7️⃣6️⃣.
*_శ్రీ మహావిష్ణు పురాణం_*
*_డెభ్బై ఆరవభాగం_*
*_గంగాదేవి జనన కథ:_*
*_కపిల మహర్షి అంశుమంతుడి కోరిక పై గంగాదేవి జనన వృత్తాంతం_* చెబుతున్నారు..
*“పూర్వం కార్తీక పౌర్ణమి నాడు గోలోకంలో రాధా మహోత్సవం జరిగింది. రాధాదేవి కృష్ణులను దర్శించడానికి శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు,సప్తఋషులు, బ్రహ్మర్షులు,దేవర్షులు,మహర్షులు తదితరులు గోలోకం విచ్చేశారు*. *రాసమండలంలో రాధాదేవిని సింహాసనం పై కూర్చుండబెట్టి కృష్ణుడు పూజించాడు. ఉత్సవం ఆరంభమైంది*. *రాధాకృష్ణులతో పాటు గోపికలు నృత్యం ఆరంభించారు*.
*రాధాకృష్ణులను ప్రశంసిస్తూ శివుడు వీణ వాయిద్యం చేస్తూ దివ్య గానం చేయసాగాడు.* *శివగాన మాధుర్యానికి సకల జగత్తుతో పాటు సభికులు తన్మయులై మైమరచిపోయారు*.
*శివగానామృతం మూడు రోజులు నిరంతరాయంగా జరిగింది. సభికులు అందరు కన్నులు మూసుకుని గాన మాధుర్య సముద్రంలో మునిగిపోయారు*.
*శివుడు గానం ముగించగానే సభికులు అందరు కళ్ళు తెరచి చూశారు. ఆశ్చర్యం గోలోకమంతా జలమయమై ఉంది. రాధాకృష్ణులు కనిపించలేదు. సృష్టికి మూల మూర్తులైన ప్రకృతి పురుషులు ఎందుకు అదృశ్యమయ్యారు? అని అందరు ఆలోచనలో పడి విచారగ్రస్తులైనారు. బ్రహ్మదేవుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసు కున్నాడు*.
*సభికులను వుద్దేశించి "ఇంద్రాది దేవతలారా! మహర్షులారా! కంగారు పడకండి. పరమేశ్వరుని గానానికి పరవశించి కరిగిపోయిన రాధాకృష్ణులు జలరూపం దాల్చారు. మనం ప్రార్ధన చేస్తే తమస్వస్వ రూపాలలో దర్శన మిస్తారు" అని చెప్పగా శివుడు బ్రహ్మ దేవునితో పాటు దేవతలు మహర్షులు రాధాకృష్ణులను దర్శనమిమ్మని ప్రార్ధించారు*.
*రాధాకృష్ణులు తమస్వస్వరూపాలలో ప్రత్యక్షమైనారు. వారితో పాటు గోలోకంలో ప్రవహించిన జలం అందమైన స్త్రీ రూపం దాల్చి కృష్ణుని రెండవ పక్కన ప్రత్యక్షమైంది. ఆమెయే గంగా దేవి. శివగాన మాధుర్యానికి పరవశించిన రాధాదేవి శరీర స్వేదమే గంగాదేవిగా అవతరించింది. గంగాదేవి రాధాదేవి యొక్క పార్షద అనగా ప్రతిరూపం!*
*ఈ విషయం తెలియని రాధాదేవి కృష్ణుని పక్క తనంత అందంగా మెరిసిపోతున్న గంగాదేవిని చూసి అసూయ చెందింది. కోపంతో "ఎవరు నీవు? నా ప్రాణనాథుడైన కృష్ణుని చెంత చేరావు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో! లేదంటే విరాటరూపం దాల్చి నిన్ను ఇప్పుడే మ్రింగివేస్తాను" అని బెదిరించింది.*
*గంగాదేవి రాధాదేవి మాటలకు భయపడి యోగశక్తితో అదృశ్యమై సూక్ష్మరూపం దాల్చి కృష్ణుని కాలి బొటనవ్రేలు ద్వారా పాదములో ప్రవేశించి దాక్కుంది. బ్రహ్మదేవుడు రాధాదేవిని శాంతపరుస్తూ “రాధాదేవీ!ఆమె ఎవరోకాదు. జలరూపం దాల్చి నీ శరీరం నుండి బయటకు వచ్చిన పార్షద(ప్రతి రూపం). నీ అంశ. నీవు శాంతిస్తే కృష్ణపాదం నుండి బయటకు వస్తుంది. ఆమెను నేను వైకుంఠం తీసుకువెళ్లి శ్రీమహావిష్ణువుతో వివాహం చేయిస్తాను. నీకు కృష్ణునికి ఏఇబ్బంది రాదు. సోదరిగా భావించి ఆమెను ఆహ్వానించుము" అని పలికాడు*.
*శాంతించిన రాధాదేవి ప్రేమగా పిలవడంతో గంగాదేవి కృష్ణుడి పాదం నుండి బయటకు వచ్చి నిలిచింది. విష్ణు స్వరూమైన కృష్ణుడి పాదం నుంచి ఉద్భవించిన గంగాదేవి "విష్ణు పాదోద్భవి" గా పేరు పొందింది.* *బ్రహ్మదేవుడు జలరూపం దాల్చిన గంగాదేవిని తన కమండలంలో నింపుకుని ఊర్ధ్వలోకాలు అన్నీ తిరుగుతూ గంగను ప్రవహింప చేసి వైకుంఠం చేరాడు. ఊర్ధ్వలోకాల దాహార్తి తీర్చిన గంగాదేవి మందాకినిగా ప్రసిద్ధి చెందింది*.
*వైకుంఠం చేరిన బ్రహ్మదేవుడు తన వెంట స్త్రీ రూపంతో వచ్చిన గంగాదేవిని నారాయణునికి పరిచయం చేసి "నారాయణా! ఈమె పరమపావని అయిన గంగాదేవి*. *జలమునకు అధిష్టాన దేవతగా రాధాదేవి నుండి ఉద్భవించింది. ఈమెకు తగిన వరుడివి నీవే! నీ పాదపు బొటనవ్రేలు నుండి ప్రవహించి ముల్లోకాలను పవిత్ర గంగాజలంతో పునీతం చేస్తుంది. గాంధర్వ విధిన గంగాదేవిని వివాహం చేసుకో మని" అర్ధించాడు*.
*మహావిష్ణువు సరేనని గంగా దేవిని గాంధర్వ పద్దతిలో వివాహం చేసుకున్నాడు. రాధాదేవి అంశగా ఉద్భవించిన గంగాదేవి విష్ణు పత్ని అయ్యింది. గంగాదేవి తనకు వివాహం జరిపించిన బ్రహ్మదేవుని పితృ సమానుడిగా గౌరవించి "తండ్రీ! ఎప్పుడు జగత్తు అవసరం కోసం నన్ను మీరు పిలుస్తారో, అప్పుడు నా భర్త అనుమతి పొంది వచ్చి మీ కోరిక తీరుస్తాను" అని మాట ఇచ్చింది*.
*కపిలుడు గంగాదేవి జనన కథ చెప్పి "అంశుమంతా! అటువంటి పవిత్ర ఆకాశ గంగను, నీవుగానీ, నీ వంశజులు గానీ భూలోకానికి తీసుకువచ్చి పాతాళంలో గల నీ తండ్రుల భస్మరాశులపై ప్రవహింప చేయాలి. అప్పుడు వారికి ప్రేత రూపాలు పోయి సద్గతులు లభిస్తాయి" అని ఉపాయం చెప్పాడు*.
*అంశుమంతుడు కపిల మహర్షి* *ఆశీర్వచనం, అనుమతి తీసుకుని యాగాశ్వంతో* *సగరుని అశ్వమేధ యాగ ప్రదేశానికి* *వచ్చి తాతగారికి*
*జరిగింది అంతా వివరించాడు*.
*కుమారులకు పట్టిన దుర్గతికి సగరుడు చింతించాడు. ఇంద్ర పదవి కోరనని ఇంద్రునికి మాట ఇచ్చి అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు*. *గంగాదేవిని తెచ్చి తన పుత్రులకు సద్గతి కలిగించాలని సగరుడు*
*అంశుమంతునికి పట్టాభిషేకం చేసి అడవులకు వెళ్లి బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు*.
*కానీ గంగాదేవిని తెచ్చే కోరిక తీరకనే దేహం వదిలి స్వర్గస్థుడు అయినాడు. తాతగారి కోరిక తీర్చి పినతండ్రులకు సద్గతి కలిగించాలని అంశుమంతుడు తనకు కుమారుడు దిలీపుడు జన్మించి పెద్దయిన తరువాత పట్టాభిషేకం చేసి తపస్సుకి వెళ్లాడు. అంశుమంతుడు కూడా గంగాదేవిని తేకుండానే దేహం చాలించాడు*. *దిలీపుడు కూడా తాత తండ్రుల వలె గంగాదేవిని భూమికి తీసుకురావడానికి విఫల ప్రయత్నం చేసి మరణించాడు*.
*దిలీపునికి ఖట్వాంగుడు అనే మరోపేరు ఉంది*. *ఇతనికి దీర్ఘ బాహువు, భగీరథుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. తండ్రి తరువాత అన్నగారు రాజ్యపాలన చేపట్టడంతో యువకుడైన భగీరథుడు గంగాదేవిని భూమిపైకి తీసుకు రావడానికి తపస్సుకి వెళ్లిపోయాడు.*
*బ్రహ్మ దేవుని అనుగ్రహం పొందటం కోసం ఘోర తపస్సు చేయసాగాడు* #మన సంప్రదాయాలు సమాచారం

