#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు
*బాబూ.. మీ పాలనపై నమ్మకం లేదా❓*
MAY 24, 2026🎯
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కేవలం తిరస్కరించడానికి మాత్రమే జరుగుతున్నాయి. ఇందుకు గత రెండు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశు అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు భావించారు. ఆ మేరకు ఆయన నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు.
అయితే ప్రజల అంచనాలకు తగ్గట్టు చంద్రబాబు పరిపాలన సాగించలేదు. దీంతో 2019లో చంద్రబాబును వద్దని జనం అనుకున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.
ఐదేళ్ల జగన్ పాలనతో జనం విసుగెత్తారు. ఆ కారణంగా 2024 ఎన్నికల్లో జగన్ను జనం తిరస్కరించారు. దీంతో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది.
ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారు. ప్రశాంత జీవితాన్ని గడపాలనేది ప్రతి మనిషి ప్రాథమిక కోరిక. పరిపాలన ఆధారంగా మళ్లీ అధికారం ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఆధారపడి వుంటుంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకోడానికి సిద్ధంగా వుంది. ప్రస్తుతానికి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో సానుకూలత లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ పడాలని అంటుంటారు. ఈ లెక్కన చూస్తే ప్రజాభిమానాన్ని చూరగొనడంలో చంద్రబాబు విఫలమయ్యారని చెప్పొచ్చు.
సీఎం చంద్రబాబు తరచుగా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సొంత మీడియాలో కథనాలు చూస్తుంటాం. అంటే కూటమి ప్రజాప్రతినిధుల తీరు బాగాలేదని ఆయన వార్నింగ్లో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్' అని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా శాశ్వతంగా తామే అధికారంలో వుండాలని కోరుకోవడంలో తప్పులేదు. అందువల్ల చంద్రబాబు మాటల్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే కోరిక ఉన్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు. అందుకు తగ్గట్టు పరిపాలన సాగించాల్సింది తానే అని చంద్రబాబు విస్మరించడం విమర్శలకు దారి తీస్తోంది.
'ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి అది హానికరం. ఆ పార్టీ రాకూడదని పూజలు చేయాలి. గొడ్డలి పార్టీకిసహకరించకండి' అని ఆయన కోరారు. తన ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతో మాత్రమే అధికారంలో కొనసాగాలన్న ఆశ చంద్రబాబు మాటల్లో కనిపించింది. అంతే తప్ప, తనకు అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారని, అందుకు తగ్గట్టు ప్రజలకు మంచి చేయాలన్న తలంపు చంద్రబాబులో మచ్చుకైనా కనిపించడంలేదు. తన పరిపాలన మళ్లీ అధికారం కట్టబెడుతుందనే నమ్మకం చంద్రబాబులో ఇసుమంతైనా లేదని స్పష్టమవుతోంది.
ఇదిగో మీరు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చారని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫలానా మంచి పనులు చేస్తున్నానని ప్రజలకు చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా ఎంతకాలమని వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై వ్యతిరేకతతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివన్నీ తమ పాలనపై నమ్మకం లేని నాయకులు చేసే పనిగా నెటిజన్లు తప్పు పడుతున్నారు.
ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి మించిపోయింది లేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించాలి. అలాగే ప్రత్యర్థులపై వ్యతిరేకత సృష్టించడం ద్వారా కాకుండా, పాజిటివ్ ఓట్తో తిరిగి అధికారంలోకి రావచ్చనే ఆలోచనతో బాబు అండ్ కో ముందుకు నడిస్తేనే భవిష్యత్ వుంటుందని నెటిజన్లు హితవు చెబుతున్నారు.
ఐదేళ్ల పరిపాలనపై తీర్పు చెప్పే బాధ్యత ప్రజలపై వుంటుంది. ప్రజల మనసెరిగి పాలన చేస్తున్నామా? లేదా? అనేది చంద్రబాబు సమీక్షించుకోవాలి. అంతే తప్ప, గొడ్డలి పార్టీ, తల్లీచెల్లి అంటూ మాట్లాడ్డం ద్వారా ఓట్లు రాలుతాయని అనుకోవడమంత అజ్ఞానం మరొకటి వుండదని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా?


