#తమిళనాడు రాజకీయాలు 🚩🥱
#🔴విజయ్ అనే నేను..తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం🪑
*విజయ్లో ఓ సుగుణం… తక్కువ మాట్లాడతాడు… అవసరమైతే తప్ప…‼️*
May 10, 2026🎯
Vamsy Krishna……
సమయానికి తగు మాటలాడి… మౌనం మహభాషణం అంటారు. నిశ్శబ్దాన్ని మించిన సంభాషణ లేదు అంటారు. మాటకూ మౌనానికి నడుమ పోటీపెడితే మౌనమే గెలుస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య భావ ప్రసారానికి మాటలు ఎంత ముఖ్యమో మౌనం కూడా అంతే ముఖ్యం. ఒక్కొక్కసారి మౌనమే మరింత ముఖ్యం. మాటలను అర్ధం చేసుకోవచ్చు. అపార్ధమూ చేసుకోవచ్చు. మౌనం లో ఎన్ని అర్ధాలున్నా అన్ని అర్ధాలూ మౌనం లోనే లయించి మౌనమనే ఒకే ఒక అర్ధం మిగులుతుంది.
ఆత్మనో ముఖదోషేణ బధ్యంతే శుకసారికాః |
బకాస్తత్ర న బధ్యంతే మౌనం సర్వార్థ సాధకమ్ ||
చిలకలు, గోరువంకలు వాటి మాటల వల్ల పంజరంలో చిక్కుంటాయి. కానీ కొంగలు ఎక్కడా, ఏ పంజరంలోనూ చిక్కుబడవు. ఎందుకంటే అవి మౌనంగా ఉంటాయి . మౌనం అనేది అన్ని పనులను సాధించిపెట్టే గొప్ప ఆయుధం. ఎక్కడా ఏ గొడవలోనూ చిక్కుకోకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి. మౌనేన కలహం నాస్తి.
జీవితంలోనే కాదు రాజకీయాలలో కూడా మౌనానిది ప్రధానమైన పాత్రే.
అధికారంలో వున్న వాళ్ళు, అధికారానికి దగ్గరగా వున్నవాళ్లు, అధికారానికి రావాలి అనుకునే వాళ్ళు అనర్గళముగా మాట్లాడి తమ భావాలను పంచుకోవడానికి, తమ భావాల ద్వారా ఎదుటివారిని ఇన్స్పైర్ చేయడానికి ఎన్ని రిహార్సల్స్ వేసుకుని కష్టపడతారో, మౌనంగా ఉండటానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి.
ఎప్పుడు మాట్లాడాలి? ఎప్ప్పుడు మాట్లాడకూడదు అనే విచక్షణను కరతలామలకం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. సమయానికి తగు మాటలాడటం రానప్పుడు మౌనంగా ఉండటమే మేలు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మౌనానికి పెట్టింది పేరు. “నిశ్శబ్దం కూడా ఒక సమాధానమే” Silence is also an answer అన్నట్లుగా ఆయన కఠినమైన సమస్యలను కూడా మౌనంతోనే ఎదుర్కొనేవారు. ఒక్కొక్కసారి ఏ నిర్ణయమూ తీసుకోకపోవడమే ఒక మంచి నిర్ణయంగా భావించేవారు. కొన్ని సమస్యలకు కాలం కంటే గొప్పగా ఎవరూ జవాబు చెప్పలేరు కదా! ఆయనను ‘మౌన ముని’ అనేవారు అందుకే…
ఆయన అడుగుజాడల్లోనే నడిచారు మరో ప్రధాని డాక్టర్ మనోహ్మన్ సింగ్. రాజకీయాల్లో “ఏం మాట్లాడాలి?” అనే దానికంటే “ఎప్పుడు మౌనంగా ఉండాలి?” అని తెలియడం ఎక్కువ ముఖ్యం. అలా తెలిసిన వాళ్ళకి “Silence is the best response to a fool, and the best strategy against a foe” అని అర్ధం అవుతుంది.
