ShareChat
click to see wallet page
search
*_శ్రీ మహావిష్ణు పురాణం_* *_ఐదవ భాగం_* *_శ్రీ మహావిష్ణువు జననం:_* *కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన కృష్ణాదేవి గర్భం ధరించింది. శత మన్వంతరాల కాలం వరకు గర్భాన్ని మోసి ఒక మగశిశువుకి జన్మ నిచ్చింది. శత మన్వంతరాల కాలం గర్భం మోయడం వలన అలసి సొలసిన కృష్ణాదేవి ఆ మగశిశువుని చుట్టూ నిండి ఉన్న జలధిలోకి వదిలివేసింది. ఆ మగ శిశువు ఒక వటపత్రం మీద తేలుతూ నీటిలో ముందుకు సాగాడు*. *కృష్ణుడికి కృష్ణాదేవి జలధిలో శిశువుని వదిలేయడం నచ్చలేదు*. *“కన్నబిడ్డను జలధిలో వదిలి వేసినందుకు గాను నీకు, నీ అంశతో జన్మించబోయే అప్సరసలకు సంతానం కలుగదు!” అని శాపమిచ్చాడు.* *కృష్ణాదేవి పశ్చాత్తాపం చెంది శరణు వేడింది.* *కృష్ణుడు శాంతి చెంది మన్నించాడు. సృష్టి కృష్ణాదేవి వలన ముందుకు సాగదు అనుకుని ఆమె వంక చూశాడు.* *ఫలితంగా కృష్ణాదేవి జిహ్వాగ్ర భాగం నుండి ధవళ (తెలుపు) స్వరూపిణి, శ్వేతవస్త్రధారిణి, వీణాపుస్తక ధారిణి అయిన "మహాసరస్వతి" ఆవిర్భవించింది. కృష్ణాదేవి కృష్ణుడిలో కలసిపోయింది. సర్వశాస్త్రాధి దేవత యైన మహాసరస్వతి వామభాగం నుంచి ‘లక్ష్మీదేవి’, దక్షిణ భాగం నుంచి ‘రాధాదేవి’ అవతరించారు*. *మహాజలథి లో తేలుతూ వెళుతున్న బాలశిశువు ఆకలి కలిగి కళ్ళు తెరచి రోదించసాగాడు. రోదన విన్న కృష్ణుడు శిశువు ముందు ప్రత్యక్షమైనాడు. తేజోరూపం చూసి శిశువు ఆకలి, దుఖం మరచి విప్పారి చూడసాగాడు*. *కృష్ణుడు ఆ శిశువు వంక చూసి “నాయనా! నా తేజస్సులో పదహారవ అంశయైన నీవు నాతో సమానుడవై ఉంటావు. నీకు ఆకలిదప్పులు, దుఖభయాలు, జరామరణాలు ఉండవు*. *అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ రోమకూపాల నుంచి ఉద్భవిస్తాయి. నీవు సమస్త విశ్వంలో ఉంటావు. సమస్త విశ్వము నీలో ఉంటుంది. సమస్త విశ్వానికి ఆధారభూతుడవైన నీవు ‘మహావిష్ణువు’ నామంతో ప్రసిద్ధి పొందుతావు. నీటిని నారములు అంటారు. నారములలో నివసిస్తావు కనుక నిన్ను ‘నారాయణుడు’ అంటారు. సమస్త విశ్వము నీలోనే ఉంటుంది కనుక ‘విశ్వవిరాట్ పురుషుడు’ గా విరాజిల్లుతావు*. *అండ పిండ బ్రహ్మాండాలకు ఆధారమూర్తివైన నీకు సకల శక్తులు ప్రసాదించే షడక్షర మహామంత్రం ‘కృష్ణమంత్రం’ ఉపదేశిస్తాను.”* *వింటున్న బాల విష్ణువు చేతులు జోడించి మంత్రోపదేశానికి సిద్ధం అయ్యాడు*. *సంసిద్ధుడైన విష్ణువుకి చతుర్భుజాలు, పట్టుపీతాంబరాలు, కిరీటాది స్వర్ణాభరణాలు అలంకరించాయి. కృష్ణుడు ముందుకు వంగి శిశువు కుడిచెవిలో షడక్షర మహామంత్రం ‘ఓం కృష్ణాయ స్వాహా’ ఉపదేశించాడు*. *మంత్రోపదేశం పొందగానే బాల శిశువు దేహం దివ్య తేజస్సుతో ప్రకాశించింది*. *వాత్సల్యముతో శిశువు వంక చూసి కృష్ణుడు "నాయనా! ఈ షడక్షర మహామంత్రం జపిస్తూ తపస్సు చేయుము. ఈ మహావిశ్వానికి రక్షకుడివి, పోషకుడివి, విరాట్ స్వరూపుడివి అవుతావు. తిరిగి సకల విశ్వం నాలో మహాలయం పొందేవరకు, అనేక కల్పాంతాలు, యుగాంతాలు కాలచక్ర భ్రమణంలో కలసిపోతున్నా, సకల బ్రహ్మాండాలకు నీవే సృష్టి స్థితి లయ కర్తగా ఉంటావు*. *ఈ జగత్తుకి ఆద్యుడు, ఆధారుడవైన నీవు జగత్తు రక్షణ కోసం అనేక అవతారాలు ధరిస్తావు. నీ నామము ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంగా జపించబడి సమస్త ప్రాణులకు శుభములు చేకూరుస్తుంది. అనేక మహత్తులు నీకు సహజ లక్షణాలుగా ఉంటాయి”. అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.* *వటపత్ర సాయి రూపంలో ఉన్న మహావిష్ణువు అష్టాక్షరీ మహామంత్రం జపిస్తూ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సిద్ధి పొందాడు. చాలా కాలం తపస్సు చేయడం వలన అలసిన విష్ణువు విశ్రమించాడు. అలసిన విష్ణువు స్వేదజలంతో పాటు ఒక్కొక్క రోమకూపం నుండి ఒక్కొక్క అండము వెలువడ్ఢాయి. అలా కోట్లాది అండాలు వెలువడి కలసిపోయి ఒక బ్రహ్మాండం రూపొందింది*. *మహావిష్ణువు నిద్రలో ఉండటం వలన, ఆ బ్రహ్మాండం చైతన్య రహితంగా ఉండిపోయింది*. *వేల సంవత్సరాలు అలా విశ్రాంతి తీసుకుని విష్ణువు స్వస్థుడై నిద్ర లేచాడు. సృష్టి పొందిన బ్రహ్మాండంలో నారాయణుని దేహము వ్యాపించి దివ్వతేజస్సుతో బ్రహ్మాండం ప్రకాశించింది. తన ఎదురున్న బ్రహ్మాండాన్ని విష్ణువు తన బోటనవ్రేలితో రెండు భాగాలుగా విభజించాడు. చీలిన రెండు భాగాలకి మధ్య జలరాశి నీరు ఉధృతంగా రావడంతో బ్రహ్మాండం క్రింది భాగము నీటిలో మునిగింది. పై భాగంలో మహావిష్ణువు సంకల్పంతో ఏడు ఊర్థ్వలోకాలు ఏర్పడ్డాయి. నీటిలో మునిగిన క్రింది భాగంలో ‘ఆరు అధోలోకాలు’ ఏర్పడ్డాయి*. *బ్రహ్మాండంలో గల కోట్లాది అండాలు కూడా రెండు రెండు భాగాలుగా విడిపోయి ఊర్థ్వ అధోలోకాలు ఏర్పడ్డాయి*. *సప్త ఊర్థ్వలోకాల పైన ఏర్పడిన గోలోకాన్ని కృష్ణుడు రాధాదేవితో కలసి తన నివాసంగా చేసుకున్నాడు.* *కృష్ణుడి సంకల్పంతో రోమముల నుండి అతని వలె రూప దేహములు కల వెయ్యి మంది పార్షాదులు (గోపాలురు) జన్మించి సేవకులు అయ్యారు*. *రాధాదేవి శరీరం నుండి కూడా వేయి మంది పార్షద గోపికలు జన్మించి చెలికత్తెలు అయ్యారు*. *లోకాలను సృష్టించిన మహావిష్ణువు ఆ లోకాలలో చరాచర జీవులను సృష్టించ సంకల్పించాడు. తనకు అటువంటి శక్తిని ఇమ్మని పరమాత్ముడైన కృష్ణుడిని తలచాడు.* *కృష్ణుడు మహాసరస్వతి నుండి ఉద్భవించిన మహాలక్ష్మిని విష్ణువుకి తోడుగా పంపాడు.* *మహాలక్ష్మి వచ్చి నారాయణుడి వక్షస్థలమందు నివాసము ఏర్పాటు చేసుకుంది*. *శ్రీ లక్ష్మీ వచ్చి చేరడంతో నారాయణుడు సిరి సంపదలు పొంది ‘శ్రీ లక్ష్మీనారాయణుడు’ అయ్యాడు.* *శ్రీమహావిష్ణువు వక్షస్థల నివాసియై* *‘శ్రీ మన్మహాలక్ష్మి’ అయ్యింది* #మన సంప్రదాయాలు సమాచారం