ShareChat
click to see wallet page
search
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *శివార్చనలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మంత్రానికి తెలుగులో అర్థం* నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ! మహాదేవాయ! త్రయంబకాయ! త్రిపురాన్తకాయ! త్రికాగ్నికాలాయ! కాలాగ్నిరుద్రాయ! నీలకంఠాయ! మృత్యుంజయాయ! సర్వేశ్వరాయ! సదాశివాయ! శ్రీమన్మహాదేవాయనమః🙏🏼 నమస్తే అస్తు భగవన్ భగవన్: ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం కలిగినవాడా! ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలిసినవాడా! శివా ! తే= నీకు, నమః= నమస్కారం. అస్తు= ఉండు గాక ! విశ్వేశ్వరాయ: విశ్వమునకు అధిపతి అయిన వానికొరకు ( నమస్కారం) మహాదేవాయ: దేవతలకు దేవతయిన వానికొరకు ( నమస్కారం) అపరిమితముగా ప్రకాశించే వానికొరకు ( నమస్కారం) త్రయంబకాయ: చంద్రసూర్యాగ్నులు కన్నులుగా కలవానికొరకు ( నమస్కారం) గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలిసిన వానికొరకు ( నమస్కారం) త్రిపురాన్తకాయ: కమలాక్షుడికీ, తారకాక్షుడికీ, విద్యున్మాలికీ బ్రహ్మ మెచ్చి ఇచ్చిన మూడు నగరాలు కలసి త్రిపురం. ఈ మూడు పురములను నాశనము చేసినవానికి నమస్కారం. (రథం, బాణం వర్ణన "త్రిపుర సంహార ఘట్టం" లోనిది). త్రిపుర సంహారమప్పుడు తేరు భూమి, చక్రములు సూర్యచంద్రులు, గుఱ్ఱములు వేదములు, చాపము మేరువు, నారి శేషుడు, బాణము విష్ణువు. ఇది భౌతికమైన యుద్ధం మాత్రమే కాదు, మనిషిలోని మూడు గుణాలను (సత్వ, రజో, తమో) లేదా మూడు అవస్థలను (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) దాటించి మోక్షాన్ని ఇచ్చే స్థితికి సంకేతం. త్రికాగ్ని కాలాయ: భూత, వర్తమాన మరియు భవిష్యత్తులతో కూడిన మూడు కాలములనే అగ్నిని మ్రింగివేసే వానికొరకు ( నమస్కారం). మరో మాటలో చెప్పాలంటే, అతను కాలానికి అతీతుడు, అతను కాలాన్ని సృష్టించేవాడు, పోషించేవాడు మరియు నాశనం చేసేవాడు. కాలాగ్ని అనగా అందరిని దహించు ప్రళయాగ్ని. త్రేత్రాగ్నులకు (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులకు) కాల స్వరూపుడైన వాడు అని మరొక అర్థం. కాలాగ్నిరుద్రాయ: అందరిని దహించు ప్రళయాగ్ని రూపములో ఉన్న అనగా సర్వ సంహార కర్త అయిన రుద్రుని కొరకు ( నమస్కారం). రుద్రః శబ్దానికి ఏడిపించువాడు అనిఅర్థం. మరో మాటలో చెప్పాలంటే శివుడూ శిక్షించేవాడు, కర్మఫలదాత, కర్మఫలాలను ఇచ్చేవాడు. 84 కోట్ల ప్రాణులనీ వాటికి సంబంధించిన వివిధ వివిధ ఆహారాలనీ, అవి నిత్యం తినబడుతూంటే తరిగిపోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చిగురించే మొక్కల్నీ (హరికేశేభ్యః...), ఇక ఒకే ఆహారపదార్థం కాకుండా ఒక్కో ప్రాణికీ అనేక ఆహార పదార్థాలనీ మనుష్యులకి యవలు మినుగులు నువ్వులు గోధుమలు - (యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే గోధూమాశ్చమే) ఇలా అడక్కుండా నేనిస్తూంటే, ఈ ద్రవ్యాలని సద్వినియోగ పరుచుకోకుండా ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారనీ ద్వేషం, అసూయ, పగ... మొదలైన వాటితో