#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి
11-04-2026 ప్రాత:మురళిఓంశాంతి‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 11-04-26 మధువనం
‘‘అంతర్ముఖీ పిల్లలూ - జ్ఞాన రూప అవస్థలో ఉంటూ ఈ మహావాక్యాలను ధారణ చేయండి, అప్పుడు స్వయము మరియు ఇతర ఆత్మల కళ్యాణము చెయ్యగలరు’’ (దాదీల డైరీ నుండి)
పురుషార్థీ పిల్లలు ప్రతి ఒక్కరూ ముందుగా అంతర్ముఖ అవస్థను తప్పకుండా ధారణ చేయాలి. అంతర్ముఖతలో చాలానే కళ్యాణము ఇమిడి ఉంది, ఈ అవస్థతోనే అచంచలత్వము, స్థిరత్వము, ఓర్పు, నిర్మానచిత్తము మొదలైన దైవీ గుణాల ధారణ జరగగలదు మరియు సంపూర్ణ జ్ఞానమయ అవస్థ ప్రాప్తించగలదు. అంతర్ముఖులుగా లేని కారణముగా వారికి సంపూర్ణ జ్ఞాన రూప అవస్థ ప్రాప్తించదు ఎందుకంటే ఏయే ‘‘మహావాక్యాలు’’ అయితే సమ్ముఖములో వినటము జరుగుతుందో, ఒకవేళ ఆ మహావాక్యాల యొక్క లోతుల్లోకి వెళ్ళి గ్రహించకపోతే, కేవలం ఆ మహావాక్యాలను విని రిపీట్ చేసినట్లయితే ఆ మహావాక్యాలు కేవలం వాక్యాలుగా అయిపోతాయి. ఎవరైతే జ్ఞాన రూప అవస్థలో ఉంటూ మహావాక్యాలను వినరో, ఆ మహావాక్యాలపై మాయ నీడ పడుతుంది. ఇప్పుడు, ఇలా మాయ యొక్క అశుద్ధమైన వైబ్రేషన్లతో నిండిన మహావాక్యాలను విని కేవలం రిపీట్ చెయ్యటము వలన స్వయము మరియు ఇతరుల కళ్యాణము జరగటానికి బదులుగా అకళ్యాణమైపోతుంది, అందుకే ఓ పిల్లలూ, పూర్తిగా అంతర్ముఖీగా అయిపోండి.
మీ ఈ మనసు మందిరము వంటిది. ఎలా అయితే మందిరము నుండి సదా సుగంధము వస్తూ ఉంటుందో అలా మనసనే మందిరము ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో, అప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఇమర్జ్ అవుతాయి. ఎలా అయితే మందిరములో కేవలం పవిత్రమైన దేవీ-దేవతల చిత్రాలనే పెట్టడము జరుగుతుందో, రాక్షసుల చిత్రాలను పెట్టరో, అలాగే పిల్లలైన మీరు మీ మనసు లేక హృదయము రూపీ మందిరాన్ని సర్వ ఈశ్వరీయ గుణాలనే మూర్తులతో అలంకరించండి, ఆ గుణాలు ఏమిటంటే - నిర్మోహము, నిర్లోభము, నిర్భయము, ఓర్పు, నిరహంకారము మొదలైనవి, ఎందుకంటే ఇవన్నీ మీ దివ్య లక్షణాలే. పిల్లలైన మీరు మీ మనసనే మందిరాన్ని ప్రకాశమయముగా అనగా సంపూర్ణ శుద్ధముగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనసనే మందిరము ప్రకాశమయముగా అవుతుందో, అప్పుడే మీ ప్రియమైన ప్రకాశమయమైన వైకుంఠ దేశములోకి వెళ్లగలుగుతారు. కావున ఇప్పుడు మీ మనసును ఉజ్వలముగా చేసుకునేందుకు ప్రయత్నము చేయాలి మరియు మనసు సహితముగా వికారీ కర్మేంద్రియాలను వశము చేసుకోవాలి. కానీ కేవలం మీ కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా ఇదే దివ్య సేవను చేయాలి.
