#నూతన మద్యం పాలసీ విధానం🍾
*మందుబాబుల బెంబేలు……. వదులుతున్న మత్తు❗*
OCTOBER 7, 2025🍾
అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం ఊసేలేదు. అయితే మద్యం వాడకాన్ని తగ్గించే మహా గొప్ప ఆలోచన ఆయన చేశారు. మద్యాన్ని ముట్టుకోవాలంటే భయపడేలా, వాటి ధరల్ని పెంచుతున్నట్టు జగన్ అప్పట్లో చెప్పారు. మద్యనిషేధాన్ని తన మార్క్ రేట్ల పెంపుతో అమలు చేయాలని జగన్ ఆలోచించారు.
మద్యంపై ఆదాయాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక పాలకుల సర్కస్ ఫీట్లను మనం చూస్తూనే ఉన్నాం. మద్యంపై కూటమి అభిప్రాయం మరోలా వుంది. గతంలో వైఎస్ జగన్ నాణ్యమైన మద్యం సరఫరా చేయలేదని, కానీ తాము మాత్రం మంచి మద్యాన్ని అందిస్తామని మందుబాబుల్ని ఆకట్టుకున్నారు.
కూటమి సర్కార్ వచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని మద్యం దుకాణాల్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టింది. అంతేకాదు, నయాన్నో భయాన్నో అన్నీ కూటమి నేతలకు దక్కేలా చేసుకోగలిగారు. కాస్త ఆలస్యమైనా, కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. ఏకంగా కుటీర పరిశ్రమల్నే టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా నడుపుతున్నారంటే ఎంతగా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు.
ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం డంప్లు బయటపడ్డాయి. ఇందులో నిందితులంతా టీడీపీ నాయకులే కావడం చర్చనీయాంశమైంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని, సంపాదన కోసం అడ్డుదారులు తొక్కి, మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైనం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఈ దెబ్బతో మందుబాబుల మత్తు వదులుతోంది. మందు ముట్టుకోవాలంటేనే గజగజ వణికిపోయేలా చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కు దక్కుతుంది. అసలేదో, నకిలీ మందేదో అంతుచిక్కని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకుంది. గతంలో మద్యం రేట్లతో మందుబాబుల్ని వైసీపీ సర్కార్ భయపెడితే, ఇప్పుడు ఏకంగా నకిలీతో అసలుకే ఎసరు పెట్టిన ఘనత కూటమి సర్కార్. ఏపీలో మద్యం తాగాలంటే ఒకటికి రెండుసార్లు మందుబాబులు ఆలోచించే పరిస్థితి.
తాగకపోతే చావములే అని సర్ధి చెప్పుకునే పరిస్థితి. ఒకవేళ తాగాల్సి వస్తే, కల్తీ అయితే ప్రాణాలే పోతే అని భయాందోళనకు గురయ్యే దుస్థితికి తెచ్చారు. ఇలాంటి విపరీత ధోరణులు ఏర్పడడానికి కేవలం అధికారమే. కూటమిలో భాగస్వామి అయితే చాలు, ఎలాంటి అడ్డదారులైనా తొక్కొచ్చనే బరి తెగింపు ఏర్పడింది.
అంతేకాదు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం వల్ల ఏ స్థాయిలో నష్టం జరుగుతున్నదో పాలకులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మొత్తానికి మందుతాగాలంటే మందుబాబుల్ని బెంబేలెత్తిస్తున్నారు. ఇంతకాలం మందు మాట వింటే చాలు మత్తెక్కే పరిస్థితి. ఇప్పుడు ఆ మాట వింటే, మత్తు దిగుతోందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. అంతా నకిలీ లిక్కర్ భ్రాంతేనా?


