*_నాలుగు వేల కోట్లకు అమ్మేశా!_*
*కలారీ క్యాపిటల్... బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. స్టార్టప్ రంగంలో ఉన్నవారికి ఈ పేరు సుపరిచితం. స్నాప్డీల్, మింత్రాలాంటి విజయవంతమైన కంపెనీలకు వీరు ప్రారంభదశలో పెట్టుబడులు పెట్టారు.*
*తెలుగువారైన వాణీ కోలా... ఈ సంస్థ సహ వ్యవస్థాపకురాలూ, ఎండీ. ఆమె విజయ ప్రస్థానం గురించి అడిగితే, చెబుతున్నారిలా...*
*పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నాన్న ప్రభుత్వోద్యోగి. చిన్నపుడు లెక్కలు బాగా చేసేదాన్ని. దాంతో ఇంటర్లో ఎంపీసీ చదివాను, ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఇది 1981నాటి మాట. ఇంజినీరింగ్ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్'లో ఉద్యోగం వచ్చింది. కానీ ఎం.ఎస్. చదవడానికి అమెరికా వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మావారు శ్రీనివాస్. ఉస్మానియాలో నాకు సీనియర్. ఆయన అప్పటికే ఎం.ఎస్.చేయడానికి బోస్టన్ వెళ్లారు. నాకూ అక్కడే సీటు వచ్చింది. అమెరికా వెళ్లడానికి కొద్ది నెలల ముందు మాకు పెళ్త్లెంది.*
*అమెరికాలో అడుగుపెట్టింది 1985లో. అదో కొత్త ప్రపంచం. మన నేపథ్యంకంటే మన ఆలోచనలకూ, సామర్థ్యానికీ విలువ ఇస్తారక్కడ. ఎం.ఎస్. చేస్తూనే వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎం.ఎస్. తర్వాత ఉద్యోగంలో చేరాను. సిలికాన్ వ్యాలీలో అందరూ స్టార్టప్స్ గురించి ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టార్టప్లో భాగమవుతుంటారు. వివిధ టెక్ కంపెనీల్లో 12 ఏళ్లు ఉద్యోగ అనుభవం తర్వాత 'రైట్వర్క్స్' పేరుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. నాలుగేళ్ల తర్వాత సంస్థను సుమారు రూ.4000 కోట్లకు అమ్మాను. తర్వాత 'సెర్టస్ సాఫ్ట్ వేర్' పేరుతో మరో కంపెనీని పెట్టాను. దాన్నీ తర్వాత మంచి లాభానికి అమ్మేశాను. రెండు కంపెనీల్లో భాగస్వాములకు వారివారి వాటాలు ఇచ్చాను.*
*2006లో ఇండియా వచ్చి రెండు నెలలు ఉన్నాను. చాలా ప్రాంతాలు తిరిగి, చాలామందితో మాట్లాడాను. ఇక్కడ వినియోగదారుల సంఖ్యా, స్వభావం మారింది. ఇక్కడా అవకాశాలున్నాయనిపించింది. నా చిన్నపుడు బయటకి వెళ్లి తినేవాళ్లం కాదు. ఇప్పుడు హోటల్కి వెళ్లి తినడం సాధారణ విషయం. అప్పట్లో సెలవుదొరికితే తాతగారింటికో, అత్తారింటికో వెళ్లేవారు. ఇప్పుడు ప్రపంచం చుట్టొస్తున్నారు. మౌలిక సదుపాయాలూ, రవాణా, చెల్లింపులూ, వినియోగదారులూ ఉత్పత్తిదారుల మధ్య భౌతిక దూరం... లాంటి కొన్ని పరిమితులు కనిపించాయి. ఆ లోటును సాంకేతికతతో పూడ్చవచ్చనిపించింది. ఇక్కడ ఉంటే ఆ పని నేనే చేయొచ్చనిపించింది. అదే సంవత్సరం రూ.130 కోట్లతో యూఎస్ఇండియా వెంచర్స్ని సిలికాన్ వ్యాలీలో పరిచయమైన వినోద్ ధామ్(ఇంటెల్లో ఉపాధ్యక్షుడు)తో కలిసి ప్రారంభించాను*.
