#సూపర్ సిక్స్ 6 #ఏపీ అప్ డేట్స్..📖
*బాబూ.. పాలనను జనం చూస్తున్నారు❗*
SEPTEMBER 10 2025🎯
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, దాదాపు 15 నెలలకు మూడు పార్టీలు కలిసి అనంతపురంలో ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సూపర్సెక్స్ సూపర్హీట్ అని చక్కని పేరు పెట్టారు. ఏడాది పాలసలో తామిచ్చిన హామీల్ని తు.చ తప్పక అమలు చేశామని ప్రజలకు చెప్పడమే సభ ప్రధాన ఆశయం.
పాలకులు ఎన్నైనా చెప్పొచ్చు. అంతిమంగా లబ్ధిదారులు, పాలకుల అభిప్రాయం ఏంటనేదే ప్రధానం. వివిధ వర్గాలకు సామాజిక పించన్ల పెంపు ఒక్కటే సూపర్ సిక్స్ హామీల్లో పక్కాగా అమలైన పథకం. సూపర్ సిక్స్ హామీలు, వాటి అమలు గురించి తెలుసుకుందాం.
ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం, బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం, ప్రతి మహిళకూ నెలకు రూ.1500, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగం లేదా ఉపాధి లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్కల్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇవే కాకుండా మరికొన్ని హామీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 50 ఏళ్లు నిండిన బీసీలకు పించన్ ఇస్తామనే హామీని పూర్తిగా గాలికి వదిలేశారు.
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతకాలానికి అమలవుతున్నాయో అందరికీ తెలుసు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఏడాదికి ఒక సిలిండర్ ఇచ్చి పథకాన్ని అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు ఇక ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి మహిళకూ నెలకు రూ.1500 హామీని పీ4 కింద జమ చేసిన సంగతి తెలిసిందే. ఆ విధంగా దాన్ని అటకెక్కించారు.
ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలు మాత్రం... హామీ లేకుండానే పక్కాగా అమలవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చంద్రబాబే ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి .. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్టు తెలిపారు అధికారిక లెక్కలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ సూపర్ సిక్స్ పథకాల అమలు సూపర్ హిట్ అయ్యాయని సంబరపడ్డా, ప్రధానంగా ప్రభుత్వంపై
ఎమ్మెల్యేల పనితీరే అనుకూలత లేదా వ్యతిరేకత తీసుకొస్తాయని మరిచిపోవద్దు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు తమకిచ్చిన హామీల్ని అసలు పట్టించుకోలేదని తీవ్ర కోపంగా ఉన్నారు. అలాగే రైతాంగం విషయానికి వచ్చే సరికి రగిలిపోతున్నారు.
పంటలకు గిట్టబాటు ధరలు లేకపోవడంతో పాటు కనీసం ఒక ఐస్తా యూరియా ఇవ్వలేని దయనీయ స్థితిలో పాలకులున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇవన్నీ కాకుండా, అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోలేదని కూటమి కార్యకర్తలు, నాయకులు అసంతృప్తిలో ఉన్నారు, మరోవైపు టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో సంబంధాలు ఏ మాత్రం బాగాలేవు. ఇవన్నీ ఎన్నికల్లో రాజకీయంగా నష్టం తీసుకొచ్చేవే. అధికారంలో ఉండడంతో సభను విజయవంతం చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు తమ పాలనను జాగ్రత్తగా గమనిస్తున్నారనే సంగతిని సీఎం చంద్రబాబు గమనంలో పెట్టుకోవాలి. తప్పుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి పెడితేనే కూటమికి భవిష్యత్, తమను తాము భుజాలు చరుచుకుంటే ప్రయోజనం ఉండదు.


