ShareChat
click to see wallet page
search
*_MAAGHA PURANAM -- 17_* *_17వ అధ్యాయము_* *_కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట_* *మునిశ్రేష్ఠా! నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను*. *మరికొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించింది*. *ఒకనాడు నా భర్త సఖీ! చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నువ్వు నా భార్యవు గావున ఈ మాఘమాసమంత ఈ కావేరీ నదిలో స్నానమాచరించు*. *ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చెయ్యి*. *ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరించు. తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము*. *మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు. దీనివలన నీకు చాలా ఫలము కలుగుతుంది. నీ ఐదవతనము చల్లగా ఉంటుందని హితబోధ చేసాడు*. *నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసాను. నా భర్త శాంత స్వరూపుడయినా నేను హద్దుమీరి మాటలాడుటచేత అతనికి కోపం వచ్చి శపించాడు*. *“ఓసీ మూర్ఖురాలా! నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావని అనుకున్నాను*. *ఇంత దైవద్వేషివని నాకు తెలియదు*. *నువ్వు నాతో ఉండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? నీ పాపము నిన్నే శిక్షింస్తుంది. నువ్వు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావిచెట్టు తొర్రలో మాండూక రూపంలో ఉందువు గాక! అని నన్ను శపించాడు.* *వారి సింహగర్జనకు వణికిపోయి వారి శాపమునకు భయపడి పోయాను*. *వారి రౌద్రాకారమును చూడలేక పోయాను. నాకు జ్ఞానోదయము కలిగింది. నాతప్పు నేను తెలుసుకున్నాను*. *“ ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగి వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదములు పట్టుకొని “నాకు ఈ శాపము ఎలా పోతుంది ? మళ్ళీ నిన్ను ఎలా కలుసుకొంటాను? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరివిధాల ప్రార్థించగా నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టాడు*. *గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన ఆశ్రమమునుండి ఉత్తరదేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ దశమినాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వస్తారు. ఆ సమయములో నీవు వారిని దర్శించిన ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగుతుంది” అని చెప్పుచుండగా నేను కప్పరూపము పొందాను. నాభర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించాడు. నేను కప్పు రూపముతో గెంతుకుంటూ కొన్ని దినములకు కృష్ణానదీ తీరమున ఉన్న ఈ రావిచెట్టు తొర్రలో నివాసమేర్పరచుకొని మీరాకకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు” అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియచేసింది.* *“అమ్మాయీ! భయపడకు. నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయింది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు గడచినది. నీ భర్తయును ఏకాంతముగా చాలాకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నువ్వు తన మాటలు విననందున ఎంత కష్టపడ్డావో తెలిసింది గదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనమైనది కూడా. దీనికి మించిన మరియొక వ్రతము లేదు. ఈ వ్రతము విష్ణుమూర్తికి ప్రియమైనది*. *ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నీభర్త దూరదృష్టిగల జ్ఞాని. అందరు అతని గుణగణాలకు సంతోషించే వారు*. *నిన్ను పెండ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో ఉండేవాడు. కానీ నీవలన అతని ఆశలన్నీ నిరాశలై పోయాయి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నిజరూపము పొందగలిగావు. అందునా ఇది మాఘమాసము. కృష్ణానదీతీరము*. *మాఘమాస వ్రత సమయము నీకు అన్నివిధముల అనుకూలమైన రోజు. నువ్వు వెంటనే శుచివై వచ్చి వ్రతము ఆచరించు. స్త్రీలు గానీ, పురుషులు గానీ ఈ సమయంలో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు*. *ఎవరైనా తెలిసి గానీ తెలియక గానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందు, పాడ్యమి రోజున నదీ స్నానమాచరించిన యెడల వారి పాపములు నశిస్తాయి. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమున, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి, దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్టు వరము ఇస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము విన్న మోక్షప్రాప్తి కలుగునని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాడు* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat