#తిరుమల లడ్డు #ఏపీ అప్ డేట్స్..📖 #పబ్లిక్ టాక్.. 🗣️
*తిరుమలపై సర్కార్ తీరు.. ప్రజాభిప్రాయం ఏంటి⁉️*
FEBRUARY 6, 2026🎯
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రోజురోజుకూ చినికిచినికి గాలివానగా మారుతోంది. కోట్లాది మంది హిందువులు తిరుమల క్షేత్రాన్ని తమ ఆధ్మాత్మిక రాజధానిగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే తిరుమల శ్రీవారు రాజకీయ వివాదం కావడం ప్రతి ఒక్కరి మనసుల్ని తొలిచేస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతగా కలుషితం అయ్యాయో తిరుమలేశుని వివాదం చేయడమే నిదర్శనం.
అయితే పాలకులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రజలు తమకంటే తెలివైన వాళ్లనే సంగతిని గుర్తించుకోవాలి. తిరుమల శ్రీవారిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ, చివరికి ఆ దేవుని ప్రతిష్టను కాపాడ్డానికి కఠిన చర్యలు తీసుకుంటామని అనడం పాలకులకే చెల్లింది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంతో యావత్ దేశమంతా నివ్వెరపోయింది. ఆధారాలు లేకపోతే సీఎం హోదాలో, అందులోనూ కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా పూజించే తిరుమల లడ్డూ ప్రసాదంపై కామెంట్స్ చేస్తారా? అని ప్రతి హిందువూ తనకు తాను ప్రశ్నించుకున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయంగా తమను సమాధి చేయడానికి చంద్రబాబు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని వాడుకున్నారని పసి గట్టింది . దీంతో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, తమిళనాడుకు చెందిన సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని సుప్రీంకోర్టుకు మొర పెట్టుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని వారు అభ్యర్థించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై వైవీ, సుబ్రమణ్యస్వామి పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఆధారాలతో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారని, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా చేయడం తగదని సీఎంకు సుప్రీంకోర్టు తలంటింది. ఆ తర్వాత నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారుల్ని నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టపరిచింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని నియమితులయ్యారు. సుమారు 14 నెలల పాటు సిట్ అన్ని కోణాల్లో విచారించి, ఇటీవల న్యాయస్థానానికి చార్జిషీట్లు సమర్పించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా చంద్రబాబునాయుడి తీవ్ర ఆరోపణలే సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది జగమెరిగిన సత్యం.
అందుకే సిట్ ఏం తేల్చిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో నెలకుంది. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, అలాగే డిప్యూటీ సీఎం అదనంగా ఆరోపించినట్టు చేప నూనె కలవలేదని సిట్ నివేదిక విస్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో కోట్లాది మంది హిందువులు సంతోషంగా, హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తాము స్వీకరించిన లడ్డూ ప్రసాదంలో మాంసకృత్తులు లేవన్న వాస్తవం ఎంతో ఊరట ఇచ్చింది.
ఇదే సందర్భంలో మరెందుకని ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత ఆరోపణలు చేశారనే ప్రశ్న హిందూ సమాజం నుంచి వెల్లువెత్తింది. ఇక్కడే చంద్రబాబుతో పాటు బలపరిచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయంగా బద్నాం కావడం మొదలైంది. ఇదంతా రాజకీయంగా వైసీపీని నాశనం చేయకుండా స్వామివారిని అస్త్రంగా వాడుకున్నారంటూ అంత కాలం సాగుతున్న విమర్శకు బలం కలిగించింది. అధికారం, రాజకీయం కోసం కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థించే తిరుమల శ్రీవారిని బజారుకీడుస్తారా? ఇదేం న్యాయం? అని దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులు, తటస్థులు నిలదీసే పరిస్థితి.
సీబీఐ చార్జిషీట్ తోనైనా తిరుమల లడ్డూ ప్రసాద వివాదానికి ముగింపు పలుకుతారని అంతా అనుకున్నారు. అబ్బే, అలాంటిది లేదని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారు. మరోవైపు చంద్రబాబు, పవన్కల్యాణ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని,
వాళ్లిద్దరూ క్షమాపణ చెప్పాలని వైసీపీ నుంచి డిమాండ్ రావడంతో కూటమి పెద్దల్లో తీవ్ర అసహనం మొదలైంది.