*ఇండోయూఎస్ వెంచర్స్ ద్వారా మొదట 'వయా' అనే ట్రావెల్ స్టార్టప్లో పెట్టుబడులు పెట్టాం. తర్వాత మేం పెట్టుబడి పెట్టిన స్నాప్డీల్, మింత్రా, అర్బన్లేడర్, జివామీ ఈరోజు మార్కెట్లో ఆయా విభాగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నాయి. స్నాప్డీల్, అర్బన్ లేడర్ సంస్థల్లో వ్యాపార దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడం మరో గొప్ప విషయం. ఆయన ఈ మధ్యనే మా సంస్థలో సలహాదారుగా కూడా చేరారు. మింత్రా(ఫ్లిప్కార్ట్ కొనుగోలుచేసింది) ద్వారా మేం ఫ్లిప్కార్ట్తోనూ పనిచేస్తున్నాం. ఆ విధంగా దేశంలో రెండు పెద్ద ఈ-రిటైల్ కంపెనీలు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్లతో మాకు అనుబంధం ఉందనడానికి గర్వపడుతున్నాం*.
*మాకు ఏటా 2000 కంపెనీల నుంచి ప్రతిపాదనలు వస్తాయి. వాటిలోంచి వడపోతతో కేవలం రెండు శాతం కంపెనీలనే ఎంచుకుంటాం. నాకు ఆలోచనతోపాటు స్టార్టప్ జట్టులో ఎవరున్నారనేదీ ముఖ్యం. అర్హతలు అందరికీ ఉంటాయి. కానీ లక్ష్యాన్ని చేధించే సామర్థ్యం ఉందా లేదా అనేది చూస్తాను. కియోస్కుల ద్వారా వినియోగదారులకు ఏయే ఆప్లు ఉండాలో సలహా ఇచ్చే 'ఆప్స్డైలీ' అనే సంస్థలో పెట్టుబడి పెట్టార. ఆలోచనతోపాటు వ్యవస్థాపకుల ఆత్మవిశ్వాసం నాకు నచ్చి అందులో పెట్టుబడులు పెట్టాను. కొత్త కంపెనీలతో 6-8 ఏళ్లు కలిసి ప్రయాణిస్తాం. అనుకున్న స్థాయిలో కంపెనీని నిర్మించేందుకు అన్ని విధాలా సాయపడతాం.*
*ఇండోయూఎస్ వెంచర్స్ ని 2012లో కలారీ వెంచర్స్గా పేరు మార్చాం. కేరళలో ఒక మార్షల్ ఆర్ట్ పేరది. కలారీ క్యాపిటల్గా మారాక కొత్త భాగస్వాములతో కలిసి పెట్టుబడుల్ని పెంచాం. ఇప్పటివరకూ 55 కంపెనీల్లో రూ.2200 కోట్లకుపైన పెట్టుబడి పెట్టాం*.
*'ఈ రంగంలో మహిళల స్థానం ఎక్కడ'అని...చాలామంది నన్ను అడుగుతుంటారు. నేను ఇంజినీరింగ్ చదివే సమయంలో 400 మందిలో ఆరుగురమే అమ్మాయిలం. కానీ ఇప్పుడు ప్రతి క్లాసులో దాదాపు సగం మంది అమ్మాయిలు ఉంటున్నారు. వీరంతా భవిష్యత్తులో మేనేజర్లుగా, సీయీవోలుగా, కంపెనీల వ్యవస్థాపకులుగా, ఆపై వెంచర్ క్యాపిటలిస్టులుగా మారబోతున్నారు. వెంచర్ క్యాపిటలిస్టుగా మారాలనుకునేవారికి మొదట లక్ష్యం స్పష్టంగా ఉండాలి. తర్వాత కుటుంబం, స్నేహితుల సహకారం ఉండేలా చూసుకోవాలి. నాకైతే ప్రతిదశలో తల్లిదండ్రుల సహకారం, మావారి మద్దతూ లభించాయి.*
*బెంగళూరులో ఉంటాను. వీలైనంత ఎక్కువ సమయాన్ని భర్త, పిల్లలతో గడుపుతాను. మావారు కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. మాకు ఇద్దరమ్మాయిలు*. *బెంగళూరులో ఒకరు, బోస్టన్లో మరొకరు చదువుతున్నారు. నెలలో వారంపాటు పర్యటనల్లోనే ఉంటాను. ఎక్కడ ఉన్నాసరే యోగా, ధ్యానం చేస్తాను. పర్వతారోహణ నా హాబీ. మా ఇంటి తోటలోనే మాకు కావాల్సిన కాయగూరల్ని పండిస్తాను కూడా.* #మన సంప్రదాయాలు సమాచారం