సమయోచితం
మనం ఏదైనా పని ప్రారంభించగానే సహజంగానే, సాటి వారి నుంచి ఎంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎంత ఎక్కువ ప్రతికూలత ఎదురైతే, సంకల్పించిన కార్యక్రమం అంత బాగా విజయవంతమయ్యే అవకాశాలుంటాయి... అన్నారు స్వామి వివేకానంద ఓ సందర్భంలో. నదికి రాళ్లూరప్పలు, చెట్లూచేమలు అడ్డం వస్తేనే కదా మరి ప్రవాహం వేగం పుంజుకునేది! ప్రపంచ సర్వమత మహాసభలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లినపుడు, వివేకానందుడి వేషబాషలు చూసిన నిర్వాహకులు, ఆయన ప్రతిభా పాటవాలను తక్కువగా అంచనా వేశారు. ప్రసంగించేందుకు కేవలం కొద్ది నిమిషాల సమయమే కేటాయించారు. ‘అన్నదమ్ములారా, అక్కచెల్లెళ్లారా’ అన్న స్వామి తొలిపలుకులకు స్పందనగా మిన్నంటిన కరతాళధ్వనులు సద్దుమణిగేసరికే ఆయనకు కేటాయించిన సమయం అయిపోయింది! ఆ తరవాత చాలాసేపు, నిర్వాహకులతో సహా అందరూ మంత్రముగ్ధులై స్వామి ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు.
సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలిగితే విజయం అదే లభిస్తుంది. అలాగే, సమయోచితంగా స్పందించకపోతే కోరి అనర్థాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ శాంతిదూతగా కౌరవ సభకు వెళ్లాడు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణాచార్యుడు తదితరులు అక్కడ శ్రీకృష్ణుడికి గౌరవ, మర్యాదలు ఇచ్చారు. దుర్యోధనాదులు మాత్రం ఆయనపట్ల అమర్యాదకరంగా నడచుకున్నారు. ఫలితంగా మహా సంగ్రామం తప్పలేదు. దౌత్య సమయంలో దుష్ట చతుష్టయం తప్పుడు స్పందన ఒక వంశం నాశనానికి కారణమైంది.
ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల ప్రభావంతో వాలికి ఎదురుగా పోరాడే వారి సగం బలం అతడికి సంక్రమిస్తుంది. వాలి కిష్కింధ నుంచి తరిమేయడంతో సుగ్రీవుడు అనుచరులతో రుష్యమూక పర్వతంపై నివసిస్తున్నాడు. సీతమ్మ జాడకోసం వెతుకుతూ అక్కడికి వచ్చాడు శ్రీరాముడు. సుగ్రీవుడితో మైత్రి కుదిరిన తరవాత అతడి కోరిక మేరకు వాలిని సంహరించడానికి రాముడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు అన్నని యుద్ధానికి పిలుస్తాడు. ‘ఇన్నిసార్లు నా చేతిలో చావు దెబ్బతిన్నా వీడికి బుద్ధి రాలేదు’ అనుకుని వాలి యుద్ధం చేసి మరోసారి సుగ్రీవుణ్ని ఓడిస్తాడు. అన్నదమ్ములు ఒకేలా ఉండటంతో గుర్తుపట్టడానికి వీలుగా సుగ్రీవుణ్ని మెడలో గజపుష్పతీగ హారం ధరించమంటాడు శ్రీరాముడు. అలా అన్నని మళ్లీ యుద్ధానికి రమ్మంటాడు. ఓడిపోయి పారిపోయిన వాడు తిరిగొచ్చి పిలుస్తున్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని, వెళ్లొద్దని చెబుతుంది తార. భార్య మాటని లెక్కచేయకుండా మరోసారి తమ్ముణ్ని ఓడిద్దామని వెళ్లి మృత్యువు పాలవుతాడు వాలి.
మన ప్రవర్తన, మాట తీరు... సమయ సందర్భాలకు తగినట్లుగా ఉండాలి. అప్పుడే మర్యాద, మన్నన లభిస్తాయి. ప్రమాదాలు తప్పుతాయి. పట్టుదుస్తులు కట్టుకుని పరామర్శకు వెళ్లలేం. వేడుకలకు వెళ్లేటప్పుడు ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి వెళ్తాం. ప్రవర్తన కూడా అంతే. ఓపిగ్గా పరిస్థితులను సమీక్షించుకుని తదనుగుణంగా ప్రవర్తించే వారికి అంతా మంచే జరుగుతుంది.
#🙏ఓం నమః శివాయ🙏ૐ #😃మంచి మాటలు


