#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు
17-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పావనముగా అయినట్లయితే ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతారు, దేహీ-అభిమానీ పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు మరియు ఇతరుల చేత కూడా ఇదే యాత్రను చేయిస్తారు’’
ప్రశ్న:-సంగమములో పిల్లలైన మీరు ఏదైతే సంపాదన చేసుకుంటారో, అదే సత్యమైన సంపాదన, ఎలా?
జవాబు:-ఇప్పుడు చేసుకునే సంపాదన ఏదైతే ఉందో, అది 21 జన్మల వరకు కొనసాగుతుంది, అది ఎప్పుడూ దివాలా అవ్వదు. జ్ఞానాన్ని వినడము మరియు వినిపించడము, స్మృతి చేయడము మరియు చేయించడము - ఇదే సత్యాతి-సత్యమైన సంపాదన, దీనిని సత్యాతి-సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇటువంటి సంపాదనను మొత్తము కల్పములో ఇంకెవ్వరూ సంపాదించలేరు. వేరే సంపాదన ఏదీ మీతో పాటు రాదు.
పాట:-మేము ఆ మార్గములో నడవాలి...
▶
ఓంశాంతి. భక్తి మార్గములోనైతే పిల్లలు చాలా ఎదురుదెబ్బలు తిని ఉన్నారు. భక్తి మార్గములో చాలా భావనతో యాత్రలు చేయడానికి వెళ్తారు, రామాయణము మొదలైనవి వింటారు. ఎంత ప్రేమగా కూర్చుని కథలను వింటారంటే, అవి వింటూ-వింటూ వారికి ఏడుపు కూడా వచ్చేస్తుంది. మా భగవంతుడి యొక్క భగవతి అయిన సీతను దొంగ అయిన రావణుడు అపహరించాడు అని అది వినేటప్పుడు కూర్చుని ఏడుస్తారు. ఇవన్నీ కల్పితమైన కథలు, వీటి వల్ల లాభమేమీ లేదు. ఓ పతిత-పావనా రండి, వచ్చి దుఃఖిత ఆత్మలైన మమ్మల్ని సుఖమయముగా చేయండి అని పిలుస్తారు కూడా. కానీ, ఆత్మ దుఃఖిస్తుంది అని వారు భావించరు, ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపి అని అంటారు. ఆత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనదని భావిస్తారు. ఇలా ఎందుకు అంటారు? ఎందుకంటే పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతమైనవారు కావున వారి పిల్లలు మరి సుఖ-దుఃఖాలలోకి ఎలా వస్తారు అని భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గములో కూడా అప్పుడప్పుడు గ్రహచారము కూర్చుంటుంది, అప్పుడప్పుడు ఇంకేదో జరుగుతుంది. ఒక్కోసారి చాలా ప్రసన్నముగా ఉంటారు, ఒక్కోసారి వాడిపోయిన ముఖముతో ఉంటారు. ఇది మాయతో జరిగే యుద్ధము. మాయపైనే విజయము పొందాలి. మూర్ఛితులు అయినప్పుడు ‘మన్మనాభవ’ అనే సంజీవని మూలికను ఇవ్వడము జరుగుతుంది. భక్తి మార్గములో చాలా ఆర్భాటము ఉంటుంది. దేవతల మూర్తులను ఎంతగా అలంకరిస్తారు, సత్యమైన ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ ఆభరణాలు స్వామి యొక్క ఆస్తి అయినట్లు. స్వామి ఆస్తి అనగా పూజారులది లేక ట్రస్టీలది అవుతుంది. మేము చైతన్యములో చాలా వజ్ర-వైఢూర్యాలతో అలంకరించబడి ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అయినప్పుడు కూడా చాలా ఆభరణాలను ధరిస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఏమీ లేవు. చైతన్య రూపములో కూడా ధరించారు మరియు జడమైన రూపములోనూ ధరించారు. ఇప్పుడు ఏ ఆభరణాలు లేవు. పూర్తిగా సాధారణముగా ఉన్నారు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, రాజరికపు ఆర్భాటమేమీ ఉండదు. సన్యాసులు మొదలైనవారిది కూడా చాలా ఆర్భాటము ఉంటుంది. తప్పకుండా సత్యయుగములో ఆత్మలమైన మనము ఏ విధముగా పవిత్రముగా ఉండేవారము అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శరీరాలు కూడా మనవి పవిత్రముగా ఉండేవి. వారి అలంకరణ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సుందరముగా ఉంటే, వారికి అలంకరించుకునే అభిరుచి కూడా ఉంటుంది. మీరు కూడా సుందరముగా ఉన్నప్పుడు చాలా మంచి-మంచి ఆభరణాలను ధరించేవారు. వజ్రాలతో పొదగబడిన పెద్ద-పెద్ద హారాలు మొదలైనవి ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా ఉంటుంది. చూడండి, గోవులు కూడా నల్లగా అవుతూ వచ్చాయి. బాబా శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంచి గోవులు ఉండేవి. శ్రీకృష్ణుని గోవులను చాలా సుందరముగా చూపిస్తారు. ఇక్కడైతే కొన్ని ఒకలా, కొన్ని మరోలా ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఇది కలియుగము. ఇలాంటి గోవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ అలంకరణ కూడా అక్కడ అంత సుందరముగా ఉంటుంది. ఆలోచించండి - గోవులైతే అక్కడ తప్పకుండా కావాలి. అక్కడి గోవుల పేడ కూడా ఎలా ఉంటూ ఉండవచ్చు. అందులో ఎంత శక్తి ఉంటుంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేసినట్లయితే మంచి ధాన్యము పండుతుంది. అక్కడ, అన్ని వస్తువులు మంచి శక్తి కలిగినవిగా ఉంటాయి. ఇక్కడైతే ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు పూర్తిగా పవర్ లెస్ గా (శక్తిహీనము) అయిపోయింది. కుమార్తెలు సూక్ష్మవతనములోకి వెళ్ళేవారు. అక్కడ ఎంతో మంచి-మంచి పెద్ద ఫలాలను తినేవారు, శూబీ రసము మొదలైనవి తాగేవారు. ఇవన్నీ సాక్షాత్కారము చేయించేవారు. అక్కడ తోటమాలులు ఫలాలు మొదలైనవి ఎలా కోసి ఇస్తారు. సూక్ష్మవతనములోనైతే ఫలాలు మొదలైనవి ఉండవు. ఇదంతా సాక్షాత్కారమవుతుంది. వైకుంఠమైతే ఎంతైనా ఇక్కడే ఉంటుంది కదా. వైకుంఠము ఎక్కడో పైన ఉంటుందని మనుష్యులు భావిస్తారు. వైకుంఠము సూక్ష్మవతనములోనూ ఉండదు, మూలవతనములోనూ ఉండదు. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏవైతే సాక్షాత్కారాలలో చూస్తారో, వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. ఎటువంటి హోదానో, అటువంటి సామాగ్రి కూడా ఉంటుంది. రాజుల మహళ్ళు ఎంత మంచి-మంచివి ఉంటాయో చూడండి. జైపూర్ లో చాలా మంచి-మంచి మహళ్ళు నిర్మించబడ్డాయి. కేవలం ఆ మహళ్ళను చూసేందుకే మనుష్యులు వెళ్తారు, దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ మహళ్ళను విశేషముగా చూడడము కోసం తెరిచి ఉంచుతారు, స్వయం వేరే మహళ్ళలో ఉంటారు. అది కూడా కలియుగములో ఇలా ఉంటుంది. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. కానీ ఎవ్వరూ తమను తాము పతితులుగా భావించరు. మేమైతే పతితులుగా ఉండేవారము, దేనికీ కొరగానివారిగా ఉండేవారము, మళ్ళీ మేము తెల్లగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఆ ప్రపంచమే ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇక్కడ అమెరికా మొదలైనవాటిలో ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉన్నాయి, కానీ అక్కడి వాటితో పోలిస్తే ఇవి అసలేమీ కాదు, ఎందుకంటే ఇవి అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేటటువంటివి. అక్కడైతే ఫస్ట్ క్లాస్ మహళ్ళు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ గోవులు ఉంటాయి. అక్కడ గోపాలులు కూడా ఉంటారు. శ్రీకృష్ణుడిని గొపాలుడని అంటారు కదా. ఇక్కడ గోవులను సంభాళించేవారు ఏమని చెప్పుకుంటారంటే - మేము గోపాలులము, శ్రీకృష్ణుని వంశానికి చెందినవారము అని. వాస్తవానికి శ్రీకృష్ణుని వంశావళి అని అనరు, శ్రీకృష్ణుని రాజధానికి చెందినవారని అంటారు. షావుకారుల వద్ద గోవులుంటే, వాటిని సంభాళించే గోపాలులు కూడా ఉంటారు. ఈ గోపాలులు అనే పేరు సత్యయుగానికి చెందినది. ఇది నిన్నటి విషయమే. నిన్న మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, తర్వాత పతితులుగా