పుష్య బహుళ పంచమి సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవం సందర్భంగా వారి ఘనరాగ పంచరత్న కృతుల వివరణ
వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం
బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే
సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు.
అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు.
మహా వాగ్గేయకారుడు, అపర నారదుడు, అనుపమ రామభక్తుడు అయిన త్యాగరాజస్వామి వారు ఆ శ్రీరామునిలో ఐక్యమైన రోజు పుష్య బహుళ పంచమి.
ప్రతి సంవత్సరం దీన్ని పురస్కరించుకొని తిరువాయూర్ తో పాటు ప్రపంచమంతా ఐదు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుతారు.
ఆయా ఊళ్లలో కళాకారులు ఆ మహానుభావుని సంకీర్తనలను గానం చేసి ఆయనకు నివాళులు అర్పిస్తారు.
అందులో భాగంగా ఈ పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన ఘన రాగ పంచరత్న కృతులు బృంద గానం చేస్తారు.
కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ఈ ఘనరాగ పంచరత్నాలకు ప్రత్యేకస్థానం ఉంది.
వాగ్గేయకారుని ప్రతిభ, పురాణాలలోని భక్తి, నీతి, వైరాగ్యము వీటిలో పొందుపరచబడ్డాయి. దేశ విదేశాలలోని వారందరూ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో అంతా కలసి ఈ కీర్తనలను ఆలాపించడం ఒక ఆనవాయితీ.
త్యాగయ్య శిష్యుల ద్వారా వాటి బాణీలు ఈనాటికీ చెక్కు చెదరకుండా మన తరానికి అంది ఉన్నాయి.
వీటిని గురించి ఎంతో పరిశోధన జరిగింది. సంగీతము, సాహిత్యము వీటిలో సుమధురంగా మేళవించబడినది గనుకనే వీటికి ఘనరాగ పంచరత్నాలని పేరు వచ్చింది.
అన్ని కీర్తనలూ ఆదితాళంలో ఉన్నాయి. ఎత్తుగడ నుండి చివరివరకూ అంచెలంచెలుగా తారస్థాయినందుకొనే ఈ కీర్తనలు కర్ణాటక సంగీతకారులకు దైవసమానాలు.
ఇంక వాటిలో సాహిత్యం కూడా సొగసుగా తీర్చబడి మోక్షగాములకు దారిచూపే మహోపదేశంగా మన్ననలు అందుకొన్నది.
వీటిలో మొదటిది జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక అనే కృతి
ఈ కృతి నాటరాగంలో కూర్చబడింది. సంస్కృత భాషలో రచించబడినది.
ఈ కృతి 108 నామములతో కూడిన రత్నాల మణిహారం.
ఈ కీర్తనలో తన ఇష్ట దైవమైన శ్రీరామచంద్రుని 108 విశిష్టమైన గుణాలను కీర్తించారు త్యాగరాజ స్వామి.
శ్రీరాముని పరమానంద స్వరూపంగా అభివర్ణించారు.
ఈ విశ్వానికే ఆనందాన్ని ప్రసాదించేవాడు, సకల శుభాలను కలిగించేవాడు అని కీర్తించారు.
శ్రీరాముని వివిధ రూపాలను, రాముని గొప్పతనాన్ని, భక్తులను రక్షించే స్వభావాన్ని ఆయన అనంతమైన గుణాలను వర్ణించారు
ఈ కీర్తనలో మనకి నాలుగవ చరణం లోనే త్యాగరాజ ముద్ర కనిపిస్తుంది.
ముందు నాలుగు చరణాలుగా రచించారట
తర్వాత ఇంకొక మూడు చరణాలు పొడిగించారుట అందుకని మనకు ఏడవ చరణంలో త్యాగరాజ ముద్ర కనిపిస్తుంది.
తదుపరి ఇంకా మూడు చరణాలు పొడిగించి పది చరణాలతో చేశారు .
పదవ చరణంలో అనగా చివరి చరణంలో త్యాగరాజ ముద్ర కనిపిస్తుంది.
2. దుడుకుగల.
రాగం. గౌళ
మానవ జీవితంలోని తప్పులు, అజ్ఞానాన్ని త్యాగరాజు తనపైనే వేసుకుని వాటినుండి తనను రక్షించమని రాముడిని వేడుకుంటారు. తనలోని లోపాలను అంగీకరిస్తూ పాడుతారు.
3. సాధించెనే.
రాగం . ఆరభి
ఈ కృతిలో త్యాగరాజ స్వామి శ్రీకృష్ణుని లీలలను వర్ణించారు
4. కనకన రుచిరా
రాగం . వరాళి
రాముని అద్భుతమైన సౌందర్యాన్ని ఆయన దివ్యమైన రూపాన్ని కనులారా తిలకించి తీరని ఆనందాన్ని పొందుతానని ఆ ఆనందం వర్ణనాతీతమని వర్ణిస్తారు.
5. ఎందరో మహానుభావులు
రాగం. శ్రీ
ఈ కృతిలో త్యాగరాజ స్వామి సంగీత ,సాహిత్య, భక్తి రంగాలలో ఉన్న గొప్ప వారిని మహానుభావులను స్మరిస్తూ వారిని ప్రశంసిస్తూ రాముని దివ్యత్వానికి కీర్తిస్తారు.
ఇది గురువు వెంకటరమణయ్య గారి సభలో పాడినట్లు చెబుతారు .
ఈ ఐదుకృతులు కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఘనరాగ పంచ రత్న కృతులుగా ప్రసిద్ధి చెందాయి.
వీటిని పాడడం ద్వారా సంగీతకారులు భక్తులు గొప్ప ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారు.
#🌅శుభోదయం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️త్యాగరాజ ఆరాధన శుభాకాంక్షలు🎶 #🕉️త్యాగరాజ కీర్తనలు🎶