వాస్తవానికి సేవ యొక్క అర్థం అతి సూక్ష్మమైనది మరియు లోతైనది. ఎవరైనా పొరపాటు చేస్తే కేవలం వారిని సావధానపరచటం మాత్రమే సేవ కాదు. అలా కాదు, వారికి సూక్ష్మరీతిలో మీ యోగశక్తిని అందించి, వారి అశుద్ధ సంకల్పాలను భస్మము చేయటము, ఇదే సర్వోత్తమమైన సత్యమైన సేవ, మరియు దానితో పాటుగా స్వయము పట్ల కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. కేవలం వాచా మరియు కర్మణాలోనే కాకుండా మనసులోనైనా సరే ఏవైనా అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమైతే వాటి వైబ్రేషన్లు ఇతరుల వద్దకు వెళ్ళి సూక్ష్మ రీతిలో అకళ్యాణము చేస్తాయి. ఆ భారము స్వయముపైనే పడుతుంది మరియు ఆ భారమే బంధనమైపోతుంది, అందుకే - ఓ పిల్లలూ, స్వయము సావధానులుగా ఉండండి మరియు ఇతరుల కొరకు కూడా అదే దివ్య సేవను చేయండి, ఇదే సేవాధారీ పిల్లలైన మీ యొక్క అలౌకిక కర్తవ్యము. ఇటువంటి సేవ చేసేవారు మళ్ళీ తమ కొరకు ఎటువంటి సేవను తీసుకోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా పొరపాటు జరిగినా కూడా దానిని మీ బుద్ధియోగ బలముతో సదా కొరకు కరక్ట్ చేసుకోవాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థులు కొంచెము సూచన లభించినా కానీ దానిని వెంటనే గ్రహించి పరివర్తన చేసుకుంటారు మరియు భవిష్యత్తు కొరకు మంచి రీతిలో అటెన్షన్ పెట్టి నడుచుకుంటారు, ఇదే విశాలబుద్ధి కల పిల్లల కర్తవ్యము.
ఓ నా ప్రాణమైన పిల్లలూ, పరమాత్మ ద్వారా రచింపబడిన ఈ అవినాశీ రాజస్వ జ్ఞాన యజ్ఞములో తనువు, మనసు, ధనములను సంపూర్ణ రీతిలో స్వాహా చెయ్యటములోని రహస్యము చాలా సూక్ష్మమైనది. ఏ క్షణమైతే మీరు - నేను తనువు, మనసు, ధనముల సహితముగా యజ్ఞములో స్వాహా అయిపోయాను అనగా అర్పణమై మరణించాను అని అంటారో, ఆ క్షణము నుండి మొదలుకుని మీదంటూ ఏదీ ఉండదు. అందులో కూడా ముందుగా తనువు, మనసులను సంపూర్ణ రీతిలో సేవలో పెట్టాలి. ఎప్పుడైతే మీ సర్వస్వమూ యజ్ఞము కోసమే అనగా పరమాత్మ కోసమే ఉంటుందో, అప్పుడిక మీ కోసమంటూ ఏదీ ఉండలేదు, అప్పుడు ధనాన్ని కూడా వ్యర్థముగా పోగొట్టలేరు, మనసు కూడా అశుద్ధ సంకల్ప-వికల్పాల వైపుకు పరుగెత్తలేదు ఎందుకంటే పరమాత్మకు అర్పించేశారు. వాస్తవానికి పరమాత్మ ఉన్నదే శుద్ధ, శాంత స్వరూపము, ఈ కారణముగా అశుద్ధ సంకల్పాలు స్వతహాగానే శాంతిస్తాయి. ఒకవేళ మనసును మాయ చేతిలో పెట్టినట్లయితే మాయకు వెరైటీ రూపాలు ఉన్న కారణముగా అది అనేక రకాల వికల్పాలను ఉత్పన్నము చేసి మనసు అనే గుర్రము పైకి ఎక్కి సవారీ చేస్తుంది. ఒకవేళ పిల్లలెవరికైనా ఇప్పటివరకు కూడా సంకల్ప-వికల్పాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి - మనసు ఇప్పుడింకా పూర్ణ రీతిలో స్వాహా అవ్వలేదు అనగా మనసు ఈశ్వరీయ మనసుగా అవ్వలేదు, అందుకే ఓ సర్వస్వ త్యాగీ పిల్లలూ, ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకుని కర్మలు చేస్తూ సాక్షీగా అయ్యి స్వయాన్ని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి.
స్వయముగా గోపీ వల్లభుడు తమ ప్రియమైన గోప-గోపికలైన మీకు ఏమని అర్థం చేయిస్తున్నారంటే - మీలోని ప్రతి ఒక్కరికీ వాస్తవికమైన సత్యమైన ప్రేమ ఏది! ఓ ప్రాణులారా, మీకు ఇతరులు ఇచ్చే ప్రేమపూర్వకమైన అటెన్షన్ ను మీరు స్వీకరించాలి ఎందుకంటే ఎంతటి ప్రియమైన పుష్పమో, అంతే శ్రేష్ఠమైన పాలన ఉంటుంది. పుష్పాన్ని విలువైనదిగా చేయడానికి తోటమాలి దానిని ముళ్ళ నుండి బయటకు తియ్యాల్సే ఉంటుంది, అలాగే మీకు కూడా ఎవరైనా అటెన్షన్ ఇప్పించినట్లయితే, వారు నాకు పాలన చేస్తున్నారు అనగా నా సేవ చేస్తున్నారు అని భావించాలి. ఆ సేవకు అనగా ఆ పాలనకు గౌరవము ఇవ్వాలి, ఇదే సంపూర్ణముగా అయ్యేందుకు యుక్తి, ఇదే జ్ఞాన సహితమైన ఆంతరిక సత్యమైన ప్రేమ. ఈ దివ్య ప్రేమలో ఇతరుల పట్ల చాలా గౌరవము ఉండాలి. ప్రతి విషయములోనూ ముందుగా స్వయాన్నే సావధానపరుచుకోవాలి, ఇదే నిర్మానచిత్తమైన, అతి మధురమైన అవస్థ. ఇలా ప్రేమపూర్వకముగా నడుచుకోవటం ద్వారా మీకు ఇక్కడే ఆ సత్యయుగీ మనోహరమైన రోజులు ఆంతరికముగా అనుభూతి అవుతాయి. అక్కడైతే ఈ ప్రేమ సహజముగానే ఉంటుంది, కానీ ఈ సంగమయుగపు అతి మధురమైన సమయములో ఇతరుల కొరకు సర్వీస్ చేసేందుకు ఇది అతి మధురమైన, రమణీకమైన ప్రేమ, ఈ శుద్ధమైన ప్రేమయే విశ్వములో గాయనము చేయబడింది.
చైతన్య పుష్పాలైన మీరు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ హర్షితముఖులుగా ఉండాలి ఎందుకంటే నిశ్చయబుద్ధి కలిగి ఉన్న కారణముగా మీ నరనరాలలో సంపూర్ణ ఈశ్వరీయ శక్తి ఇమిడి ఉంటుంది. ఇటువంటి ఆకర్షణా శక్తి తన దివ్య చమత్కారాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఏ విధముగా నిర్దోషి అయిన చిన్న పిల్లవాడు శుద్ధముగా, పవిత్రముగా ఉన్న కారణముగా సదా నవ్వుతూ ఉంటాడో మరియు తన రమణీకమైన చరిత్ర ద్వారా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడో, అలా మీలోని ప్రతి ఒక్కరిదీ ఇటువంటి ఈశ్వరీయ రమణీకమైన జీవితముగా ఉండాలి, దీని కోసం మీరు ఏ యుక్తి ద్వారానైనా సరే మీ ఆసురీ స్వభావాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మీరు ఎవరినైనా క్రోధమనే వికారానికి వశమై మీ ఎదురుగా వస్తున్నారు అని చూసినప్పుడు మీరు వారి ఎదురుగా జ్ఞాన స్వరూపులై బాల్యపు మధురమైన రీతిలో నవ్వుతూ ఉన్నట్లయితే వారు స్వయమే శాంతచిత్తులైపోతారు అనగా విస్మృతి స్వరూపము నుండి స్మృతిలోకి వచ్చేస్తారు. వారికి తెలియకపోయినా కానీ, సూక్ష్మరీతిలో వారిపై విజయము పొంది యజమానిగా అవ్వటము, ఇదే యజమానిగా మరియు బాలకునిగా అయ్యే సర్వోత్తమమైన శిరోమణి విధి.