ఎందుకు ఐకమత్యంతో ఉండటం లేదనీ ఆయన తన కన్నులని ఎర్రజేస్తే, ఆ ఎర్రని కన్నులు ‘రుద్రు’ డనే పేరుని తనకి రప్పించాయి. ఆ పేరుని మన ప్రవర్తన ద్వారా మనం ఆయనకి తెప్పించాం తప్ప ఆయన ఎప్పుడూ (స్మేరాననః) చిరునవ్వుతో కనిపించే బేల శంకరుడు. (బోళా శంకరుడని లోకానికొచ్చింది. అమాయకుడని సరైన అర్థం. నీలకంఠాయ: నీలవర్ణపు కంఠము కలవాని కొరకు ( నమస్కారం) సూర్యుణ్ని గాని తేరిపార చూస్తే సూర్యబింబం ముందుగా మరింత ఎర్రగా కన్పిస్తుంది (వి-లోహితః) . అలా చూస్తూన్న దశలో ఎర్రని రంగులో నీలిరంగు గుండ్రని బిళ్ల కూడా కనిపిస్తుంది (నీల - గ్రీవః). నీలిరంగు అనేది జలానికి సంకేతం. అందుకే సముద్రాలని గుర్తించే సందర్భంలో దేశ పటాల్లో సముద్రానికి నీలి రంగుని పులుముతారు. మరో విశేషం కూడా ఉంది. నీల-గ్రీవః అంటే నీలిరంగుతో ఉన్నవాడనేది మాత్రమే అర్థం కాకుండా నీలిరంగు కిరణాల ప్రసారం కూడా చేయగల శక్తి ఉన్నవాడని మరో అర్థం కూడా కనిపిస్తుంది. నీలిరంగు అనేది జలానికి సంకేతం కాబట్టే సూర్యుని నుండి పడే కిరణాలు నీటిని పీల్చి మేఘాలని ఏర్పాటు చేస్తాయి. ఆ నీరుపడే ఎండనే నీరెండ అని, అలాంటి నీరెండ పడే కాలంలో నీళ్లని తెచ్చుకునే స్త్రీల గమ్యం (వెళ్లే చోటు) ‘నీలాటి రేవు’ అనీ (నీరు+ఆడు+ రేవు - నీటితో నిండిన కిరణాలు ప్రసరిస్తున్న చెరువు ఒడ్డు) వ్యాఖ్యాన కర్తలు చెప్పారు. ఈ రెండు నామాలనే ఇటు శంకరునిక్కూడా సమన్వయించుకు చూడాల్సి ఉంది. ‘నీల - నీలి' రంగు కల, గ్రీవః - మెడ కలవాడు శివు’డని దీనర్థం. శంకరుడు విషాన్ని స్వీకరించినప్పుడు గుటక వేయకుండా పార్వతి ఆయన కంఠాన్ని పట్టుకుంటే, అక్కడే పేరుకున్న విషం కాస్తా ‘నీలి రంగు’ మచ్చగా మెడమీద నిలిచిపోయింది. శంకరుడు నల్లని కంఠం కలవాడు కాడు. నీలకంఠుడు మాత్రమే. మృత్యుంజయాయ: మృత్యువును జయించినవాని కొరకు ( నమస్కారం) ఈశ్వరుడే సర్వోన్నతుడు అని గ్రహింపబడే వరకు మృత్యువు తానే గొప్పవాడని భావించాడు. దీని గురించి చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. మార్కండేయ కథలో ఈశ్వరుని మృత్యుంజయాంశం చెప్పబడింది. సర్వేశ్వరాయ: సర్వ లోకాల ప్రభువయిన వాని కొరకు ( నమస్కారం) భూః, భువః మరియు సువః. భూః( భూమి) భువః ( అంతరిక్షము) , సువః ( స్వర్గ లోకము) అను మూడింటికి , వివిధ దేవతలతో సహా అన్ని జీవులకు ప్రభువు. సదాశివాయ: ఎల్లపుడు క్షేమం కలిగించేవానికొరకు ( నమస్కారం) మహేశ్వరుడు లయకారకుడు. అంటే చంపేస్తాడని కాదు. స్వల్పకాలిక లయం, ఆత్యంతిక (చాలా ఎక్కువ) ప్రళయం, మహా ప్రళయం అని మూడు లయాలను పరమదయతో చేస్తాడు. అందుకే ఆయనకు ’సదాశివ’ అని వేదం బిరుదిచ్చింది. శ్రీమన్మహాదేవాయ నమః: సంపద కలిగిన శోభ కలిగిన దేవతలకు దేవతయిన వానికే నమస్కారం! అపరిమితముగా ప్రకాశించే వానికొరకు ఈ నమస్కారం!!. గమనిక: నేనుసేకరించిన విషయాన్ని ఆస్తికులైన నా వార్కి ఉపయోగిస్తుందని వితరణ చేస్తున్నా. ఊకదంపుడుగా మనం( నేను) వింటున్న రుద్ర పారాయణలో మంత్రం తదర్థ భావనమ్ యుండాలి గదా! అనే భావనతో ఇలా అర్థభావన కల్పింపచేయ ప్రయత్నించగల్గితిని!!
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat