#🌙జాతీయం🌍అంతర్జాతీయం ☀
*శ్రీలంక సంచలన నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు❗*
FEBRUARY 18, 2026🎯
ఇండియాలో ఎమ్మెల్యేలుగాని, ఎంపీలుగాని ఎక్కువ శాతం మంది బాగా ధనవంతులై ఉంటారు. కొందరికి వందల కోట్ల సంపద ఉంటే, కొందరికి వేల కోట్ల సంపద ఉంటుంది. పైగా ఇతర పద్ధతుల్లో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయిప్పటికీ వారికి బొచ్చెడు జీతాలు ఉంటాయి. పైగా ఈ జీతాలను అప్పుడప్పుడు పెంచుకుంటారు కూడా.
పదవులు ముగిసిన తరువాత బొచ్చెడు పెన్షన్ వస్తుంది. మాజీ ఎంపీలకు పెన్షన్ తో పాటు రైళ్లలో ఉచిత ప్రయాణం, వైద్య సౌకర్యాలు వంటి సేవలు కూడా లభిస్తాయి. ఇంకా వేరే
సౌకర్యాలు కూడా ఉంటాయి. ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేయాలని సామాజిక కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.
చట్టసభలకు వెళ్లినవారికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు పదవిలో లేనప్పుడు ఈ పెన్షన్ గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. గౌరవప్రదంగా బతకడానికి కావల్సిన డబ్బు వారి దగ్గర ఉంటుంది. లేకపోయినా పదవిలో ఉండగా కావల్సినంత సంపాదించుకుంటారు. మరి గౌరవప్రదంగా జీవించలేరా?
మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే పొరుగున చిన్న దేశం శ్రీలంక ప్రభుత్వం అక్కడి ఎంపీలకు పెన్షన్లు రద్దుచేసి పారేసింది. ఈ బిల్లుకు చట్టసభలో తగినంత మద్దతు లభించడం విశేషం. సభలో 225 మంది సభ్యులు ఉండగా……… 154 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు సభ్యులు మాత్రమే దీన్ని వ్యతిరేకించారు.
మిగతా సభ్యులు ఓటు వేయలేదు. ప్రస్తుతం చూసుకుంటే శ్రీలంకలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఎంపీ లకు పెన్షన్ అందుతోంది. కొత్త చట్టం పార్లమెంటులో ఆమోదం పొందడంతో అందరికీ ఈ పెన్షన్లు నిలిచిపోతాయి. అంతేకాదు దిసనాయకే సర్కార్ అధికారంలోకి వచ్చాక మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను కూడా నిలిపివేసింది.
అనుర కుమార దిస నాయకే నేతృత్వంలోని ప్రభుత్వం ఆల్రెడీ రాజకీయ నాయకులకు ఇచ్చే ఇంటి అద్దె, అలవెన్సులు, రవాణా సౌకర్యాలనూ రద్దు చేసింది. దేశ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అనవసరపు ప్రోత్సాహకాలు, విలాసాలను తగ్గించి ప్రజా ధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకకు పర్యాటక రంగంతోనే ఎక్కువగా ఆదాయం వస్తుంది.
అయితే కరోనా, ఉగ్రదాడుల కారణంగా పర్యాటకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణ లోపం కూడా ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో 2022లో శీలంక ప్రభుత్వం దివాళా తీసింది దేశంలో
సంక్షోభం ఏర్పడింది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చివరికి అప్పటికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్టు నేత దిసనాయకే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలోనే ఎంపీల పెన్షన్లు రద్దు చేస్తానని చెప్పాడు. అన్నట్లే చేశాడు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉండగా ఎంపీలకు పెన్షన్లు తీసుకునే నైతికత లేదని న్యాయశాఖ మంత్రి హర్షణ నానాయక్కర బిల్లుపై చర్చ సందర్భంగా అన్నారు.
ఇక మన దేశం విషయానికి వస్తే ఒక వ్యక్తి ఎంపీ పదవిలో ఒక్క రోజు ఉన్నా కూడా నెలకు రూ.31,000 పెన్షన్ వస్తుంది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎంపీగా ఉంటే అదనంగా ప్రతి నెలా రూ.2500 చొప్పున పెన్షన్ వస్తుంది. ఒకవేళ మాజీ ఎంపీ మరణిస్తే వాళ్ల జీవిత భాగస్వామికి లేదా డిపెండెంట్లకు ఎంపీ పొందే పెన్షన్లో 50 శాతం అందుతుంది.
తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే తెలంగాణ, ఏపీలో పెన్షన్ కనీసం రూ.30,000 నుంచి ప్రారంభమై సర్వీసును బట్టి రూ.50,000 పైగా ఉంటుంది. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెన్షన్లు చాలా ఎక్కువ. రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్లోనే ఎంపీల జీతాలు పెరిగాయి. పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
పార్లమెంట్ సభ్యుల ప్రాథమిక జీతం రూ. 1,00,000గా ఉండగా ఈ మొత్తాన్ని రూ. 1,24,000కి పెంచారు. అలాగే, ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే రోజుకు ఇప్పటివరకు తీసుకుంటున్న రూ. 2,000 డైలీ అలవెన్సెస్ ను రూ. 2,500కి పెంచారు. పెన్షన్ విషయంలోనూ కేంద్రం కీలక మార్పులు చేసింది.
ప్రస్తుతం మాజీ పార్లమెంట్ సభ్యులకు నెలకు రూ. 25,000 పెన్షన్ అందించగా, ఇప్పుడు దాన్ని రూ. 31,000కి పెంచారు. అదనపు పెన్షన్ విషయంలోనూ మార్పు తీసుకువచ్చారు. ఇది ఇప్పటి వరకు రూ. 2,000గా ఉండగా, ప్రస్తుతం రూ. 2,500కు పెంచారు. ప్రజాప్రతినిధులు ఎక్కువ ఖర్చులను భరించాల్సిన పరిస్థితిలో ఉన్నారని, అందుకే జీతాలు పెంచామని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
అయితే, ఈ పెంపు నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రజాప్రతినిధుల జీతాలు, ఇతర సౌకర్యాలు పెంచడం సమంజసం కాదన్నారు. మరి భవిష్యత్తులోనైనా ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేసే బిల్లు వస్తుందా ? రాదా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.


