*ఉగాది రోజున ఏమి చేయాలి ఉగాది పచ్చడి ప్రత్యేకత *
1. ఉగాది రోజున సూర్యోదయం కన్నాముందే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి.
2. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.
3. ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగురవేయాలి.
4. నిత్య నైమిత్తిక కర్మలన్నీ ముగించుకోవాలి.
5. ఇష్ట దేవత కుల దేవతలను పూజించుకోవాలి.
6. పంచాంగంను పూజించి ఉగాది పచ్చడి నివేదన చేయాలి.
ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం
*శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ*
*సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥*
*నూతన సంవత్సరాది నాడు నింబ కుసుమ భక్షణం*
నూతన సంవత్సరాది నాడు ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో కూడా మనకు శాస్త్రమే చెప్పింది.
నింబసుమం అంటే వేపపూత. ఉగాదిపచ్చడిలో ఇది ప్రధానంగా ఉండాలి. వేపచెట్టు పరదేవతా స్వరూపం.
వసంతఋతువులో మాత్రమే పూచే వేపపువ్వులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఆ వేపపువ్వును మొదటిగా నీటిలో కలపాలి. బెల్లం మంగళద్రవ్యం. దానికి నిలవ దోషంలేదు. వేపపువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత ఆవునెయ్యి కలపాలి. భగవంతుని పేరిట ఏ వృక్షజాతి లేదు. ఆ అదృష్టం ఒక్క మామిడి చెట్టుకే దక్కింది. ఈ వృక్షాన్ని రసాలవృక్షం అంటారు. భగవంతుడిని రసోవై సః అంటారు. అలాంటి పరమపవిత్రమైన మామిడి ముక్కలను కూడా ఉగాదిపచ్చడిలో కలుపుకోవడం మన సంప్రదాయం. వీటన్నింటి మిశ్రమముతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని మొదట భగవంతుడికి నివేదించాలి.
*శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ న సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణమ్*
నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకుని తొలి యామకాలం దాటకుండానే ప్రసాదం స్వీకరించాలి.
ఈ నైవేద్యాన్ని స్వీకరించిన వారికి ఈ సంవత్సరమంతా సౌఖ్యదాయకముగా భాసిల్లుతుంది.
వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై , సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.
ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-
* అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్*
*భక్షితం పూర్వయామేస్యా తద్వర్షం సౌఖ్యదాయకమ్॥*
ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
తరువాత పెద్దలను గురువులను దర్శించాలి. దైవదర్శనం చేయాలి. గోపూజ, వృషభ పూజ చేయాలి.
మామిడిపళ్ళు,చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేసుకుంటే ఎంతో మంచిది.
#తెలుసుకుందాం #🎈ఉగాది శుభాకాంక్షలు🥳 #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #🤝Have a Good Day🤩