ఈశ్వరుడు ఎలా అయితే సంపూర్ణ జ్ఞాన స్వరూపుడో అలాగే సంపూర్ణ ప్రేమ స్వరూపుడు కూడా. ఈశ్వరునిలో రెండు గుణాలు ఇమిడి ఉన్నాయి కానీ మొదట జ్ఞానము, ఆ తర్వాత ప్రేమ. ఒకవేళ ఎవరైనా ముందు జ్ఞాన స్వరూపులుగా అవ్వకుండా కేవలం ప్రేమ స్వరూపులుగా అయినట్లయితే ఆ ప్రేమ అశుద్ధ ఖాతాలోకి తీసుకువెళ్తుంది. అందుకే ప్రేమను మర్జ్ చేసి ముందుగా జ్ఞాన స్వరూపులుగా అయ్యి రకరకాల రూపాలలో వచ్చే మాయపై విజయాన్ని పొంది ఆ తర్వాత ప్రేమ స్వరూపులుగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానము లేకుండా ప్రేమలోకి వచ్చినట్లయితే ఎప్పుడైనా చంచలం కూడా అవ్వవచ్చు. ఎలా అయితే, ఎవరైనా జ్ఞాన స్వరూపులుగా అవ్వకుండా ధ్యానములోకి వెళ్ళినట్లయితే ఎన్నో సార్లు మాయలో చిక్కుకుపోతారు, అందుకే బాబా అంటారు, పిల్లలూ, ఈ ధ్యానము కూడా దారపు సంకెళ్ళవంటిది, కానీ జ్ఞాన స్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ధ్యానములోకి వెళ్ళినట్లయితే అత్యంత ఆనందము అనుభవమవుతుంది. కనుక ముందు జ్ఞానము, ఆ తర్వాత ధ్యానము. ధ్యాననిష్ఠ అవస్థ కంటే జ్ఞాననిష్ఠ అవస్థ శ్రేష్ఠమైనది, అందుకే ఓ పిల్లలూ, ముందు జ్ఞాన స్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ప్రేమను ఇమర్జ్ చేయాలి. జ్ఞానము లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటే అది ఈ పురుషార్థీ జీవితములో విఘ్నము కలిగిస్తుంది.
సాక్షీతనపు అవస్థ అతి మధురమైనది, రమణీకమైనది మరియు సుందరమైనది. ఈ అవస్థపైనే భవిష్య జీవితమంతా ఆధారపడి ఉంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా శారీరక రోగాన్ని అనుభవించాల్సి వస్తే, ఆ సమయములో ఒకవేళ వారు సాక్షీ, సుఖ స్వరూప అవస్థలో ఉంటూ దానిని అనుభవించినట్లయితే దాని ద్వారా వారు గత కర్మల భోగమును సమాప్తము కూడా చేసుకుంటారు మరియు దానితోపాటు భవిష్యత్తు కోసం సుఖపు ఖాతాను కూడా తయారుచేసుకుంటారు. కనుక ఈ సాక్షీతనపు సుఖ స్వరూప అవస్థకు గతము మరియు భవిష్యత్తు, రెండింటితోనూ కనెక్షన్ ఉంటుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా ఇలా అనరు - నా ఈ మనోహరమైన సమయమంతా కేవలం సమాప్తము చేసుకోవటములోనే గడిచిపోయింది అని. అలా కాదు. ఇదే మనోహరమైన పురుషార్థము యొక్క సమయము. ఈ సమయములో రెండు కార్యాలూ సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఇలా రెండు కార్యాలనూ సిద్ధి చేసుకునే తీవ్ర పురుషార్థులే అతీంద్రియ సుఖము మరియు ఆనందము యొక్క అనుభవములో ఉంటారు.
ఈ వెరైటీ విరాట డ్రామాలోని ప్రతి విషయములోనూ పిల్లలైన మీకు సంపూర్ణ నిశ్చయము ఉండాలి ఎందుకంటే ఈ తయారై, తయారుచేయబడిన డ్రామా పూర్తిగా విశ్వసనీయమైనది. చూడండి, ఈ డ్రామా ప్రతి ఒక్క జీవి చేత, ప్రాణి చేత తమ పాత్రను పూర్ణ రీతిలో అభినయించేలా చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా, ఆ తప్పు చేసే పాత్రను కూడా పూర్ణ రీతిలో అభినయించేలా చేస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రాంగ్ మరియు రైట్, ఈ రెండూ కూడా ప్లాన్ లో నిశ్చితమై ఉన్నప్పుడు ఇక ఏ విషయములోనైనా సంశయాన్ని రానివ్వటమంటే, అది జ్ఞానము కాదు ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎలాగైతే సినిమాలలో అనేకమంది భిన్న-భిన్న నామ-రూపాలు కల యాక్టర్లు తమ-తమ యాక్టింగ్ ను చేసినప్పుడు వారిని చూసి ఎవరిపైనైనా ద్వేషము కలగటము కానీ, ఎవరిని చూసి అయినా సంతోషించటము కానీ జరగదు. అది ఒక ఆట అన్నది అక్కడ తెలుసు, అందులో ప్రతి ఒక్కరికీ తమ-తమ మంచిగా ఉండే లేక చెడుగా ఉండే పాత్ర లభించి ఉంది. అలాగే అనాదిగా తయారై ఉన్న ఈ సినిమాను కూడా సాక్షీగా అయ్యి ఏకరస అవస్థతో హర్షితముఖులై చూస్తూ ఉండాలి. సంగఠనలో ఈ పాయింట్ ను చాలా బాగా ధారణ చేయాలి. ఇతరులను ఈశ్వరీయ రూపముతో చూడాలి, జ్ఞానాన్ని అనుభూతి చేసి సర్వ ఈశ్వరీయ గుణాల ధారణను చేయాలి. తమ లక్ష్య స్వరూపము యొక్క స్మృతి ద్వారా శాంతచిత్తము, నిర్మానచిత్తము, ఓర్పు, మధురత, శీతలత మొదలైన అన్ని దైవీ గుణాలను ఇమర్జ్ చేసుకోవాలి.
