శివరాత్రి వ్రతంనాడు ప్రధానంగా రెండింటిని చెప్తున్నారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఉపవాసం అంటే ‘ఆహార నివృత్తిః ఉపవాసః’ అని చక్కటి నిర్వచనం చెప్పారు. ఆహారాన్ని విడిచి పెట్టడమే ఉపవాసం. వారి వారి శారీరక స్థితి బట్టి ఆహారాన్ని నివృత్తి చేసుకోవాలి. అసలు తినకుండా ఉండలేనటువంటి వారు ప్రాణ రక్షణ కోసం అల్పమైన, సాత్త్వికమైన, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే పూర్ణోపవాసం చేయవచ్చు.
ఇక రెండవది జాగరణ. అంటే నిద్రలేకుండా ఉండుట అని. అలా నిద్రమాని పరమేశ్వరుని ఆరాధించాలి. ఎందుకంటే నిద్రలేని దేవుడు శివుడు. ప్రళయకాలంలో కూడా కళ్ళు తెరుచుకు చూసేవాడు ఆయనే. సర్వ జగత్తూ కూడా ప్రళయ కాలంలో నిద్రపోవచ్చు. కానీ శాశ్వతమైన పరమేశ్వరుడికి నిద్ర అనేది లేదుట. ఇది జ్ఞాన స్వరూపుడు అని చెప్పడం. అజ్ఞానం కానీ, మోహం కానీ లేనటువంటి దైవం కనుక నిత్య జాగరణశీలుడు పరమేశ్వరుడు. ఆయన వ్రతం జాగరణ వ్రతం. ఇలాంటి జాగరణ, ఉపవాస వ్రతంతో పరమేశ్వరుని ఆరాధించి ధన్యులం కావాలి.
(మహాదేవ శంభో - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు) #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🪔శివరాత్రి పూజ విధి & వ్రత విధానం🧾


