MAAGHA PURANAM -- 15
15వ అధ్యాయము
శిష్యుడు పశ్చాత్తాపము పొందుట
సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించారని శివుడు పార్వతికి తెలియచేసాడు.
నీలకంఠుని పార్వతీ దేవి -
“నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియచెప్పారు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడు ఏమైనాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వినకుతుహలముగా ఉన్నద” ని కోరగా శివుడు ఈ విధముగా చెప్పసాగాడు.
“సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము కలిగింది. తాను చేసిన పాపమునకు ఫలితము అనుభస్తున్నాన’ ని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపిని అయ్యాను. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి వెళుతుండగా దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుకుంటూ నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చి, నేను అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా మెల్లగా నాచెంత చేరి నన్ను మంచిమాటలతో వంచించి తన కామవాంఛ తెలియచేసింది. నేను అందుకు ఒప్పుకోలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని “నాతో నీవు క్రీడించపోతే నీ ఎదుటనే ప్రాణత్యాగము చేస్తాన” ని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజముగా ఆమె ప్రాణత్యాగము చేసుకున్నచో మీరు నన్ను దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపము అనుభవిస్తున్నాను. నేను ఎటుల పాపరహితుడను కాగలనో సెలవిమ్మ” ని బ్రతిమాలాడు.
శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి తన కుమార్తె వలె తన శిష్యుని గూడ పాపరహితుని చేయాలని ఎంచి “సుమిత్రా! నీపాప కర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నువ్వు మావలె పాపరహితుడవు కాగలవు. నువ్వు గంగానదీ తీరమునకు వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరములు తపస్సు చెయ్యి. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్లు నశించిపోతుంద” ని శిష్యునికి చెప్పాడు.
“ధన్యోస్మి ధన్యోస్మి” మీ ఆజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణము అవుతున్నాను” అని గురువుగారికి నమస్కారము చేసి గంగానదీ తీరమునకు ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళాడు. అక్కడ మనోహరమైన ఆహ్లాదము ఒనరించు దృశ్యములు కనిపించినవి. కౄరమృగములు, సాధుజంతువులు కలసిమెలసి తిరుగుతున్నాయి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము కనిపించలేదు. ప్రకృతి రమణీయత మనస్సునకు ఆనందము కలిగిస్తున్నది. ఆ ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొనుటకు ఒక వటవృక్షము క్రింద విశ్రమించి నలుదిశల పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగిచూడగా ఆ ఆశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేస్తున్నారు. మధ్యమధ్య శ్రీహరి విగ్రహము పై అక్షతలు వేసి “హరిహరీ”యని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేస్తున్నారు. ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార చూసాడు. పూజ పూర్తయిన తరువాత అందరూ ప్రసాదం సేవించారు. బైట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదము ఇచ్చారు అతడు - “స్వామీ! మీరు ఆచరించిన వ్రతము ఏమిటి ? దీనివలన ఏమి ఫలితము కలుగుతుంది ? మనుష్యుడు పాపరహితుడు అవుతాడా ? నా సందేహములను తీర్చవలసిందని వేడుకొంటున్నాను” అని వినయముగా ఆ మునిసత్తములను అడిగాడు.
పాపముచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అక్కడ ఉన్న వారు మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు వారిలో ఒకరిని నియమించారు. ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను. “విద్యార్థీ! మేము చేసినది మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేసిన పాపములన్నింటినీ నశింపచేయును. రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్ని పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపము లన్నియు నశించిపోతాయి. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు స్నానం చేయు మనుష్యుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నానము ఒనర్చువారు వైకుంఠ వాసులు అవుతారు. అలాగ చేయనివాడు, అసత్యములు పలికేవాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమర్ధము ఉండు చోట మలమూత్రములను విడచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానము. దైవసంబంధమగు ధనమును అపహరించు వాడు, ఏ పుణ్య దినములలోనైన శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానము ఇస్తానని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించు వాడు, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసినవారితో సమానులు. ఇవిగాక అన్నభార్యను సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడు, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడు, జీవహింసలు చేయువాడు, బీదప్రజలను హింసించువాడు, దోపిడీలు చేయువాడు మహాపాతకులు. వారు కూడా బ్రహ్మహత్య చేసినవారితో సమానులు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించు వాడు, వివాహ సంబంధములు చెడగొట్టు వాడు, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడు, శరణుకోరిన వానిని దండించు వాడు, ధర్మ కార్యములకు విఘ్నములు కలిగించు వాడు, పరధనం అపహరించు వాడు, చేసిన మేలు మరచిన కృతఘ్నుడు, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని జూచి ఎగతాళి చేయువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానము.
మేము ఆచరించినది మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నా అవి నశించిపోతాయి. ఇది ముమ్మాటికీ నిజం. అందుచేతనే మేమందరం మాఘమాసవ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నాము. మాఘమాసం ప్రారంభము కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి, నీళ్ళు విడఛి పెట్టి, తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజచేసి తులసితీర్థము, ప్రసాదము పుచ్చుకోవాలి. ఆవిధముగా మాసాంతము వరకు ఆచరించిన వానికి అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత. ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలము నిచ్చువాడు అతడే గనుక వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీతీరమునందు గానీ, చెరువు దగ్గరగానీ విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళముతోను, కస్తూరి, గంధము, అగరు ధూపదీప నైవేద్యం, ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము చేయాలి.
ఈవిధముగా మాఘమాసమంతా చేసి మాస అంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండివంటలతో భోజనము పెట్టాలి. ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసినయెడల ముక్కోటి దేవతలు సంతోష పడతారు. వారి అంత్య కాలమున యముడు తన దూతలను వారి వద్దకు పంపడు. పునర్జన్మ కలుగదు. ఈ నా వచనములు అసత్యములు కావు. ఇప్పటివరకూ మాఘస్నాన ఫలితమంతయు విన్నావు గదా! ఇక మాఘమాసం మూడు దినములు మాత్రమే ఉన్నది. ఈ మూడు దినములలోను ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు అవవలసింద” ని మునీశ్వరుడు తెలియచేసాడు.
అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాపపరిహారార్ధము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పారని మునీశ్వరునితో చెప్పగా – మరల ఆ ముని -
“నీ గురువు చెప్పిన విషయం యదార్థము నువ్వు గురువు పుత్రికతో గూడి రతి సల్పినావు. అందు నీదోషమేమియు లేకపోయినా మహాపాపము మాత్రము సంక్రమించింది. అది నిన్ను వెంటాడుతూ ఉన్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడా నరకబాధలు తప్పవు. ఈ మాఘమాసమందలి మిగిలిన మూడు దినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించు. తరువాత నువ్వు గంగా తీరమునకుపోయి నీ గురువు చెప్పినవిధముగా భక్తితో తపస్సు చేసిన నీవు జన్మ రాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు చంచల స్వభావము గలది. నువ్వు ఇంద్రియములన్నింటిని బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీ నారాయణుని ధ్యానించు” అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడు దినములుండి మాఘస్నానములు చేసి నదీతీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనమును చేసాడు. తదనంతరము ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగానదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాడు.
#🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞 #ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి 🙏🏻 # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః #☸🙏సూర్యనారాయణ స్వామి


