కకన్నతల్లి చిరునవ్వు కోసం.. ఒకటిన్నర కిలోమీటర్లు "అమ్మ"ను భుజాలపై మోస్తూ!
ప్రకృతి అంటేనే ఒక అద్భుతం. ఆ ప్రకృతిలో కొన్ని దృశ్యాలు చూడటానికి దశాబ్దాల కాలం వేచి చూడాలి. అలాంటిదే పన్నెండేళ్లకు ఒకసారి వికసించే నీలకురింజి పూల సోయగం. కేరళలోని మున్నార్ కొండలు ఈ అరుదైన నీలి రంగు పూలతో నిండిపోయి, ఊదారంగు తివాచీ పరిచినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూడాలని ఆశపడింది 87 ఏళ్ల ఓ బామ్మ. ఆమె కోరికను తీర్చడానికి ఆమె కుమారులు చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
కన్నతల్లి కోరిక.. కుమారుల పోరాటం
కొట్టాయం జిల్లాకు చెందిన ఎలికుట్టి పాల్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇడుక్కి జిల్లాలోని కల్లిపారా కొండల్లో నీలకురింజి పూలు వికసించాయని తెలుసుకున్న ఆమె, ఆ దృశ్యాన్ని ఒక్కసారైనా చూడాలని తన కొడుకులకు మనసులో మాట చెప్పారు. తల్లి మాటను వేదంగా భావించిన కుమారులు రోజన్, సత్యన్ ఏమాత్రం ఆలోచించలేదు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడుక్కికి తన తల్లిని జీపులో తీసుకువెళ్లారు.
భుజాలపై మోసి.. శిఖరాన్ని చేర్చి
తీరా కొండ కిందకు చేరుకున్నాక వారికి అసలు సవాలు ఎదురైంది. అక్కడి నుండి పైకి వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. వయసు మళ్లిన తల్లి అంత దూరం నడవలేదు. కానీ ఆ కుమారులు వెనకడుగు వేయలేదు. పట్టుదలతో తమ వృద్ధ తల్లిని తమ భుజాలపై ఎత్తుకున్నారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర కొండ దారుల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఆమెను శిఖరం పైకి తీసుకెళ్లారు. నీలిరంగులో మెరుస్తున్న ఆ పూల తోటను చూసినప్పుడు ఆ తల్లి కళ్లలో కనిపించిన ఆనందం, ఆ కుమారుల శ్రమను మర్చిపోయేలా చేసింది.
నీలకురింజి ప్రత్యేకత ఏమిటి?
ఈ పువ్వులు కేవలం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న షోల అడవుల్లో మాత్రమే పెరుగుతాయి. ఇవి పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే పూయడం వీటి ప్రత్యేకత. మున్నార్లో 2018లో పూసిన ఈ పూలు, మళ్లీ ఇప్పుడు కల్లిపారా కొండల్లో పది ఎకరాల విస్తీర్ణంలో విరబూశాయి. మళ్లీ ఈ దృశ్యం మున్నార్లో 2030లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఈ అరుదైన పువ్వుల పేరు మీద ఒక దేవాలయం కూడా ఉండటం విశేషం.
ప్రకృతి ప్రేమికులే కాదు, సమాజం అంతా ఈ సోదరులను కలియుగ శ్రవణ కుమారులుగా కొనియాడుతోంది. తల్లిదండ్రుల చిన్న చిన్న కోరికలను తీర్చడమే పిల్లలు ఇచ్చే గొప్ప బహుమతి అని ఈ ఘటన నిరూపించింది.
#wow #వావ్ #ఫెయిల్యూర్ మోటివేషన్ #👩🍼అమ్మకు ప్రేమతో


