ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #ఎల్లో మీడియా.. 🤠 *కూటమిని కలవరపెడుతున్న అనుకూల పత్రిక కథనం❗* MARCH 7, 2026🎯 కూటమి ప్రభుత్వం కోసం ఎందాకైనా అన్నట్టుగా ఆ మీడియా వ్యవహరిస్తుంటుంది. ఆ మీడియా సంస్థకు విశాఖలో భూకేటాయింపును వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, మళ్లీ విలువైన భూమిని కేటాయించారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ వ్యవహారం న్యాయ స్థానంలో నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ శ్రేయస్సును కాంక్షించే సదరు మీడియా పోలీసింగ్ చేస్తోంటోంది. ప్రభుత్వ నిఘా వర్గాల కంటే, తనకే ఎక్కువ బాధ్యత వున్నట్టు ఎక్కడేం జరుగుతున్నదో తన మీడియా నిఘానేత్రం ద్వారా ఎప్పటికప్పుడు బయటపెట్టడానికి తహతహలాడుతూ వుంటుంది. అందులో భాగంగా ఇవాళ ఒక కీలక విషయాన్ని సదరు ప్రభుత్వ అనుకూల పత్రిక బయట పెట్టింది. వైఎస్ జగన్కు అనుకూలమైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో విజయవాడలో కీలక భేటీ జరిగిందట! ఏడాది క్రితం ఇదే రిటైర్డ్ అధికారి కలుద్దామని అడిగితే, ప్రస్తుత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు దూరంగా ఉన్నారని రాసుకొచ్చారు. కానీ ఇటీవల ఆ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి పిలిస్తే, ఆరేడుగురు ఐఏఎస్లతో పాటు మొత్తం 12 మంది ఉన్నతాధికారులు వెళ్లారనే సంగతిని బయట పెట్టడం విశేషం. మరీ ముఖ్యంగా ఐఏఎస్లలో కార్యదర్శి స్థాయి అధికారులున్నారనే సంచలనాన్ని బయట పెట్టారు. ఈ కథనం కూటమి ప్రభుత్వం ప్రమాదంలో వుందనే హెచ్చరిక చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజలనాడిని గుర్తించేది మొదట ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులే. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత లేదని పసిగడితే, నెమ్మదిగా ప్రతిపక్ష నాయకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వుందని తెలుసుకున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షం కోరిన కీలక సమాచారాన్ని చేరవేసేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కీలక పదవులను పొందారనడం బహిరంగ రహస్యమే. అయితే ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఉద్యోగులైన తామే పదవీ విరమణ అయ్యే వరకూ పదవుల్లో కొనసాగుతామని ఉద్యోగులకు బాగా తెలుసు. ఆ విషయాన్ని నిత్యం తమ మనసుల్లో పెట్టుకుని ఉద్యోగులు మెలుగుతూ వుంటారు. సదరు ప్రభుత్వ వీరాభిమాన పత్రిక కథనం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక వ్యక్తుల వద్ద క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శి స్థాయి అధికారులున్నారు. ఇలాంటి వాళ్లు వైసీపీ అనుకూల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వద్దకు వెళ్లారంటే చిన్న విషయం కాదు. లాభనష్టాలను బేరీజు వేసుకున్నాకే, సదరు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వద్దకు వెళ్లి వుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వుందనే అభిప్రాయానికి ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు చిన్న ఉద్యోగులు కూడా వచ్చారనేందుకు ఇదే సంకేతం. అయితే ప్రస్తుతానికి సీనియర్ ఐఏఎస్ అధికారులే సదరు రిటైర్డ్ ఉన్నతోద్యోగి వద్దకు వెళ్లి