#మోక్షద ఏకాదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #గీత జయంతి
*మోక్షద ఏకాదశి*
*ఏకాదశీ వ్రత మహిమ*
మోక్షద ఏకాదశి మార్గశిర మాసం వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది.
"కృష్ణా! మార్గశిరమాసం వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని నాకు వివరించవలసినది" అని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు.
దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఓ రాజశ్రేష్ఠుడా! ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఆ రోజున భగవానుని తులసీమంజరులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడౌతాడు. ఈ ఏకాదశిని చేయడం ద్వారా వాజపేయ యజ్ఞనిర్వహణ ఫలం కలుగుతుంది.”
"వైఖానసుడనే రాజు చంపకనగరాన్ని పాలించేవాడు, ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞానపారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒక రోజు కల వచ్చింది. అది చూసిన రాజు దిగ్భ్రాంతి చెందాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నారకీయస్థితి నుండి తనను ఉద్దరించమని తన తండ్రి అర్థించినట్లుగా కూడ రాజు వారికి తెలియజేశాడు. ఆ కల గనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్యపాలనలో ఎటువంటి సుఖంగాని, అభిరుచి గాని అతనికి కనబడలేదు. చివరకు కుటుంబ సభ్యులతో కూడ అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకంలో కష్టాలుపడుతుంటే, పుత్రునియొక్క జీవితం, రాజ్యం, సంపద, బలం, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రిని నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపుమని బ్రాహ్మణులను ప్రార్థించాడు.”
అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. "రాజా! ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి.”
వారి సలహాను వినిన వైఖానసుడు బ్రాహ్మణులతోను, ప్రజలతోను కూడినవాడై పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతట వైఖానసుడు ఆయనతో "స్వామీ! మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే. కాని రాజ్యసంపదలు ఉన్నప్పటికిని నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనస్సులో ఒక గొప్ప సందేహం చేలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాదపద్మాల చెంతకు వచ్చాను" అని అన్నాడు.
రాజు వలన సమస్త వివరాలను వినిన పర్వతముని సమాధిమగ్ను డయ్యాడు. తరువాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో "రాజా! నీ తండ్రి గతజన్మలో అతికాముకుడైనందున నరకంలో పడినాడు. కనుక మార్గశిరమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరు ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి. మీ అందరి పుణ్యప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు" అని అన్నాడు. పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగివచ్చాడు. అటుపిమ్మట రాజు తన భార్యాపుత్రులతోను, అనుయాయులతోను కలిసి మార్గశిరమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోసాడు. ఆ పుణ్యప్రభావం చేత అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని ఎంతో దీవించాడు.
"కనుక ఓ రాజా! ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు,” అని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
![మోక్షద ఏకాదశి - Cereecebel ಮಾತದ ಐತಾದಕಿ ಕುಭಾತಾಂತ್ಲು Daily Wish Telugu 0+91 9700 722 711 {[9]0 Cereecebel ಮಾತದ ಐತಾದಕಿ ಕುಭಾತಾಂತ್ಲು Daily Wish Telugu 0+91 9700 722 711 {[9]0 - ShareChat మోక్షద ఏకాదశి - Cereecebel ಮಾತದ ಐತಾದಕಿ ಕುಭಾತಾಂತ್ಲು Daily Wish Telugu 0+91 9700 722 711 {[9]0 Cereecebel ಮಾತದ ಐತಾದಕಿ ಕುಭಾತಾಂತ್ಲು Daily Wish Telugu 0+91 9700 722 711 {[9]0 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_738095_f5fa86f_1764571735244_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=244_sc.jpg)

