P.Venkateswara Rao
#ఏపీ అప్డేట్స్ 🎯 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*రాజకీయ సమాధి కట్టుకున్న మాగుంట❗*
01.09.2026🎯
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందని అంటారు. నోరు అదుపులో లేకపోతే, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నోళ్లు, నోరు ఎంతగా అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. రాజకీయాల్ని వ్యాపారంగా చూసే నాయకులైతే, చాలా లౌక్యాన్ని ప్రదర్శిస్తుంటారు.
రాజకీయాల్లో మోతాదుకు మించి లౌక్యాన్ని ప్రదర్శించే వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్రెడ్డి అగ్రగణ్యుడు.
అయితే ఆయన బుర్రలో ఏం పాడుబుద్ధి పుట్టిందో కానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. తద్వారా తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్పై నోరుజారి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై వుండగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆయన తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మూర్ఖుడు వాడు అంటూ జగన్పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. మాగుంట శ్రీనివాస్రెడ్డి ఎప్పుడూ ఇలా మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకే అందరిలో ఆశ్చర్యం. మన కులపోడని జగన్కు ఓట్లు వేశారంటూ ఆయన ఏదేదో మాట్లాడారు. అసలు మాగుంట బలమే రెడ్డి సామాజిక వర్గం. అలాంటిది వైఎస్ జగన్ను ఉద్దేశించి వాడు, మూర్ఖుడు లాంటి అనుచిత వ్యాఖ్యలతో ముఖ్యంగా రెడ్లు, అలాగే వైఎస్సార్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ మాగుంటపై రగిలిపోతున్నారు.
సీఎం ఎదురుగా వుంటే, ఒళ్లు తెలియకుండా జగన్పై అంతేసి మాటలు మాట్లాడుతారా? అంటూ నిలదీస్తున్నారు.
2014లో ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంట టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.
2019లో వైసీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో సిట్టింగ్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కాదని మాగుంటకు జగన్ సీటు ఇచ్చి, గెలిపించుకున్నారు. ఆ విశ్వాసం కూడా లేకుండా, జగన్పై నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఏంటని మాగుంటను తీవ్రస్థాయిలో నిలదీస్తున్నారు.
మాగుంట వృత్తిరీత్యా వ్యాపారి, కాంట్రాక్టర్. నిత్యం ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం వారు అర్రులు చాస్తుంటారు. అందుకే రాజకీయంగా ఎప్పుడూ ప్రత్యర్థులపై చిన్న విమర్శ చేయడానికి కూడా సాహసించరు. వైసీపీ ఎంపీగా చంద్రబాబు, ఆయన పార్టీ నేతల తప్పుల్ని ఎత్తి చూపాలని మాగుంటను ఆ పార్టీ పెద్దలు ఆదేశించారు. అయితే తమ కుటుంబానికి అలాంటి అలవాటు లేదని అప్పట్లో తప్పించుకున్నారు. సీఎం చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేయమన్నారంటూ, అందుకే పార్టీ నుంచి బయటికొచ్చానని మాగుంట ప్రకటించుకున్నారు.
మరిప్పుడు, నాటి పెద్దరికం, హుందాతనం ఏమైందనే ప్రశ్నకు మాగుంట వద్ద సమాధానం వుందా?
అప్పట్లో చంద్రబాబుపై విమర్శలు చేయమన్నారే తప్ప, ఇప్పటిలా అవాకులు చెవాకులు పేలాలని ఎవరూ ఆదేశించలేదు. మరిప్పుడు జగన్పై వాడు, మూర్ఖుడు లాంటి మాటలు ఎలా మాట్లాడారంటూ మాగుంటను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
మాగుంట అంటే పెద్ద మనిషి అనే పేరు వుంది. అలాంటి మాగుంటకు ఏం ఇబ్బంది వచ్చిందో, ప్రభుత్వ పెద్దలతో ఎలాంటి అవసరాలు ఏర్పడ్డాయో తెలియదు. ప్రభుత్వ పెద్దల దగ్గర మన్ననలు పొంది, అత్యధిక ప్రయోజనాలు పొందాలనే ఆశతో అవాకులు చెవాకులు పేలారనే చర్చకు తెరలేచింది.
ఆ మధ్య చెన్నైలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడి తనయుడి వివాహ వేడుకకు మాగుంట వెళ్లారు. జగన్తో సన్నిహితంగా మెలగడానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో వైసీపీలో మాగుంట చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే పాజిటివ్ టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో, మాగుంట పార్టీ మార్పు ప్రచారానికి బలం వచ్చింది.
బహుశా ఆ ప్రచారం నుంచి బయట పడేందుకు, చంద్రబాబు, లోకేశ్ దగ్గర నమ్మకం సంపాదించుకునేందుకు… జగన్పై మాగుంట అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం మాగుంట పెద్ద మనిషి అనే ముసుగు తొలగిపోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మాగుంటను ఓడించి తీరుతామనే హెచ్చరికలు వైసీపీ నుంచి తీవ్రంగా వస్తున్నాయి.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై మాగుంటకు వచ్చిన మెజార్టీ 50 వేలు మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి ఈ మెజార్టీ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఒంగోలులో ఈ దఫా మాగుంటకు కష్టకాలమే. రాజకీయంగా గెలుపోటములు సహజం. అయితే వ్యక్తిగత దూషణలకు దిగడమే ఇప్పుడు ప్రధాన చర్చ. అందులోనూ మాగుంట లాంటి నాయకుడు అవాకులు చెవాకులు పేలడం గమనార్హం.
బహుశా మాగుంటకు నిన్న రాత్రి నుంచి నిద్రలేని రాత్రులు తప్పవేమో! ఒకవేళ మాగుంట ఖర్మ కాలి వైసీపీ అధికారంలోకి వస్తే, మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్ని సజావుగా చేసుకునే పరిస్థితి వుంటుందా?
అనే ప్రశ్నకు, సమాధానం అందరికంటే ఆయనకే బాగా తెలుసు. నోరు జారి , భవిష్యత్లో చెల్లించబోయే భారీ మూల్యం విలువ ఎంతో మాగుంట లెక్కలేసుకోవాల్సి వుంటుంది.
ప్రభుత్వ పెద్దల దగ్గర ప్రయోజనాలు ఆశించే మాట్లాడి వుంటే, జగన్కు మాగుంట క్షమాపణ చెప్పరు. ఒకవేళ పొరపాటున నోరు జారినట్టు భావిస్తే, క్షమాపణ చెబుతారనే ప్రచారం జరుగుతోంది. మరి మాగుంట మనసులో ఏముందో తెలియాల్సి వుంది. మాగుంట మౌనాన్ని ఆశ్రయిస్తే మాత్రం, భవిష్యత్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందనే వైసీపీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.