అయ్యాము, కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటాము. మీరు ఆది సనాతన దేవి-దేవతా ధర్మము వారా లేక హిందూ ధర్మము వారా అని అడగండి. ఈ రోజులలో అందరూ హిందువులు అని వ్రాసుకున్నారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. బాబా ప్రశ్న అడుగుతున్నారు - ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి? శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. రాముడు అనగా శివబాబా యొక్క శ్రీమతమనుసారముగా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపన అయ్యింది. ఆ తర్వాత రావణ రాజ్యము మొదలవుతుంది, వికారాలలోకి వెళ్తారు. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు హిందువులని చెప్పుకోవడము మొదలుపెడతారు. ఇప్పుడు ఎవరూ తమను తాము దేవతలు అని చెప్పుకోలేరు. రావణుడు వికారులుగా చేసాడు, తండ్రి వచ్చి నిర్వికారులుగా చేస్తారు. మీరు ఈశ్వరీయ మతము ద్వారా దేవతలుగా అవుతారు. తండ్రియే వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. మెట్లు ఎలా దిగుతారు అనేది పిల్లలైన మీ బుద్ధిలో నంబరువారుగా కూర్చుంటుంది. మిగిలిన మనుష్యులందరూ ఆసురీ మతముపై నడుస్తున్నారని మరియు మీరు ఈశ్వరీయ మతముపై నడుస్తున్నారని మీకు తెలుసు. రావణుడి మతముపై నడుస్తూ మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నంబరు జన్మ జరుగుతుంది. ఈశ్వరీయ బుద్ధి ద్వారా మీరు మొత్తము సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. మీ ఈ జీవితము చాలా అమూల్యమైనది, ఇది సాహసముతో కూడిన జీవితము. ఈ జీవితములోనే తండ్రి వచ్చి మనల్ని ఇంత పావనముగా తయారుచేస్తున్నారు. మనము ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతాము. వారు దైహిక సమాజ సేవకులు, వారు దేహాభిమానములో ఉంటారు. మీరు దేహీ-అభిమానులు. మీరు ఆత్మలను ఆత్మిక యాత్రకు తీసుకువెళ్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. సతోప్రధానముగా ఉన్నవారిని పావనులు అని, తమోప్రధానముగా ఉన్నవారిని పతితులు అని అంటారు. ఆత్మలోనే మాలిన్యము చేరుకుంది. ఆత్మనే సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పవిత్రముగా అవుతారు, లేదంటే తక్కువ పవిత్రముగా అవుతారు, పాపాల భారము తలపై ఉండిపోతుంది. మొదట ఆత్మలన్నీ పవిత్రముగా ఉంటాయి, ఇక తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరు-వేరుగా ఉంటుంది. అందరి పాత్ర ఒకేలా ఉండదు. అందరికన్నా ఉన్నతమైన పాత్ర బాబాది, తర్వాత బ్రహ్మా-సరస్వతులది ఎంతటి పాత్ర ఉంది. ఎవరైతే స్థాపన చేస్తారో, వారే పాలన కూడా చేస్తారు. పెద్ద పాత్ర వారిదే. మొదట శివబాబా, ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు, వారు పునర్జన్మలలోకి వస్తారు. శంకరుడైతే కేవలం సూక్ష్మ రూపాన్ని ధారణ చేస్తారు. అంతేకానీ, శంకరుడు ఏదైనా శరీరాన్ని అప్పుగా తీసుకుంటారని కాదు. శ్రీకృష్ణుడికి తనదంటూ శరీరముంది. ఇక్కడ కేవలం శివబాబా మాత్రమే శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. పతిత శరీరములోకి, పతిత ప్రపంచములోకి వచ్చి ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్ళే సేవను చేస్తారు. మొదట ముక్తిలోకి వెళ్ళవలసి ఉంటుంది. నాలెడ్జ్ ఫుల్ అయిన తండ్రి ఒక్కరే పతిత-పావనుడు, వారినే శివబాబా అని అంటారు. శంకరుడిని బాబా అని అంటే అది శోభించదు. శివబాబా అన్న పదము చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పుష్పాలను అర్పిస్తారు, కొందరు ఇంకేవో అర్పిస్తారు, కొందరు పాలతో కూడా అభిషేకము చేస్తారు.
