P.Venkateswara Rao
#వై ఎస్ జగన్మోహన్ రెడ్డి #వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఏపీ అప్డేట్స్ 🎯
*జగన్లో మార్పు.. టీడీపీలో తీవ్ర అసహనం❗*
26.08.2026🎯
మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
లో మీడియాకి సంబంధించి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. అధికారం పోయిన తర్వాత, తాను చేసిన తప్పేంటో జగన్కు అర్థమైనట్టుంది.
తన పాలనలో చేసిన మంచి పనుల గురించి చెప్పుకోకపోవడం, అలాగే రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణల్ని తిప్పి కొట్టడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం. దీనివల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆలస్యంగా అయినా జగన్ గ్రహించారు. అందుకే ఇటీవల కాలంలో ఆయన తరచూ మీడియాతో మాట్లాడ్డం, అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు.
జగన్లోని ఈ మార్పు టీడీపీని తీవ్ర అసహనం, ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తాము ఎంత తీవ్రమైనా విమర్శలు చేసినా, వైఎస్ జగన్ నుంచి గతంలో ఎలాంటి స్పందన రాలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడలా కాదు. టీడీపీని నిత్యం ఏదో రకంగా జగన్ తప్పు పడుతూనే వున్నారు.
మూడు రోజుల క్రితం జగన్ సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీలో అక్రమాలపై మరోసారి సుదీర్ఘంగా మాట్లాడి, అనేక వివరాలను ఆయన ప్రజల ముందు వుంచారు. గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారని, డీఎస్సీతో పాటు ఆ రిక్రూట్మెంట్పై కూడా సీబీఐతో విచారణ చేయించాలని టీడీపీకి జగన్ సవాల్ విసిరారు. దానిపై ఇంత వరకూ కూటమి నుంచి ఎలాంటి జవాబు లేదు.
ఇవాళ మరోసారి ఆయన మీడియా ముందుకొచ్చారు. ప్రధానంగా మూడు అంశాల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో తరుముకొస్తున్న కరువు, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనలో టీడీపీ మోసకారితనం, అలాగే పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారడంపై మాట్లాడనున్నట్టు ప్రకటించారు.
ఒక్కో అంశంపై తనదైన రీతిలో గణాంకాలతో సహా వివరిస్తూ చంద్రబాబు సర్కార్ను ఎండగట్టే ప్రయత్నం చేశారు. బీసీలకు తాము 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, గతంలో స్థానిక సంస్థలను వెళ్లాలని అనుకున్నట్టు జగన్ వివరించారు. అయితే చంద్రబాబు తన మనిషితో కోర్టులో పిటిషనర్ వేయించి అడ్డుకున్నట్టు వివరించారు. బీసీల రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లేది, వద్దని చెప్పేది చందక్రబాబే అన్నారు. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే అని ఆయన ఎద్దేవా చేశారు.
బీసీల విషయంలో చిత్తశుద్ధి తమకుందని ఆయన అన్నారు. ఏపీలో కరువు డేంజర్ బెల్స్ మోగిస్తోందన్నారు. కరువును గుర్తించడానికి చంద్రబాబు సర్కార్కు మనసు రావడం లేదన్నారు. జూన్, జూలైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని జగన్ అన్నారు. కూటమి పాలనలో ఇప్పటి వరకు రైతులకు సుమారు రూ.3 వేల కోట్లు నష్టం జరిగిందన్నారు. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని ఆయన మండిపడ్డారు.
తమ కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. కేబినెట్లో 40 శాతం వాటా బీసీలకే ఇచ్చామన్నారు. 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపంది తామే అన్నారు. అలాగే రెండు డిప్యూటీ సీఎం పదవుల్ని బీసీలకే ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో అత్యధిక సీట్లు బీసీలకే ఇచ్చినట్టు గణాంకాలతో సహా ఆయన వివరించారు.
ఒకవైపు తప్పుడు కేసులు, మరోవైపు వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ఇంకోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని జగన్ మండిపడ్డారు. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. విలువైన భూముల్ని కొల్లగొడుతున్నారని ఆయన అన్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్షాపుల దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారని తప్పు పట్టారు. అద్దంకిలో మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారన్నారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయని జగన్ అన్నారు. డ్రైవర్తో సహా మరో ఇద్దరు పోలీసులు మత్తులో ఉన్నారని ఆయన చెప్పారు. జనం వీడియోలు తీస్తుంటే సీఐ బెదిరించారని జగన్ గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని జగన్ ప్రశ్నించారు.
అద్దంకి ఘటనే కాదు, కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇలా అనేక అంశాలపై సమగ్ర వివరాలతో జగన్ మాట్లాడ్డం టీడీపీకి తీవ్ర అసహనం తెప్పిస్తుంది. జగన్కు తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్లు ఇవ్వడానికి మొత్తం కేబినెట్ రంగంలోకి దిగాల్సి వస్తోంది.