నిజానికి మౌనం అనేది చేతగానితనం కాదు, అది ఒక గంభీరమైన వ్యూహం. మాటలు మనిషి అంతరంగాన్ని బయటపెడితే, మౌనం ఆ అంతరంగాన్ని రక్షిస్తుంది. రాజకీయ యవనికపై అగ్నిపర్వతంలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, ఆ వేడిని తగ్గించడానికి మౌనం ఒక చల్లని చినుకులా పనిచేస్తుంది. ఎదుటివారి విమర్శలకు తక్షణమే స్పందించడం వల్ల ఆ వివాదం మరింత ముదురుతుంది తప్ప పరిష్కారం లభించదు.
మౌనంగా ఉండి సమయం కోసం వేచి చూడటం, పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడం ఒక పరిణతి చెందిన నాయకత్వ లక్షణం. మనోహన్ సింగ్ గారి హయాంలో కూడా విమర్శల హోరు పెరిగినప్పుడు ఆయన తన మౌనం ద్వారానే ఒక స్థిరత్వాన్ని ప్రదర్శించారు.
రాజకీయాల్లో మితభాషణం అనేది ఒక కళ అయితే, మౌనం అనేది ఒక తపస్సు. ఒక్కోసారి నాయకుడు చెప్పే వేయి అబద్ధాల కంటే, ఆ నాయకుడు వహించే అర్థవంతమైన మౌనం ప్రజల్లో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ప్రత్యర్థులు ఉచ్చు బిగిస్తున్నప్పుడు, మౌనం ఆ ఉచ్చులో పడకుండా కాపాడుతుంది. ఏ సందర్భంలో మౌనం వహించాలో తెలిసిన వాడు లోకాన్ని శాసిస్తాడు.
తాజాగా నటుడి నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన జోసెఫ్ విజయ్ కీలక సందర్భాలలో మౌనాన్నే ఆశ్రయించాడు. ఆయన శబ్దం ద్వారా కంటే నిశ్శబ్దంలో నుంచే ఎక్కువ మాట్లాడాడు. అతడి నిశబ్దం జెన్ జెడ్ తరానికి బాగా కనెక్ట్ అయినట్టుంది. టి వి కె పెట్టిన తరువాత పోయినసంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన కరూర్ స్టాంపేడ్ విజయ్ ఎదుర్కున్న మొదటి సవాల్.
41 మంది అమాయక జనం అసువులు బాసారు. అతడి మీద ముప్పేట దాడి జరిగింది. అతడిని అరెస్ట్ చేయాలన్నారు. విజయ్ సభాస్థలికి ఏడు గంటలు ఆలస్యంగా రావడం పట్ల ప్రత్యర్థి పార్టీలు ఎంత రచ్చ చేయాలో అంత రచ్చా చేశాయి. విజయ్ పెదవి విప్పి ఒక్క మాటా మాట్లాడలేదు. వారం రోజుల తరువాత బాధిత కుటుంబాలను కలుసుకుని ఓదార్చి తాను చేయవలసిన సహాయం ఏదో చేసాడు.
ఆ తరువాత రెండు నెలల పాటు బహిరంగ సభలు వాయిదా వేసుకుని చేసుకోవలసిన మార్పులేవో చేసుకున్నాడు. కరూర్ తొక్కిసలాటకు సంబంధించి సి బి ఐ రెండు సార్లు ఢిల్లీ పిలిపించి విచారణ చేసింది. నిశ్శబ్దంగా హాజరై చెప్పాలిసింది ఏదో చెప్పేశాడు. ఎవరి మీదా ఆరోపణలు లేవు. ఎవరినీ నిందించలేదు.
సంక్రాంతి రావలసిన జననాయగన్ సెన్సార్ చిక్కుల్లో పడింది.
సినిమాలో రాజకీయ సంభాషణలు ఉన్నాయని సెన్సారు బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకుండా విత్ హెల్డ్ లో పెట్టింది. అయినా ఇది కుట్రపూరిత చర్య అని విజయ్ ఎక్కడా నోరు విప్పలేదు. చివరకు విడుదల కాకుండానే హెచ్డీ ప్రింట్ లీక్ అయి నిర్మాతలకు నష్టం చేసింది. అయినా విజయ్ మాట్లాడలేదు.
ఫిబ్రవరిలో భార్య సంగీత విడాకుల నోటీస్ ఇచ్చింది. త్రిషతో తన సంబంధాలు చర్చనీయాంశం అయ్యాయి. అయినా విజయ్ ఎక్కడా మాట జారలేదు. ఒక బహిరంగ సభలో మాత్రం “Don’t worry about the recent problems surrounding me. Those issues are not worth it.” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు.
