*ఖమ్మంనకు కృష్ట కటాక్షం - ఇస్కాన్ టెంపుల్ కు కేబినేట్ ఆమోదం*
• రఘునాథపాలెంలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయింపు
• మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషికి ఫలితం
• ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్గానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
• ఇస్కాన్ టెంపుల్ నిర్మాణంతో ఖమ్మంలో ఆధ్యాత్మిక వైభవానికి నాంది
• మంత్రి తుమ్మల కృషితో రూపుదిద్దుకుంటున్న సమగ్ర సేవా–సాంస్కృతిక వేదిక
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) సొసైటీ ద్వారా శ్రీ బలరామకృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రఘునాథపాలెం గ్రామం & మండలం పరిధిలో సుమారు 4 ఎకరాలు 30 గుంటల ప్రభుత్వ భూమిని ఇస్కాన్ సొసైటీకి కేటాయిస్తూ గురువారం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఖమ్మంలో ఆధ్యాత్మిక– సాంస్కృతిక సేవా కేంద్రం ఏర్పాటు దిశగా ముందడుగు పడింది. జి.ఒ. 571 ప్రకారం భూమి కేటాయింపు 14-09-2012 తేదీగల రెవెన్యూ (అసైన్-I) శాఖ జి.ఒ.ఎం.ఎస్. నెం.571 నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లింపుపై ఈ భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆశ్రమం & భజన మందిర్ నిర్మాణం కోసం ఇస్కాన్ సొసైటీ పేరుతో ఈ భూమి వినియోగించబడనుంది.
కలెక్టర్ ప్రతిపాదన....
మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ సమర్పించిన ప్రతిపాదనను తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలించి 05-01-2026న ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం టి.జి.ఎల్.ఎం.ఎ (తెలంగాణ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ) సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి, మార్కెట్ విలువ చెల్లింపుపై భూమి కేటాయింపుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
క్యాబినెట్ ఆమోదంతో ప్రాజెక్ట్కు ఊపిరి...
మంత్రిమండలి ఆమోదంతో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే నిర్మాణ దశలోకి వెళ్లే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయం ఖమ్మం అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఖమ్మంలో ఇస్కాన్ మహా ప్రాజెక్టు....
ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక శోభను అందించే ఒక మహోత్తర ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) ఆలయ నిర్మాణం ప్రారంభమవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆలయం భక్తులకు శ్రీకృష్ణ భక్తి మార్గంలో సేవలు అందించడమే కాకుండా గీతా ప్రచారం, సత్సంగాలు, ధార్మిక కార్యక్రమాలకు వేదికగా నిలవనుంది.
ఖమ్మం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం (ISKCON) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఆలయం సాధారణ దేవాలయ నిర్మాణం కాదు—ఇది భక్తి, విద్య, సేవ, గ్రామీణాభివృద్ధి అన్న నాలుగు స్తంభాలపై నిలబడే సమగ్ర ఆధ్యాత్మిక–సామాజిక ప్రాజెక్ట్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్న ఈ ప్రణాళిక, నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపును మాత్రమే కాకుండా సమాజానికి దీర్ఘకాల ప్రయోజనాలను అందించనుంది. ఖమ్మంను ఆధ్యాత్మిక–సేవా కేంద్రంగా మలచే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఇస్కాన్ లక్ష్యాలు
శ్రీ శ్రీ బలరామ కృష్ణ ఆలయం నిర్మాణం, గోశాల ఏర్పాటు, అన్నదానం కార్యక్రమాలు, యోగా, ధ్యానం మరియు సాత్విక ఆహార అలవాట్ల ద్వారా ఆధునిక యువతను వేద జీవన విధానానికి అనుసంధానం చేయడం, పాఠశాల విద్యార్థుల కోసం భగవద్గీత బోధన – ప్రతి ఆదివారం తరగతులు మరియు వేసవి శిబిరాలు నిర్వహించడం, మహిళా సాధికారత, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గిరిజన సంక్షేమం.
శ్రీ శ్రీ బలరామ–కృష్ణ ఆలయం: భక్తి, వాస్తు, సంస్కృతి సమ్మేళనం...
ఈ ప్రాజెక్ట్లో ప్రధాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శ్రీ శ్రీ బలరామ–కృష్ణ ఆలయం వేద శిల్పకళా సౌందర్యాన్ని ప్రతిబింబించేలా నిర్మాణం కానుంది. విశాల ప్రాంగణం, నిత్య పూజలు, భజనలు, ఉత్సవాలతో ఇది భక్తులను ఆకర్షించనుంది. నగర జీవన ఒత్తిడిలో మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారే అవకాశం ఉంది. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఖమ్మం ఆధ్యాత్మిక శోభతో విరాఝిల్లనుంది. దీంతో పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించే అవకాశముంది.