వుండొచ్చు. భవిష్యత్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఉన్నత ఉద్యోగ వర్గాల్లో లాబీయింగ్ మొదలైందనే చర్చకు తెరలేచింది. ఒకవైపు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు వైసీపీని కూడా కన్నుగీటుతున్నారంటే, క్షేత్రస్థాయిలోనూ, ఉద్యోగుల్లోనూ వచ్చిన, వస్తున్న మార్పునకు స్పష్టమైన సంకేతంగా భావించొచ్చు. కూటమి ప్రభుత్వం నుంచి రహస్యాలు రాబట్టడానికే కీలక సమావేశం నిర్వహించారనడం కంటే, ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? ప్రస్తుత కాలంలో ఏదీ రహస్యంగా వుంచడానికి వీలు కాదు. పదుల సంఖ్యలో ఐఏఎస్, ఇతర ఉన్నత ఉద్యోగులు ఒక చోట కలుస్తున్నారంటే బయటికి తెలియదని అనుకునేంత అమాయకులు లేరు. అయినప్పటికీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కార్యదర్శి స్థాయి, అది కూడా కీలక నాయకుల వద్ద ముఖ్యమైన బాధ్యతల్ని నిర్వహించే వారు వెళ్లారంటే, ఆలోచించాల్సింది పాలకులే. ఇంత తక్కువ సమయంలో వైసీపీ పెద్దలకు ఐఏఎస్, ఇతర ఉన్నత ఉద్యోగులు దగ్గర కావాలని ఎందుకు అనుకుంటున్నారో పాలకులు సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పాలన గురించి మనం అనుకుంటున్నది, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం వేరుగా వుందని ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికైనా అర్థమై వుండాలి. ఈ కథనం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కలవడానికి ఎవరెవరు వెళ్లారో ఆరా తీయడం పక్కన పెట్టాలి. అసలు ప్రభుత్వం ఆలోచించాల్సింది... ఇంకా ప్రభుత్వం మూడేళ్లు ఉంటుందని తెలిసినా, వైసీపీ వైపు పెద్దపెద్ద ఉద్యోగులు ఎందుకు ఆకర్షితులవుతున్నారో ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం దొరుకుతుంది. స్వీపర్, అటెండర్ స్థాయి ఉద్యోగులు మొదలుకుని, ప్రధాన కార్యదర్శి వరకూ ప్రభుత్వానికి అనుకూలంగా వుండాలని భావిస్తారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ పరపతి ప్రజల్లో పడిపోతోందని గుర్తిస్తే, వెంటనే అప్రమత్తం అయ్యేది కూడా ఉద్యోగులే. ఈ కథనం చదివిన తర్వాత, ఉద్యోగుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఎవరైనా అనుకునే అవకాశం వుంది. ఇది మిగిలిన ఉద్యోగుల్లో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ పరిస్థితి బాగాలేనట్టుందని, అందుకే అంతపెద్ద స్థాయి ఉద్యోగులు కూడా వైసీపీ వైపు అట్రాక్ట్ అవుతున్నారని చిన్నస్థాయి ఉద్యోగుల ఆలోచనల్లో మార్పునకు బీజం పడుతుంది. ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ పెద్దలు, కూటమి నేతలు చెప్పిన పని చేయడానికి అధికారులు పెద్దగా ఆసక్తి చూపరు. మరీ ముఖ్యంగా వివాదాస్పద అంశాల్ని ఉద్యోగులు పూర్తిగా పక్కన పెడతారు. అలాంటి పనులు చేసి వైసీపీకి తామెందుకు టార్గెట్ కావాలని అనుకుంటారు. ప్రజల్లో ప్రభుత్వంపై అంత సానుకూలత వాతావరణం లేదనే నిర్ణయానికి ఉద్యోగులు వస్తే, జరిగే మార్పులివే. తమ అనుకూల పత్రిక కథనంతో మేల్కోవాల్సింది ప్రభుత్వ పెద్దలే. తమ పాలనపై ప్రజల్లో మార్పు కనపడుతోందని, అందుకే ఎంతో నమ్మకమని భావించి కీలక బాధ్యతలు అప్పగించిన ఉద్యోగుల్లో సైతం మార్పు వస్తోందని పాలకులు గుర్తించాలి. పాలనపై పోస్టుమార్టానికి ఇదే సరైన సమయం. ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat