల సంబరాలకు తక్కువేం లేదు. కానీ కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయ్యే సరికి, ఊహించని మార్పులు. ప్రభుత్వ వరుస తప్పిదాలు, వైసీపీకి రాజకీయంగా ప్రాణం పోస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల కంటే, రెట్టింపు స్థాయిలో కూటమి ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు చేస్తున్నారన్న భావన ప్రజల్లో బలపడుతోంది. బాబు పాలన కంటే జగన్ పాలనే నయం అనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది.
మరోవైపు క్షేత్రస్థాయిలో తమ ఎమ్మెల్యేలపై వ్యతిరేక నివేదికలు సీఎం చంద్రబాబును భయపెడుతున్నాయి. ఇలాగైతే మరోసారి అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం ఆయన్ను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్పై మానసిక దాడి మరింత తీవ్రమైంది. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నింపే ప్రయత్నం నిత్యం కొనసాగుతోంది.
ఇక జగన్ ఏం చేసినా తప్పే అన్నట్టుగా కూటమి నేతలు మాట్లాడ్డాన్ని గమనించొచ్చు. చంద్రబాబుకు, ఆయన మీడియాకు జగన్పై దుష్ప్రచారం చేయడానికి కుటుంబంలోని కొందరి వ్యవహారాలు అస్త్రాలయ్యాయి. మామను వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని లాక్కున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, తల్లి, చెల్లిని జగన్ పట్టించుకోలేదని, అలాంటి నాయకుడు మీకేం చేస్తారని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారంటే, ఆయన ఎంత గడసరో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు ఆలోచనలన్నీ జగన్ చుట్టూ తిరుగుతున్నాయి. తాజా కామెంట్స్ చూస్తే, ఎవరికైనా అర్థమవుతుంది. ప్రజలు ఛీ కొట్టినా జగన్ తీరు మాత్రం మారడం లేదని చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ లాంటి నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఏ మాత్రం ఇష్టం వుండదన్నారు. అందుకే నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇలాంటి మాటల్ని ఆయన మీడియా నిత్యం జనంలోకి తీసుకెళ్లి, వైసీపీ, అలాగే జగన్పై వ్యతిరేకత నింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతోంది. అయితే జనానికి ఇవన్నీ అలవాటు కావడంతో పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. అలాగని వైసీపీ దీటైన కౌంటర్లు ఇవ్వకపోవడం మంచిది కాదు.
వైఎస్ జగన్ తనపై నిత్యం చేస్తున్న దుష్ప్రచారానికి బెంబేలెత్తి, రాజకీయాల నుంచి నిష్క్రమించాలనేది చంద్రబాబు, ఆయన మీడియా వ్యూహం.
అబ్బే, ఇలాంటి వాటికి జంకేది లేదని జగన్ అడుగులు ముందుకే పడుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఆయన మరో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ను అభిమన్యుడు అవుతాడని చంద్రబాబు, ఆయన మీడియా అంచనా వేసింది. ఎందుకంటే చంద్రబాబు, ఆయన మీడియా అనేక మంది కాంగ్రెస్ నాయకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయగలిగారు.
చివరికి టీడీపీ వ్యవస్థాపకుడు, మహా నటుడైన ఎన్టీఆర్ను సైతం గద్దె దించిన ఆత్మ విశ్వాసం వారిది. అలాంటి వారికి జగన్ అసలు మింగుడు పడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా తమ దాడితో జగన్ మరింత బలపడుతున్నారనే భయం వారిని వెంటాడుతోంది.
జగన్ దూకుడు చూస్తే , అర్జునుడు అయ్యేలా వున్నాడనే భయం ఆయన ప్రత్యర్థుల్ని వెంటాడుతోంది.
ఇదే సందర్భంలో బలమైన లీగల్, మీడియా వ్యవస్థను జగన్ సమకూర్చుకోగలిగితే, తిరుగులేని నాయకుడు అవుతారనే అభిప్రాయం వుంది. లోపాలు ఎన్ని వున్నా, చంద్రబాబు, ఆయన మీడియా తీరు నచ్చని కోట్లాది మందికి , జగన్ ఒక ఆశాదీపం. అందుకే ఒకే ఒక్కడు జగన్ అని తెలుగు సమాజం అంటోంది.