#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*భలే మంచి బాబు బేరం❗*
MAY 18, 2026🎯
చంద్రబాబుకి గొప్పగొప్ప ఐడియాలు వస్తూ వుంటాయి. ఇప్పుడు కొత్తగా పిల్లలే సంపద అంటున్నారు. ముగ్గుర్ని కంటే రూ.30 వేలు, నలుగురైతే రూ.40 వేలు. బాబు ఉచిత పథకాల కంటే ఇది డేంజర్.
ఆయన మాటలు విని ముగ్గుర్ని కంటే ఏడాది డైపర్లకు కూడా రూ.30 వేలు చాలదు. నలుగురిని కంటే దేవుడే కాపాడాలి. వెనుకటికి కుటుంబ నియంత్రణ పద్దతులు తెలియక దేవుడి మీద భారం వేసి కనేవాళ్లు. ఎలాగో పెరిగి పెద్దవాళ్లై ఏవో పనులు చేసుకుని బతికేసేవాళ్లు. ఇప్పుడు బతకడం కంటే బాగా బతకడం ముఖ్యం. బాగా బతకాలంటే ఆదాయం వుండాలి.
ఒకప్పుడు పిల్లలకి తిండి పెడితే చాలు, అదే ఖర్చు. స్కూళ్లలో చదువుకునే వాళ్లు రోగం వస్తే గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లేవాళ్లు.
విద్యావైద్యం ప్రైవేటికి అప్పజెప్పి జనాలకి ఖర్చు పెంచింది ప్రభుత్వమే. సమాజానికి అతి ముఖ్యమైన ఆ రెండు వ్యవస్థల్ని నాశనం చేసి పేదవాళ్లు సైతం తమ బిడ్డల్ని కాన్వెంట్లకి పంపాలని కోరిక పుట్టించి, పిల్లలకి బాగలేకపోతే అప్పు చేసైనా ప్రైవేట్ ఆస్పత్రులకి వెళ్లే స్థితిని కల్పించిన పాలకులు ఇప్పుడు కొత్త సుద్ధులు చెబుతున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎంతసేపూ హైటెక్ సిటీ అంటాడు తప్ప పావర్టీ(పేదరికం) గురించి మాట్లాడరు.
ఏమైనా అంటే పీ4తో పేదల్ని పైకి తెస్తానని బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అని ఏవేవో పడికట్టు పదాలు మాట్లాడ్తారు. ఈ రెండేళ్లలో ఎన్ని బంగారు కుటుంబాలకు సాయం అందిందో చెప్పరు.
ఇప్పుడు పిల్లలే సంపద అంటున్నారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ మాట అంటున్నారు. అంటే మన సంపద మనమే సృష్టించుకోవాలి. సృష్టి కూడా అంత సులువు కాదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో తాట తీస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుకి ఇంత అని లంచం ఇవ్వాలి. నలుగురిని కంటే పెంచి పెద్ద చేయాలంటే నాలుగిళ్లలో దొంగతనం చేయాలి. లేదంటే నాలుగు పార్ట్ టైమ్ జాబ్లు చేయాలి.
ఉన్న జనాభాకే సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు వుంటే, ఇంకా జనాభా పెరిగితే ఓటర్లు పెరుగుతారంతే. సంపద పెరగదు.
ఇప్పుడీ పిలుపు వెనుక రహస్యం ఏమంటే లేబర్ దొరకడం లేదు. డ్రైవర్లు, తోటమాలి, వంటవాడు, సెక్యూరిటీ గార్డులు ఇబ్బడిముబ్బడిగా కావాలంటే పేదవాళ్లు పిల్లల్ని కనాలి. కలలు కనకూడదు. తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని కోరుకోకూడదు.
చంద్రబాబు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇలాంటి సలహాలు ఇవ్వకపోతే అదే పదివేలు.