గోశాల: సంస్కృతి పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యానికి మద్దతు...
గోశాల ఏర్పాటు ద్వారా గోసంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రమే కాదు, సాంప్రదాయ భారతీయ వ్యవసాయ–ఆహార వ్యవస్థలను ప్రజలకు అనుసంధానం చేయాలనే లక్ష్యం ఉంది. గో-ఉత్పత్తుల వినియోగం, ఆర్గానిక్ వ్యవసాయానికి అనుసంధానం ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించవచ్చు. ఇది ఆర్థికంగా కూడా స్వయం సమృద్ధికి దోహదం చేయగలదు.
అన్నదానం: ఆకలి నివారణ నుంచి సామాజిక సమానత్వం వరకు...
నిత్య అన్నదానం కార్యక్రమాలు కేవలం దాతృత్వ చర్యగా కాకుండా, సమాజంలో ఆకలి నిర్మూలనకు ఒక వ్యవస్థీకృత ప్రయత్నంగా ఉంటాయి. నగరంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఇది ఆధారంగా మారే అవకాశం ఉంది. అన్నదానం ద్వారా మానవతా విలువలు బలపడతాయి, సమాజంలో అనుబంధం పెరుగుతుంది. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడమే ఈ అన్నదాన సేవ ప్రధాన ఉద్దేశం.
యువతకు యోగా–ధ్యానం: ఆధునిక ఒత్తిడులకు వేద పరిష్కారం...
ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, చెడు వ్యసనాలు, ఆధునిక జీవన శైలి సమస్యలకు యోగా, ధ్యానం, సాత్విక ఆహారం వంటి వేద పద్ధతుల ద్వారా పరిష్కార మార్గాలు చూపించాలనే లక్ష్యం ఉంది. వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైతికత—ఈ మూడు అంశాల్లో యువతను బలపరచడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించగలదు.
విద్యార్థులకు భగవద్గీత బోధన: విలువలతో కూడిన విద్యా దిశ....
ప్రతి ఆదివారం భగవద్గీత తరగతులు, వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల్లో చిన్న వయసులోనే ఆధ్యాత్మికతను పెంపొందిచడం, నైతికత విలువలు, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. పాఠశాల విద్యకు తోడు జీవన విలువలను నేర్పే ఈ కార్యక్రమాలు భావితరాలకు దిశానిర్దేశం చేస్తాయి.
మహిళా సాధికారత: ఆధ్యాత్మికతతో ఆత్మవిశ్వాసం...
మహిళల సామాజిక, ఆర్థిక, మానసిక అభివృద్ధికి ఆధ్యాత్మిక విలువలను జోడించడమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. స్వయం సహాయక సమూహాలు, శిక్షణ కార్యక్రమాలు, నైతిక విద్య ద్వారా మహిళలు కుటుంబం–సమాజంలో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించేలా చేయడమే లక్ష్యం.
సహజ వ్యవసాయం: రైతులకు ప్రత్యామ్నాయ మార్గదర్శనం...
రసాయనాల వినియోగం తగ్గించి సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల ఖర్చులు తగ్గించే దిశగా అవగాహన కల్పించనున్నారు. గోశాల, సహజ వ్యవసాయం పరస్పరం అనుసంధానమై స్థిరమైన వ్యవసాయ మోడల్గా మారే అవకాశముంది.
గిరిజన సంక్షేమం: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి దిశ...
గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, పోషణ, ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యం ఉంది. ప్రధాన జన స్రవంతిలోనికి వారిని తీసుకురావడంలో ఈ కార్యక్రమాలు కీలకంగా నిలవవచ్చు.
ఖమ్మానికి కొత్త రూపు: ఆధ్యాత్మిక–సేవా హబ్గా రూపాంతరం....
ఖమ్మంలో ఇప్పటికే ఒక పక్క అల్లీపురంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం మరొపక్క రఘునాథపల్లిలో ఇస్కాన్ ద్వారా శ్రీ బలరామ కృష్ణ దేవాలయ నిర్మాణం ప్రాజెక్ట్ లు పూర్తి స్థాయిలో అమలు అయితే, ఖమ్మం జిల్లా ఒక ఆధ్యాత్మిక–సేవా కేంద్రంగా ఎదగవచ్చు. భక్తి, విద్య, సేవల సమన్వయంతో ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశముంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి కూడా ఇది ఊతమివ్వగలదు.
ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం ఖమ్మానికి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాన్ని మాత్రమే కాకుండా, సమాజంలోని విభిన్న వర్గాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రణాళికగా నిలుస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ప్రారంభమైన ఈ యత్నం, అమలులోనూ అదే వేగం కొనసాగితే ఖమ్మం భవిష్యత్తుకు కొత్త దిశను చూపనుంది. #మన సంప్రదాయాలు సమాచారం