*డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఉద్రిక్తత: ఎస్ఐని ఢీకొట్టిన కారు* #🆕Current అప్డేట్స్📢
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నప్పుడు సంచలన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నడిపిన కారు సుమారు 100 కి.మీ. వేగంతో దూసుకొచ్చి, తనిఖీలు నిర్వహిస్తున్న సబ్-ఇన్స్పెక్టర్ (SI) మధును ఢీకొట్టింది.
ఎస్ఐ మధు కారును ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆయనపైకి దూసుకెళ్లాడు. ఆ ప్రమాదకర స్థితిలో ఎస్ఐ కారు బోనెట్పై పడిపోగా, నిందితుడు కారును ఆపకుండా అలాగే సుమారు 400 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.
కారు వేగం తగ్గిన వెంటనే ఎస్ఐ మధు చాకచక్యంగా కిందకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు. తోటి పోలీసులు వెంటనే స్పందించి ఆయనను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు నంబర్ను గుర్తించి, ఇబ్రహీంపట్నం సమీపంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో, నిందితులు మద్యం మత్తులో ఎస్ఐపై హత్యాయత్నం చేసినట్టు తేలింది. వారిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు హత్యాయత్నం వంటి కఠిన కేసులు నమోదు చేశారు.


