*_1️⃣4️⃣6️⃣_*
*_సంపూర్ణ మహాభారతము_*
*_146 వ రోజు_*
*_వన పర్వము సప్తమాశ్వాసము:_*
*_సుగ్రీవుడు సీతాన్వేషణకు కపులను పంపుట_*
*సుగ్రీవుడు రాజ్య భోగాలను అనుభవిస్తున్నాడు. రామలక్ష్మణులు మాల్యవంతం అనే గుహలో ఉన్నారు. వర్షాకాలం గడిచి పోయింది. రాముడు లక్ష్మణునితో “లక్ష్మణా! సుగ్రీవుడు రాజ్య భోగములతో గడుపుతూ మనలను మరచినట్లున్నాడు. నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళి హెచ్చరించి రమ్ము. అతడు అనుకూల వర్తనుడైతే ఇక్కడకు తీసుకురా” అని పంపాడు.*
*అన్న మాటలను విని లక్ష్మణుడు సుగ్రీవుని హెచ్చరించాడు*.
*సుగ్రీవుడు వణికి పోయాడు. “నేను ఇచ్చిన మాట మరచు నీచుడిని కాను. సీతను వెతుకుతూ వానరులను నలుదిక్కులకూ పంపాను. నెల రోజులు గడువు ఇచ్చాను. గడువు తీరటానికి అయిదు రోజులు ఉంది. సీతాదేవి జాడ తెలియగానే నేను రాముని వద్దకు వస్తాను” అన్నాడు*.
*ఆ సమాధానంతో తృప్తి చెందిన లక్ష్మణుడు సుగ్రీవుని తీసుకుని రాముని వద్దకు వెళ్ళాడు.*
*సుగ్రీవుడు తాను చేసిన ఏర్పాట్లు రామునికి చెప్పాడు. రాముడు తృప్తి చెందాడు. కొన్ని రోజులకు అన్ని దిక్కుల నుండి కోతులు వచ్చి సీతమ్మ జాడ దొరకలేదని చెప్పారు*.
*దక్షిణ దిక్కు వెళ్ళిన కపులు ఇంకా రాలేదు. కొంతమంది వానరాలు సుగ్రీవుని వద్దకు వచ్చి “మహారాజా! తమరు అత్యంత ప్రియంగా పెంచుకున్న మధువనంలో అంగదుడు హనుమంతుడు మొదలైన వారు ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఫలములు తింటున్నారు వనరక్షకులమైన మేము వారిని వారించగా మమ్ములను కొట్టారు” అని చెప్పారు*.
*సుగ్రీవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిన అంగదుడు, హనుమంతుడు మొదలగు వారు సీతను చూసి ఉంటారు. అందుకే వారు ఆనందోత్సాహాలను ప్రదర్శించి ఉంటారు” అనుకున్నాడు.*
*_సీత జాడ రామునికి తెలుపుట_*
*దక్షిణ దిక్కుగా వెళ్ళిన వానరులంతా వచ్చారు. హనుమంతుడు సుగ్రీవుడు, రాముని చూసి “దేవా! సీతను చూసాను. దక్షిణ దిశగా వెళ్ళి అశోక వనంలో రావణ కట్టుబాటులో ఉన్న సీతను నేను చూసాను. మేము సీతను వెదుకుచూ వెళుతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనపడింది. ఆ సొరంగంలో ప్రవేశించి కొన్నాళ్ళకు ఒక నగరం చేరుకున్నాము. అక్కడ మాకు ఒక తాపసి కనపడింది. మమ్మలిని ఆదరించింది. తరువాత మలయ పర్వతం చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం దాటటానికి ఎవరికీ శక్యం కాలేదు. సీతను వెదకకుండా వెనుకకు మరలడం కంటే చావడం మేలనుకున్నాము. అక్కడ ఒక సంపాతి అనే పక్షిరాజు మాకు కనిపించాడు. మేము జరిగినదంతా చెప్పుకుని విచారిస్తుండగా ఆ పక్షిరాజు “అయ్యా! మీ మాటలలో జటాయువు అనే పేరు వినవచ్చింది. నేను నా తమ్ముడు ఒకసారి సూర్య మండలానికి ఎగిరాము. నా రెక్కలు మాడి పోవడంతో నేను ఇక్కడ పడి ఉన్నాను. నా తమ్ముడు జటాయువు గురించి మీకు తెలిస్తే చెప్పండి” అని అడిగాడు*.
*నేను సంపాతితో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడం జటాయువును చంపడం చెప్పాను. జటాయువు మరణ వార్త విన్న సంపాతి “అయ్యా! నాకు రావణుని గురించి తెలియును. వాడు రాక్షసుడు. ఇక్కడికి నూరు యోజనముల దూరంలో ఉన్న లంకను రాజధానిగా చేసుకుని రావణుడు రాజ్యం చేస్తున్నాడు. మీకు అక్కడ సీతాదేవి కనిపించవచ్చును” అన్నాడు*.
*మాలో ఎవరికీ సముద్రాన్ని దాటే శక్తి లేదు. నా తండ్రి వాయు దేవుని వలన నాకు సముద్రాన్ని దాటే శక్తి కలిగింది. నేను లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి నన్ను రామ దూతగా నన్ను పరిచయం చేసుకుని మీ ముద్రికను ఇచ్చాను ఆమెకు మీ క్షేమం చెప్పాను. ఆమె నన్ను నమ్మ లేదు రావణుడు కామ రూపియై వచ్చాడు అనుకుంది. నేను ఆమెకు విశ్వాసం కలిగించాక ఆమె నన్ను నమ్మింది. తన ఆనవాలుగా ఈ శిరోభూభణం మీకు ఇమ్మంది. సుగ్రీవుని సాయంగా తీసుకు వచ్చి అతి త్వరలో తనను తీసుకు పొమ్మని మీకు చెప్పమని చెప్పింది. ఆమెకు నేను ధైర్య వచనాలు చెప్పి వచ్చాను. ఆమె నాకు చిత్రకూటం పై జరిగిన కాకాసురుని వృత్తాంతం చెప్పింది" అన్నాడు*.
*హనుమంతుడు రామునికి శిరోభూషణం అందించాడు. రాముడు ఆ శిరోభూషణాన్ని గుండెలకు హత్తుకున్నాడు* #మన సంప్రదాయాలు సమాచారం