ప్రచారంలో కూడా స్టాలిన్ సార్ అంటూ మర్యాదపూర్వకంగా తాను చెప్పాలి అనుకున్నది చెప్పాడు తప్పిస్తే ఎవరికీ తాట తీస్తాను అనలేదు. తోలు వలుస్తాను అనలేదు.
ఏ బహిరంగ సభలోనూ హద్దు దాటి మాట్లాడలేదు. గౌరవనీయ గవర్నర్ గారిని మూడుసార్లు కలిసాడు. సహనం కోల్పోలేదు. సమాజం తన నుండి ఏదో ఒక వ్యాఖ్య, ఏదో ఒక జవాబు ఆశించిన ప్రతిసందర్భంలోనూ విజయ్ మౌనాన్నే ఆశ్రయించాడు. ఈ మౌనం కాకతాళీయం కాక వ్యూహాత్మకం అయితే విజయ్ సరైన దారిలోనే ఉన్నట్టు లెక్క.
పబ్లిక్ లైఫ్ లో వున్నప్పుడు సెలబ్రిటీ చేసే ప్రతి వ్యాఖ్యను , పలికే ప్రతి మాటనూ ప్రత్యర్ధులు టార్గెట్ చేస్తారు. ఒక మాట అంటే వంద అర్ధాలు తీస్తారు. వెయ్యి అపార్ధాలు వెతుకుతారు. నిజానికి తమిళ రాజకీయాలు అంటేనే దూషణ భూషణలు తారస్థాయిలో ఉంటాయి. రెండు ద్రావిడ పార్టీలు యాభయ్ ఏళ్లుగా తమిళ సమాజంలో ఎంత ధ్వని కాలుష్యాన్ని వెదజల్లాలో అంత కాలుష్యాన్నీ వెదజల్లాయి.
విజయ్ నిశ్శబ్దం కాకుల రొదలో కోకిల సంగీతంలాగా వినిపించింది. తమిళ జెన్ జెడ్ తరానికి. సోషల్ మీడియాలో నిత్యం కనబడే రచ్చ రచ్చకి విసిగి పోయి వున్న కొత్త తరానికి విజయ్ నిశ్శబ్దం నిలకడగా కనిపించింది. అందుకే 108 సీట్లు కట్టబెట్టారు.
విజయ్ “Action speaks louder than words” (మాటల కంటే పనులే ఎక్కువ మాట్లాడాలి) అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు అంటే తప్పేమీ లేదు. ప్రత్యర్థులు విమర్శలతో గొడవకు దిగుతున్నప్పుడు ఆయన తన పని ద్వారా (కరూర్ బాధిత కుటుంబాలను కలవడం, కన్యాకుమారి బాధితులతో మమేకం అవడం) సమాధానం చెప్పడం విజయ్ లో ఒక పరిణతి చెందిన నాయకుడు వున్నాడు అని చెప్పడానికి ఉదాహరణలు.
మౌనంలో ఒక నిగూఢమైన శక్తి ఉంటుంది; అది శత్రువును అయోమయంలో పడేస్తుంది, మిత్రుడికి భరోసానిస్తుంది. మౌనం లోపల జరిగే మథనం బయటకు కనిపించదు కాబట్టి, అది నాయకుడి తదుపరి అడుగును అత్యంత శక్తివంతం చేస్తుంది. చివరకు, శబ్దం సృష్టించలేని ప్రభావాన్ని నిశ్శబ్దం సృష్టిస్తుంది కాబట్టే, రాజకీయ చదరంగంలో మౌనం అనేది ఎప్పటికీ ఒక తిరుగులేని ఎత్తుగడగా మిగిలిపోతుంది.
మౌనం కేవలం ఒక సమాధానం మాత్రమే కాదు, అది ఒక పరిపూర్ణమైన యుద్ధతంత్రం. అందుకే విజ్ఞులు మౌనం సర్వార్థ సాధకం అని ఊరికే అనలేదు. “సమయానికి తగు మాటలాడటం ఎంత ముఖ్యమో, సమయం కాని వేళ మౌనంగా ఉండటం అంతకంటే ముఖ్యం