ఓర్పుతో కూడిన అవస్థను ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది - వెయిట్ అండ్ సీ (వేచి చూడండి). ఓ నా ప్రియమైన పిల్లలూ, వెయిట్ అనగా ఓర్పు వహించటము, సీ అనగా చూడటము. మీ మనసు లోపల ముందుగా ఓర్పు అనే గుణాన్ని ధారణ చేసి, ఆ తర్వాత బయట విరాట డ్రామాను సాక్షీగా అయ్యి చూడాలి. ఏదైనా రహస్యాన్ని వినే సమయము సమీపముగా వచ్చేంతవరకు ఓర్పు అనే గుణాన్ని ధారణ చేయాలి. సమయము వచ్చినప్పుడు ఆ ఓర్పు అనే గుణముతో రహస్యాన్ని వినటం వలన ఎప్పుడూ కూడా చలించరు, అందుకే ఓ పురుషార్థీ ప్రాణులారా, కాస్త ఆగండి మరియు ముందుకు వెళ్తూ రహస్యాన్ని చూస్తూ ఉండండి. ఈ ఓర్పుతో కూడిన అవస్థ ద్వారానే మొత్తము కర్తవ్యమంతా సంపూర్ణ రీతిలో సిద్ధిస్తుంది. ఈ గుణము నిశ్చయముతో ముడిపడి ఉంది. అలా నిశ్చయబుద్ధి సాక్షీదృష్టాగా అయ్యి ప్రతి ఆటను హర్షితముఖముతో చూస్తూ ఆంతరికమైన ఓర్పుతో మరియు అచంచలమైన మనసుతో ఉంటారు, ఇదే జ్ఞానము యొక్క పరిపక్వ అవస్థ, ఇదే అంతిమములో సంపూర్ణతా సమయములో ప్రాక్టికల్ గా ఉంటుంది, అందుకే బహుకాలము నుండీ ఈ సాక్షీతనపు అవస్థలో స్థితులయ్యే కృషి చేయాలి.
ఎలా అయితే నాటకములో యాక్టర్ తనకు లభించిన పాత్రను పూర్ణ రీతిలో అభినయించేందుకు ముందు నుండే రిహార్సల్స్ చేయవలసి ఉంటుందో, అలాగే ప్రియమైన పుష్పాలైన మీకు కూడా రాబోయే పెద్ద పరీక్షలలో యోగబలము ద్వారా పాస్ అయ్యేందుకు ముందు నుండే రిహార్సల్స్ తప్పకుండా చేయాలి. కానీ ఒకవేళ బహుకాలము నుండీ ఈ పురుషార్థము చేసి ఉండకపోతే సమయము వచ్చినప్పుడు ఆ సమయములో గాభరా పడిపోయి ఫెయిల్ అయిపోతారు, అందుకే ముందుగా మీ ఈశ్వరీయ పునాదిని పక్కా చేసుకుని దైవీగుణధారిగా అవ్వాలి.
