U19 World Cup 2026: #🏏క్రికెట్ 🏏
*విశ్వ విజేతగా భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు❗*
Uppala Shivaprasad
February 6, 2026🏏
అండర్ 19 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఆరో టైటిల్ను ముద్దాడింది. ఇంగ్లండ్తో గురువారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 100 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ, బౌలింగ్లో అంబ్రిష్ సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. 2022 ఎడిషన్ తర్వాత టీమిండియా విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఇంగ్లండ్పైనే భారత్ విజయం సాధించడం గమనార్హం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుండు(40), విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32), కాన్షిక్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో(3/63) మూడు వికెట్లు పడగొట్టాడు. మన్నీ లమ్స్డెన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కోనర్(67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 115) సెంచరీతో రాణించినా.. బెన్ డాకిన్స్(56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అంబ్రిష్(3/56) మూడు వికెట్లు తీయగా.. దీపేష్ దేవండ్రన్(2/64), కాన్షిక్ చౌహన్(2/63) రెండేసి వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసారు.
ఇప్పటి వరకు ఈ టోర్నీలో 10 ఫైనల్స్ ఆడిన టీమిండియా 6 సార్లు విజేతగా నిలిచింది. 2000, 2008, 2012, 2018, 2022, 2026లో భారత్ విజేతగా నిలిచింది. విధ్వంసకర శతకంతో చెలరేగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అయితే అండర్ 19 ప్రపంచకప్ జట్టులో విజేతగా నిలిచిన జట్టుకు ఎలాంటి ప్రైజ్మనీ లభించదు. ఈ టోర్నీని కేవలం యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించే వేదికగా ఐసీసీ పరిగణిస్తుంది. కమర్షియల్ ఆదాయం కంటే క్రీడా స్ఫూర్తికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. కేవలం ఐసీసీ ట్రోఫీని మాత్రమే అందజేస్తారు.