తండ్రి పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొత్తము ఆధారమంతా యోగముపై ఉందని పిల్లలకు అర్థం చేయించడము జరుగుతుంది. యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. యోగము చేసేవారికి జ్ఞాన ధారణ కూడా బాగా జరుగుతుంది. వారు తమ ధారణలో నడుస్తూ ఉంటారు, ఎందుకంటే వారు ఇతరులకు కూడా వినిపించవలసి ఉంటుంది. ఇది కొత్త విషయము. భగవంతుడు ఎవరికైతే డైరెక్టుగా వినిపించారో, వారే వింటారు, ఇక తర్వాత ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే వినిపిస్తున్నారో, అది ఇప్పుడు మీరు వింటున్నారు. ధారణ జరుగుతుంది, ఇక తర్వాత ప్రారబ్ధపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానము వినడము, వినిపించడము అనేది ఇప్పుడే జరుగుతుంది. సత్యయుగములో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉండేదే ప్రారబ్ధపు పాత్ర. మనుష్యులు బ్యారిస్టర్ చదువును చదువుతారు, ఇక తర్వాత బ్యారిస్టర్ గా అయి సంపాదిస్తారు. ఇది ఎంత గొప్ప సంపాదన, దీని గురించి ప్రపంచములోని వారికి తెలియదు. సత్యమైన బాబా మా చేత సత్యమైన సంపాదనను చేయిస్తున్నారని మీకు తెలుసు. ఇది ఎప్పుడూ దివాలా అవ్వదు. ఇప్పుడు మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ 21 జన్మలు మీతోపాటు ఉంటుంది. లౌకిక సంపాదన మీతోపాటు రాదు. ఈ సంపాదన మీతోపాటు వస్తుంది కావున మీరు ఇటువంటి సంపాదనను ఆదరించాలి. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా కొందరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు. తండ్రిని మరియు వారసత్వాన్ని మర్చిపోకూడదు. ముఖ్యమైన విషయము ఒక్కటే, తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వము లభిస్తుంది, 21 జన్మల కొరకు నిరోగి శరీరము ఉంటుంది. వృద్ధాప్యము వరకు అకాల మృత్యువు జరగదు. పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. తండ్రి స్మృతి ముఖ్యమైనది, ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తుఫానులు తీసుకువస్తుంది. అనేక రకాల తుఫానులు వస్తాయి. తండ్రిని స్మృతి చేయండి అని మీరు చెప్తారు కానీ చేయలేకపోతారు. స్మృతిలోనే చాలా మంది ఫెయిల్ అవుతారు. యోగము చాలామందిలో తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత యోగములో దృఢముగా అవ్వాలి. ఇకపోతే, బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము పెద్ద విషయమేమీ కాదు.
తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేసినట్లయితే, నన్ను తెలుసుకున్నట్లయితే మీరు అంతా తెలుసుకుంటారు. స్మృతిలోనే అంతా ఇమిడి ఉంది. స్వీట్ బాబా అయిన శివబాబాను స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు వారే. వారు 21 జన్మల కోసం ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖమయముగా, అమరులుగా తయారుచేస్తారు. మీరు అమరపురికి యజమానులుగా అవుతారు, కావున ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకపోతే మిగిలినవన్నీ గుర్తుకువచ్చేస్తాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ ఈశ్వరీయ జీవితము చాలా-చాలా అమూల్యమైనది, ఈ జీవితములో ఆత్మ మరియు శరీరము, రెండింటినీ పావనముగా తయారుచేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ, ఇతరులకు కూడా ఈ యాత్రను నేర్పించాలి.
2. ఎంత వీలైతే అంత, సత్యమైన సంపాదనలో నిమగ్నమైపోవాలి. నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో దృఢముగా అవ్వాలి.
వరదానము:-శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం తాకట్టుగా భావిస్తూ కార్యములో ఉపయోగించే నష్టోమోహా భవ
ఎలాగైతే ఎవరిదైనా తాకట్టు వస్తువు ఉంటే, ఆ తాకట్టు వస్తువు పట్ల నాది అనే భావన ఉండదు, మమకారము కూడా ఉండదు. అలాగే ఈ శరీరము కూడా ఈశ్వరీయ సేవ కోసం ఒక తాకట్టు వంటిది. ఈ తాకట్టును ఆత్మిక తండ్రి ఇచ్చారు కనుక తప్పకుండా ఆత్మిక తండ్రి స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినట్లయితే ఆత్మికత వస్తుంది, ‘నాది’ అనే మమకారము ఉండదు. నిరంతర యోగులుగా, నష్టోమోహులుగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కనుక ఇప్పుడు ఆత్మికత యొక్క స్థితిని ప్రత్యక్షము చేయండి.
స్లోగన్:-వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలంటే దృష్టి-వృత్తిలో కూడా పవిత్రతను అండర్ లైన్ చేయండి.
అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
మీ యొక్క ప్రతి మాట మహాన్ గా ఉండాలి. ప్రతి మనసా సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురముగా ఉండాలి. ప్రతి ఒక్కరినీ ఉన్నతిలోకి తీసుకువెళ్ళే స్వభావము, మధురతా స్వభావము, నిర్మానతా స్వభావము ఉండాలి. నా స్వభావమే అలాంటిది అన్న మాట ఎప్పుడూ మాట్లాడకండి. ‘నాది’ అనేది ఎక్కడి నుండి వచ్చింది! నాకు గట్టిగా మాట్లాడే స్వభావము ఉంది, నాకు ఆవేశములోకి వచ్చే స్వభావము ఉంది. స్వభావానికి వశమవ్వటము - ఇదే మాయ. ఇప్పుడు మాయాజీతులుగా అవ్వండి. అభిమానాన్ని లేక నిరాశపడే స్వభావాన్ని, ఈర్ష్యను మరియు ఆవేశములోకి వచ్చే స్వభావాన్ని ఇప్పుడు పరివర్తన చేయండి.
"