జ్ఞాన స్వరూప స్థితిలో స్థితులై ఉండటము ద్వారా స్వతహాగానే శాంత స్వరూప అవస్థ ఏర్పడుతుంది. జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలందరూ కలిసి కూర్చుని మురళిని విన్నట్లయితే నలువైపులా శాంతి వాయుమండలము ఏర్పడుతుంది ఎందుకంటే వారు ఏ మహావాక్యాలను విన్నా సరే అవి ఆంతరికముగా బాగా లోపలికి వెళ్ళిపోతాయి. బాగా లోపలికి వెళ్ళిపోయిన కారణముగా ఆంతరికముగా వారికి శాంతితో కూడిన మధురమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దీని కోసమేమీ ప్రత్యేకముగా కూర్చుని శ్రమ చేయాల్సిన అవసరము లేదు, కానీ జ్ఞాన అవస్థలో స్థితులై ఉన్నట్లయితే ఈ గుణము సులభముగానే వచ్చేస్తుంది. పిల్లలైన మీరు ఉదయముదయమే లేచి ఏకాంతములో కూర్చున్నప్పుడు శుద్ధ ఆలోచనలనే అలల ఉత్పన్నమవుతాయి. ఆ సమయములో చాలా ఉపరామ అవస్థ ఉండాలి. ఆ తర్వాత తమ నిజమైన, శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వటం ద్వారా ఇతర అన్ని సంకల్పాలు వాటంతటవే శాంతిస్తాయి మరియు మనసు నిస్సంకల్పముగా అయిపోతుంది ఎందుకంటే మనసును వశము చేసుకునేందుకు కూడా ఏదో ఒక శక్తి అయితే తప్పకుండా కావాలి, అందుకే ముందుగా మీ లక్ష్య స్వరూపము యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ఆంతరిక బుద్ధియోగము నియమప్రమాణముగా ఉన్నట్లయితే మీ ఈ నిస్సంకల్ప అవస్థ స్వతహాగానే ఏర్పడుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన జ్ఞాన పుష్పాలకు, జ్ఞాన సితారలకు ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ లక్ష్య స్వరూపము యొక్క స్మృతితో శాంతచిత్తము, నిర్మానచిత్తము, ఓర్పు, మధురత, శీతలత మొదలైన సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి.
2. నిశ్చయబుద్ధీ సాక్షీదృష్టాగా అయ్యి ఈ ఆటను హర్షితముఖముతో చూస్తూ ఆంతరికముగా ఓర్పుతో మరియు అచంచల మనసుతో ఉండాలి. బహుకాలము నుండీ ఈ సాక్షీతనపు అవస్థలో స్థితులై ఉండే పురుషార్థము చేయాలి.
వరదానము:-ఒకే మార్గాన్ని మరియు ఒక్కరితోనే సంబంధాన్ని ఉంచుకునే సంపూర్ణ ఫరిశ్తా భవ
నిరాకార మరియు సాకార రూపముతో బుద్ధి యొక్క సాంగత్యము మరియు సంబంధము ఒక్క బాబాతో పక్కాగా ఉన్నట్లయితే ఫరిశ్తాగా అవుతారు. ఎవరివైతే సర్వ సంబంధాలు మరియు సర్వ బాంధవ్యాలు ఒక్కరితోనే ఉంటాయో, వారే సదా ఫరిశ్తాలు. ఏ విధముగా గవర్నమెంటు వారు - ‘ఈ మార్గము బ్లాక్ చేయబడింది (మూసివేయబడింది)’ అని మార్గము మధ్యలో బోర్డును పెడతారో, అదే విధముగా అన్ని మార్గాలను బ్లాక్ చేసినట్లయితే (మూసి వేసినట్లయితే) బుద్ధి భ్రమించడము సమాప్తమైపోతుంది. బాప్ దాదా ఆజ్ఞ ఇదే - మొదట అన్ని మార్గాలను మూసి వేయండి, దీని ద్వారా సహజముగానే ఫరిశ్తాలుగా అయిపోతారు.
స్లోగన్:-సదా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండటము - ఇదే మాయ నుండి సురక్షితముగా ఉండేందుకు సాధనము.
అవ్యక్త సూచనలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
మీ మాటలు మరియు స్వరూపము, రెండూ ఒకేలా ఉండాలి - మాటలలో స్పష్టత కూడా ఉండాలి, అందులో స్నేహము కూడా ఉండాలి, నమ్రత మరియు మధురత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి, కానీ స్వరూపములో నమ్రత కూడా ఉండాలి, ఇటువంటి రూపముతోనే బాబాను ప్రత్యక్షము చెయ్యగలరు. నిర్భయులుగా ఉండాలి కానీ మాటలు మర్యాదపూర్వకముగా ఉండాలి - ఎప్పుడైతే ఈ రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉంటుందో, అప్పుడు అద్భుతము కనిపిస్తుంది. అప్పుడు మీ మాటలు చేదుగా కాకుండా మధురముగా అనిపిస్తాయి.
"

