ShareChat
click to see wallet page
search
*_సంపూర్ణ మహాభారతము_* *_270 వ రోజు_* *_భీష్మ పర్వము తృతీయాశ్వాసము:_* *_భీష్ముడు తనను పడొగొట్టే మార్గము చెప్పుట_* *_భీష్ముడు "ధర్మనందనా! నేను యుద్ధ భూమిలో ఉన్నంత కాలం మీకు రాజ్యప్రాప్తి కలుగదు. నన్ను నిర్జిస్తేగాని మీకు రాజ్యప్రాప్తి కలుగదు" అన్నాడు._* *_ధర్మరాజు "పితామహా! రణభూమిలో మీరు త్రిశూలం ధరించిన రుద్రునిలా నిలబడినంత కాలం మిమ్ము గెలుచు వీరుడెవ్వడు. కనుక మిమ్ము గెలుచు ఉపాయము మాకు చెప్పవా" అన్నాడు_*. *_“ధర్మనందనా! నీవు చెప్పింది యధార్ధం నా చేత ఆయుధం ఉండగా నన్ను గెలుచుట అసాధ్యం. నా శక్తి తెలుసుకుని నన్ను గెల్చు ఉపాయం తెలుసుకొన వచ్చారు. మీకు సహాయం చేయుట కంటే సుకృతం ఏముంది. నేను ఆయుధం విసర్జించిన నన్ను గెలువ వచ్చు. నేను కవచం తీసిన వాడిని, ఆయుధం ధరింపని వాడిని, కేతనమును దించిన వాడిని, స్త్రీలను, స్త్రీగా ఉండి పురుషునిగా మారిన వాడిని, తలపాగా తీసిన వాడిని, అన్నదమ్ములు లేని వాడిని, పుత్రులు లేని వారు ఎదురైన వారితో యుద్ధం చేయను. వెంటనే నా ఆయుధములను విడిచి పెడతాను. పుట్టుకతో పురుషుడు కాక దైవత్వంతో పురుషుడైన వాడితో నేను యుద్ధం చేయను. ద్రుపద కుమారుడు శిఖండి పుట్టుకతో స్త్రీ అయి దైవీకంగా పురుషత్వం పొందాడు. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేసిన నేను ఆయుధము విసర్జిస్తాను. అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని నన్ను సంహరించవచ్చు. తరువాత బంధు మిత్ర సహితంగా సుయోధనుని గెలుచుట సులభం” అన్నాడు._* *_వచ్చిన కార్యం సఫలమైంది అనుకుని ధర్మనందనుడు తమ్ములతో తమ శిబిరానికి మరిలాడు. దారిలో "తన మరణమునకు తానే దారి చెప్పిన భీష్ముని తలచుకుని విషాదం నిండిన హృదయముతో అర్జునుడు "కృష్ణా! భీష్ముడు లోక మాన్యుడు, దయాళువు, వయోవృద్ధుడు అలాంటి మహానుభావుని చంపడానికి నాకు మనస్కరించుట లేదు. మట్టిలో ఆడుకుని వచ్చిన నన్ను ఎత్తుకుని ముద్దాడి చిన్నతనంలోనే గతించిన నా తండ్రిని తలచుకుని ఆయన కంట తడి పెట్టుకునే వాడు. తండ్రిని కోల్పోయిన మమ్ము చేరదీసి అల్లారు ముద్దుగా పెంచిన తాతాగారిని నేను ఎలా చంపగలను. పితామహుడు పరాక్రమంతో సైన్యాలను అంతమొందించినా ఉపేక్షిస్తానుకాని చంపను ధర్మనందనుని తమ్ములు అంత కృూరులు కాదు కదా" అన్నాడు_*. *_ఆ పలుకులు విని కృష్ణుడు.. “అర్జునా! నీకు క్షత్రియ ధర్మం తెలియదా! క్షత్రియులు కొంచెం క్రూరత్వం అవలంబించి కలత చెందక శత్రు సంహారం చేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజలు కట్టు పన్నుతో ప్రజాశ్రేయస్సు కొరకు పాటు పడాలి. రాజధర్మం ఇదేనని బృహస్పతి ఇంద్రునకు చెప్పాడు. నీవు భీష్ముని చంపుతానని ప్రతిన చేసావు. ఆ మాట తప్పుట న్యాయమా! లోకులు నిన్ను చూసి నవ్వరా. ఇది రాజ ధర్మమే కాని క్రూరకర్మము కాదు. ఖేదము వదిలి భీష్ముని చంప ప్రయత్నించు" అన్నాడు_*. *_“అది సరే కృష్ణా! భీష్ముని చంపడానికి శిఖండి పుట్టాడు అంటారు కదా! శిఖండిని చూసిన పితామహుడు యుద్ధం చేయడు కదా! నేను వేరొకరిని చంపుతాను. శిఖండి భీష్ముని చంపుతాడు" అన్నాడు_*. *_“అర్జునా! ఇక మాటలేల భీష్ముని మరణం నీ చేతిలో ఉంది. నీ వెంత కాదన్నా విధి లిఖితం మార్చుట అసాధ్యము. ఇతర మాటలతో కాలయాపన చేయక భీష్ముని వధించు" అన్నాడు._* *_అర్జునుడు "రేపటి యుద్ధం ఎలా జరగాలో అలా జరుగుతుంది మీరు చెప్పినట్లే చేస్తాను" అన్నాడు_*. *_అందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అది విన్న దృతరాష్ట్రుడు “సంజయా! పాండు సుతులు ఎలా శిఖండిని ముందు పెట్టుకుని భీష్మునితో యుద్ధం చేసారు నాకు వివరించు " అన్నాడు_* #మన సంప్రదాయాలు సమాచారం