రెండురోజుల క్రితం గుంటూరులో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ద్రోహిగా చంద్రబాబును నిలిపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సీబీఐ నేతృత్వంలోని సిట్ రాజకీయంగా తమ వాళ్ల ప్రమేయం లేదని తేల్చి చెప్పడాన్ని గుర్తు చేశారు. స్వామి వారి ప్రసాదంపై అవాకులు చెవాకులు పేలడం, ఆరోపణలన్నీ తప్పని సీబీఐ నిర్ధారించిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేయడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఏపీ బీజేపీ చీఫ్, మరో ఆరేడుగురు మంత్రులు అసాధారణ రీతిలో మీడియా ముందుకొచ్చారు. దీన్ని బట్టి ప్రజల్లో తమపై నెగెటివ్ ప్రచారం పోతోందన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపించింది. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
“తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఆ వేంకటేశ్వరస్వామే మాకు అప్పగించారు. ఈ విషయమై ఈ రోజు నేను, పవన్కల్యాణ్, మాధవ్ కూర్చుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం” అని చంద్రబాబు అన్నారు. తాము మాత్రమే శ్రీవారి భక్తులమనే భావన నుంచి చంద్రబాబు బయటికి రావాలి. మంచి పరిపాలన అందించాలని ప్రజలు అపరిమిత అధికారాన్ని ఇచ్చారు. అయితే ఆ పని చేయకుండా, దారుణంగా ఓడిపోయిన వైఎస్ జగన్ను
చేయడానికి ఇంకా ఏముందని కలియుగ దైవం శ్రీవారిని వాడుకుంటున్నారనే చర్చ ప్రజల్లో వుంది.
కూటమి రాజకీయ, వ్యక్తిగత రాగద్వేషాలతో ప్రజలకు సంబంధం వుండదు. వారిలో అన్ని రకాల మత విశ్వాసులుంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా జీవిస్తున్నారు. తిరుమల శ్రీవారిని హిందువుల కంటే ఏ మాత్రం తక్కువ కాకుండా ఇతర మతస్తులు కూడా గౌరవిస్తారు, పూజిస్తారు. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రజాస్వామ్య అందం.
పాలక, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలతో ప్రజలకు సంబంధం లేదు. మనం కోరుకుంటున్నట్టు మంచి పాలన అందుతోందా? లేదా? అనేదొక్కటే ప్రజలు చూస్తారు. పాలించాలని అధికారం ఇస్తే, తిరుమల శ్రీవారిని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తున్నారంటి? అని జనం మాట్లాడుకుంటున్నారు. శ్రీవారిని ఇలవేల్పుగా చెబుతూ, మరోవైపు స్వామివారి ప్రసాదం జంతువుల కొవ్వుతోనే తయారు చేశారని నిరూపించడానికి సీబీఐ నివేదిక కాదని, చంద్రబాబునాయుడు (సీబీఎన్) కమిటీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల్లో గెలిపించినంత మాత్రాన, తమ ఆరోపణలన్నింటికీ ప్రజామోదం ఉందనే భావన నుంచి పాలకులు బయటపడాలి. శ్రీవారి కేంద్రంగా ఇంతకాలం సాగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులని, సీబీఐ నివేదికతో ప్రసాదంలో ఏం జరిగిందో వారే తేల్చుకుంటారని పాలకులు వదిలేయాలి. అందుకు విరుద్ధంగా తమ ఆరోపణలే నిజమని నిరూపించడానికి, శ్రీవారిని వివాదంలో ముంచెత్తుతామంటే... ఇక వారిష్టం.
నమ్మకాలు ఎప్పటికీ నిజాలు కావు. వాస్తవాలు మాత్రమే నిజాలవుతాయి. అందుకే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల వ్యవహారంలో సీబీఐ చార్జిషీట్కు అంత ప్రాధాన్యం. ఎందుకంటే, నెలల తరబడి ఎంతో మందిని విచారించి, ఆధారాలను బట్టి నివేదిక తయారు చేసింది. ఇంతకాలం పాలక, ప్రతిపక్షాల నుంచి వచ్చినవన్నీ తాము నిజమని నమ్మి మాట్లాడినవే. వాటితో విచారణ టీమ్కు సంబంధం ఉండదు. వాళ్లకు కావాల్సింది ఆధారాలు, వాస్తవాలు.
సీబీఐ సమగ్ర విచారణ జరిపి, ఒక నివేదిక ఇస్తే, దానిపై పాలకులు అసంతృప్తి వ్యక్తం చేయడం విడ్డూరం. పైగా దాన్ని కాదని, తామొక ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విపరీత ధోరణికి నిదర్శనమనే విమర్శ వస్తోంది. ప్రస్తుతం శ్రీవారి కేంద్రంగా సాగుతున్న అవాంఛనీయ వివాదంపై ప్రజానీకం ఏ మాత్రం సంతోషంగా లేరని గ్రహించి, ఆ తర్వాత పాలకులు ఏం చేయాలో నిర్ణయించుకోవాలి.


