#😇My Status #"నా ఉత్తమ కంటెంట్ " #మహిళా శక్తి
• మహిళా జయహో
* పనికిరాని టైర్లతో.. పారిశ్రామికవేత్తల సదస్సుకు..!
ఆమె చదివింది న్యాయశాస్త్రం.. ప్రవేశించింది మాత్రం పరిచయం లేని టైర్ల వ్యాపారంలోకి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనా... పారిశ్రామికవేత్తగా రాణించాలన్న బలమైన పట్టుదలే ఆ రంగాన్ని ఎంచుకునేలా చేశాయంటారామె. పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమ పెట్టాలనే సంకల్పమే ఆమెను విజయ తీరాల వైపు నడిపించింది. లాభాలూ తెచ్చిపెట్టింది.
ఆమే విశాఖకు చెందిన నీతిపూడి స్వర్ణలత.నా కష్టానికి లాభాల్నే కాదు...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డునూ అందుకున్నా. ఈ మధ్య జరిగిన జీఈఎస్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అయితే ఈ విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు.
మాది పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సమీపంలోని జగన్నాథపురం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశా. నా సహవిద్యార్థి కరుణ కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. తరువాత సమస్యల్ని దాటుకుని ఇద్దరం న్యాయవిద్యను పూర్తిచేశాం.
• ఆయనకోసం వదులుకున్నా... !
మా వారి లక్ష్యం న్యాయమూర్తి కావడం. మా పెళ్లయిన ఐదేళ్ల తరువాత అంటే 2005లో ఆయన ఫస్ట్క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అయ్యారు. ఆయన న్యాయమూర్తి కావడం...చాలాకాలం పాటు సింగిల్ కోర్టులున్న చోట్ల పనిచేయడంతో నాకు న్యాయవాదిగా చేసే అవకాశం లేకుండాపోయింది. భర్త న్యాయమూర్తిగా ఉన్న కోర్టులో భార్య వాదించకూడదు. దీంతో న్యాయవాద వృత్తికి దూరమయ్యా. ఆ సమయంలో ఇష్టంగా చదివిన చదువుకి దూరమయ్యానని అనిపించేది. బాగా ఆలోచించాక సొంతంగా ఏదైనా చేద్దామనుకున్నా. చివరికి పర్యావరణానికి మేలుచేసే ఓ పరిశ్రమ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చా.
* టైర్లతో వ్యాపారం...
చేయాలనుకున్న వ్యాపారంపై ఓ స్పష్టత వచ్చాక మా జిల్లా పరిశ్రమల కేంద్రం అప్పటి జనరల్ మేనేజర్ నాయక్ను కలిసి నా ఆలోచన చెప్పా. అంతా విన్నాక పనికిరాని టైర్లతో రబ్బరు పొడి తయారుచేసే పరిశ్రమ పెట్టొచ్చని చెప్పారు. నాకూ నిజమేనని అనిపించింది. ఎందుకంటే... ఈ టైర్లు సుమారు 40 ఏళ్లపాటు భూమిలో ఉన్నా మట్టిలో కలిసిపోవు. అలానే ఆ పొడిని తారుతో కలిపి రహదారులు, విమానాశ్రయ రన్వేల నిర్మాణంలో ఉపయోగిస్తారు. తిరిగి వాటిని టైర్ల తయారీలో వాడొచ్చని తెలిసి నేనూ అదే చేయాలనుకున్నా. నా ఆలోచన చెప్పినప్పుడు కొందరైతే ‘పనికిరాని టైర్లతో వ్యాపారం చేస్తావా? అన్నారు. మరికొందరేమో న్యాయమూర్తి భార్యవి... నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముందన్నారు. ఎందుకొచ్చిన వ్యాపారాలు? నష్టాలొస్తే ఏం చేస్తావ్?’ అని హెచ్చరించారు బంధువులు. కానీ మా వారూ, ఆయన స్నేహితుల ప్రోత్సాహంతో రుణంకోసం ప్రయత్నించా. ఎస్ఎంఈసీసీ విభాగం నుంచి రుణం వచ్చింది. ఆ తరువాత ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) అధికారుల్ని సంప్రదిస్తే గంభీరంలో స్థలం కేటాయించారు. ఈ పొడిని కొనడానికి హింకాల్ అనే సంస్థ కూడా ముందుకు రావడంతో పనులు మొదలుపెట్టా. 2013 నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి ‘ప్రిన్స్టన్ రబ్బర్ ఇండస్ట్రీస్’ సంస్థను ప్రారంభించా.• లాభాలు రాలేదు...!
అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా... పనులు ఆలస్యం అయ్యాయి. దాంతో మాతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ నుంచి రావాల్సిన వర్క్ ఆర్డర్ సమయానికి రాలేదు. ఏం చేయాలో అర్థంకాలేదు. ఆ రబ్బరుపొడిని ఎవరికి అమ్మను? ఏపీలో ఎవరూ దీన్ని కొనేవారు కాదు. దీంతో తమిళనాడు, కేరళలోని టైర్ల తయారీ సంస్థలు కొంటాయని తెలిసి వాళ్లను సంప్రదించా. చివరకు టీవీఎస్ సుందరం సంస్థ కొనడానికి ఒప్పుకుంది. అయితే విశాఖ నుంచి సరకును పాండిచ్చేరిలోని సుందరం సంస్థకు రవాణా చేయాలంటే కాస్త ఖర్చు ఎక్కువే. పైగా స్థానిక ధరకే సరఫరా చేయాలి. దీంతో మాపై ఎక్కువ భారం పడింది. లాభాలు లేవు. అయినప్పటికీ పరిశ్రమను ఖాళీగా ఉంచడం ఇష్టంలేక, మమ్మల్ని ప్రోత్సహించడానికి వర్క్ ఆర్డర్ ఇచ్చిన టీవీఎస్ సంస్థకు సరకు అమ్మేవాళ్లం. ఆ తర్వాత 2015లో హింకాల్తోపాటు మరికొన్ని సంస్థలూ ముందుకు రావడంతో మా కష్టాలు కొంత తీరాయి. ఇప్పుడు ఆర్టీసీ ఆన్లైన్ వేలంలో పాత టైర్లను కొనుగోలు చేసి మా పరిశ్రమలో వాటిని పొడిగా మారుస్తున్నాం. మా సంస్థలో సుమారు 30 మందికి పని కల్పించడమే కాకుండా రోజుకు ఏడు టన్నుల రబ్బరు పొడిని తయారుచేసే స్థాయికి చేరుకున్నాం. ఆ రబ్బరుని ఉపయోగించి పొడే కాదు మ్యాట్లూ, ఇతర రబ్బరు ఉత్పత్తులు తయారుచేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా పారిశ్రామికవేత్తలకు అందించిన అవార్డుల్లో ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నా. తాజాగా హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకూ హాజరయ్యా
🙏🙏🙏🙏🙏🙏🙏


